ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label మంచి మాట. Show all posts
Showing posts with label మంచి మాట. Show all posts

Saturday, June 1, 2013

జీవన సమరానికి తెరచిన దర్వాజా



ఆంధ్రభూమి
మాసపత్రిక

జూన్ '2013

సంచికలో

రావూరి భరద్వాజ
గారిపై
నా వ్యాసం

 
 

Saturday, March 23, 2013

ద్వితీయ వార్షికోత్సవం




24 మార్చి '2013



"'సుధామ'ధురం"

బ్లాగ్ కు

ద్వితీయ వార్షికోత్సవం

ఈ రెండేళ్ళుగా నెలకు సుమారు వెయ్యిమంది ఈ బ్లాగ్ ను వీక్షించారు.

నా అదనపు బ్లాగ్ 'తలుచుకునే తరుణాలు ' తో కలిపి
పేజ్ వ్యూస్ 50,000 వేలు
దాటినందుకు ఆనందంగావుంది.


ఇదంతా మీ ఆదరణే!

'సుధామధురం 'కు 73 మంది 'తలుచుకునేతరుణాలు ' కు 20 మంది ఫాలోయర్స్ ఈ కాలంలో ఏర్పడడం సంతృప్తిని కలిగించిన విషయం .

ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన అందరికీ
పేరుపేరునా ధన్యవాదాలు.


;




నా పోస్ట్ లపై వీక్షకుల కామెంట్లు,కొత్తగా ఫాలో అయ్యేవారి సంఖ్య,మునుముందు మరింతగాపెరుగుతూ ఇలాగే ఉత్సాహప్రోత్సాహాలు లభిస్తాయని ఆకాంక్షిస్తున్నాను.


సదా మీ

సుధామ







Thursday, March 1, 2012

ప్రియమైన మాట

‘‘సత్యమునే పలుకవలెను’’ - ‘‘అబద్ధమాడరాదు’’ అంటూ తరగతి గోడలమీద - పాఠశాలల్లో ఒకనాడు సూక్తులు బాగా కన్పించేవి. నిత్య జీవితంలో - అబద్ధాలు తేలికగా ఆడేసేవారే ఎక్కువగా కన్పిస్తూంటారుగానీ. సత్యవాక్కు నంటిపెట్టుకునేవారు సకృత్తుగానే ఉంటూంటారు.

‘వెయ్యి అబద్ధాలాడయినా ఒక పెళ్లి చెయ్యి’ లాంటి సామెతలున్నమాట నిజమేగానీ, అబద్ధమాడడమే వ్రతంగా పెట్టుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు పతనానికి దారితీస్తుంది. ‘నిజం నిప్పులాంటిది’ అని మనవాళ్ళు ఊరికే అనలేదు’. సత్యాన్ని అబద్ధాలతో ఎంతోకాలం కప్పెట్టి ఉంచలేం’ అన్నది యథార్థం.

సత్యవాక్కు యొక్క మహిమ గొప్పది! సత్య సంధుల నోటివెంట వెలువడిన మాట ‘మంత్రంలా’ నిజమై తీరుతుంది. సత్య హరిశ్చంద్రుడు - సత్యవాక్కుకు ప్రతీక. ఎన్ని కష్ట నిష్టూరాలు ఎదురయినా ఆడినమాట తప్పనివాడతడు


నీళ్ళున్న వందనూతులకంటే ఒక మంచినీటి బావి గొప్పది. అలాంటి వంద బావులు తవ్వించడంకంటే ఒక యజ్ఞం చేయడం పవిత్రం. అలాంటి వంద యజ్ఞాలకంటె ఒక కొడుకును కలిగి ఉండడం ప్రయోజనం. అలాంటి వందమంది కొడుకులవల్ల కలిగే మేలుకంటే ఒక సూనృతవాక్యం అనగా ‘సత్యవాక్కు’ గొప్పది అని నన్నయ అంటారు.

నిజం చెప్పేవాడిదే ‘వాక్‌శుద్ధి’. పనె్నండేళ్లు అబద్ధం ఆడకుండా ఉంటే అన్నమాట నిజమైపోతుందని పెద్దలంటారు. పండితులు, నిష్టాగరిష్ఠులు, జ్యోతిషవేత్తలు ‘సత్యసంధులుగా’ ఓ మాట అన్నారంటే అందుకే అది నిజమై తీరుతుంది. వాళ్ళు ప్రాపంచికంగా ఉంటూనే సదా భగవత్సేవలో దీక్షాదక్షులై ఉనప్పుడు ఇంద్రియ లోలులు కానప్పుడే ఇది సాధ్యం.


న్యాయస్థానాలు సత్యాన్ని నిలబెట్టడానికి నెల కొల్పినవె. ‘‘దేవుని ఎదుట ప్రమాణంచేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను’’ అని ఏ భగవద్గీతమీదో ప్రమాణం చేసినా, అంతఃకరణం నిర్మలం కానప్పుడు, సత్యవాక్కు వెలువడుతుందన్న విశ్వాసం ఏర్పడదు. ఈ రోజుల్లో ‘నార్కో ఎనలిటికల్’ పరీక్షలద్వారా- నేరస్థుల నుండి నిజాలు రాబట్టే యత్నాలు జరుగుతున్నాయి. ఒకడు సత్యం చెప్పడానికి ఇచ్చగించనప్పుడు, ఒక అబద్ధం ఆడితే దానిని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలాడాల్సి వస్తుంటుంది. నిజం అంత దుర్భరభమైంది అవడంబట్టే ‘నీరు పల్లమెరుగు - నిజము దేవుడెరుగు’ వంటి సామెతలు పుట్టాయి.


ఇంతకీ ‘సత్యవాక్కు’ అంటే నిజం నిప్పులాంటిది. నిప్పుని ఊకతో కప్పిఉంచినా, నిప్పును ముట్టుకుంటే అది కాలక మానదు. అలాగే ఎన్ని అబద్ధాలను గోడలుగా పేర్చినా- ఎప్పుడో అప్పుడు ఆ గోడ కూలక తప్పదు. సత్యం బహిర్గతం కాక తప్పదు. నిజానికి సత్యం చాలా విలువైనది, పదునైనది. 

నిజాలకు తట్టుకోవడం కూడా నిజానికి కష్టమైనపనే!కాని ప్రాణ, విత్త, మాన, భంగం కలిగేటప్పుడు ఓ అబద్ధపు పలుకు తప్పుకాదనడమూ కనబడుతుంది. కానీ ఎప్పుడూ నిజమే చెప్పాలి! అయితే ఆ సత్యవాక్కు నిష్ఠూరమైంది కారాదట!


సత్యమే చెప్పాలి కానీ, ప్రియమారా చెప్పాలి. అప్రియమైనదయితే - సత్యవాక్కునయినా ఆచి తూచి చెప్పాలి అబద్ధాలవల్ల అరిష్ఠాలేతప్ప, తాత్కాలిక ప్రయోజనాలుకలిగితే కలుగవచ్చుననేమోగానీ, నిలిచి వెలిగేది సత్యమే! వంచనతో కపటంతో మెరమెచ్చు మాటలతో అనృతాలతో తాత్కాలిక ప్రయోజనాలు నెరవేరుతాయేమోగానీ- సత్యాన్ని అవి మరుగుపరచలేవు! పైగా ఒకసారి విశ్వాసం కోల్పోయేలా ఒకరి అబద్ధం పనిచేసిదంటే, ఇంక ఆ వ్యక్తి సత్యదూరుడుగానే సంభావితుడవుతాడు. ‘విశ్వసనీయత’ సత్యవాక్కువలనే సంక్రమించిన లక్షణం. అది సమాదరణీయం. వాక్కును మించిన భూషణం లేదన్నారు. సత్యవాక్కు మాత్రమే అటువంటి ‘వ్యక్తి సౌందర్యాభరణం’. మాటతోనే మహానీయ కార్యాలెన్నింటినో సాధించడం సాధ్యమవుతుంది.

- సుధామ

(28/02/2012 Andhrabhoomi (Daily))

Monday, February 13, 2012

శాంతి సౌఖ్యాలు





మతం అనేదాన్ని ఒక మార్గం అనుకొంటే అది మానవ జీవిత సాఫల్య మార్గం అవుతుంది. ప్రతి మతమూ మానవాభ్యుదయాన్నీ, శాంతినీ అభిలషించిందే. ‘విశ్వాసమే దేవుడు’ అని అంటాడు టాల్‌స్టాయ్. అయితే ఆ విశ్వాసం విచక్షణతో ఉండాలి. కాని మూఢ విశ్వాసంతో ఉండకూడదు.

నిజానికి నిరాకారుడు, నిర్గుణుడు అయిన దైవానికి ఒక ఆకృతిని కల్పించుకుని, అందుకు ఆరాధనా మార్గాన్ని ఏర్పరచుకున్నది మనుష్యులే. హిందూ, ముస్లిం, బౌద్ధం, జైనం, సిక్కు, పార్శీ, క్రైస్తవం ఇలా ఎన్నో మతాలు ప్రపంచంలో అనేకంగా వున్నాయి. చిత్తమెచట భయశూన్యమో, ఎక్కడ సంతృప్తి, సంతోషం సమకూడుతాయోఅదే స్వర్గం అని భావించవచ్చు.

భగవంతుడు ఒక్కడే. కాని ఆయనకు మనమే ఎన్నో పేర్లు పెట్టుకొన్నాం. మన భావాన్నిఅనుసరించి పేర్లు పెట్టుకొన్నట్టుగానే ఆకారాలను సృష్టించుకొన్నాం. ఎవరికి ఏ భగవన్నామంమీద అపార విశ్వాసమో దానినే జపించవచ్చు. దాని ప్రకారం ఆ యా భగవంతుడిని సగుణంలోనో, నిర్గుణంలోనో పూజిస్తాం. అర్చిస్తాం. గమ్యం ఒకటే అయనా దారులు ఎన్నో ఉన్నట్టు భగవంతుడు ఒక్కడే అయనా ఎన్నోరూపాలతో ఏన్నో దర్శనాలతో భగవంతుని తత్వాన్ని అర్థంచేసుకొంటాం.దీన్ని చెప్పేదే మతం.

పరికించి చూస్తే మనకు ఒక మతంలోనే అనేక శాఖలు, ఉపశాఖలూ కనిపిస్తాయి. హైందవంలో శైవ, వైష్ణవాలూ మస్లింలలో సున్నీ, షియాలు, క్రైస్తవంలో కేథలిక్కులు, ప్రొటెస్టెంట్‌లు కానవస్తారు. అంటే మతం అనే మార్గంలోనే మళ్లీ అనేక వీధులన్నమాట. అయితే చివరకు చేరుకునే ‘అంతిమ గమ్యం’ ఒకటే అయినప్పుడు, ఎవరికి అనుకూలమైన దారిలో వారు ప్రయాణించడం సహజం! ప్రయాణించే ఒక రైలు స్టేషన్ చేరడానికే- ఎవరి మార్గంలో వారు వస్తున్నప్పుడు, ఇంత వైవిధ్యం వుండడంలో దోషం లేదు. అయితే వాటిలో వైరుధ్యాలను ఎన్ని, విద్వేషాలనూ, అవతలివారి మార్గానికి అవరోధాలనూ కల్పించడమే కూడనిపని.

‘మత సామరస్యం’ అన్నమాట వచ్చినపుడు ‘సత్యం’ అన్నదే అసలు సామరస్యం. సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని వీక్షించడంలోనే దృక్కోణాలు వేరు కావచ్చు. సత్యం అనేది ఒక గోళం వంటిది. గోళానికి ఒకవైపున వున్నవారికి ఆవలివైపు కన్పించదు. అంతమాత్రాన తాను చూసిందే, తాను విన్నదే సత్యమనుకోవడం సరికాదు. అంతేకాదు! తనకు భిన్నమైన, తన అభిప్రాయాలకు వేరయిన అభిప్రాయాలను ప్రకటించేవారినీ, తమదైన మార్గాన్ని అవలంభించేవారినీ శత్రువులుగా పరిగణించడం వెర్రితనం!

అవతలివారు, వారి విశ్వాసాలకనుగుణంగా, జీవించే విశ్వాసాన్ని ఇవ్వగలగడమే సమరసభావం! అదే ‘సామరస్యం’ .కలిసిమెలిసి జీవించడంలో భిన్నాభిప్రాయాలు, అవరోధాలు కానక్కర్లేదు. పైగా అది అంతర్గత వైయక్తిక విశ్వాసం! సమష్టి జీవనానికి ఏ మతమూ ఆఘాతం కలిగించదు. కలిగించకూడదు. స్నేహవాతావరణం వుండాలే కానీ, హేళనాయుత వైఖరులు విడనాడి మసలుకోవాలి.

మనిషి మతం కన్నా గొప్పవాడు. మనిషితనం, మానవత్వమే ముందు మనిషికి కావాల్సింది. మనిషి సుఖశాంతులను కోరని మతం అంటూ ఏదీ లేదు! మతాలసారం అంతా ఒక్కటే! శాంతి సుఖాలకు అది ఆలంబనం కావాలనే. మనుషులలో ఆలోచన్లను అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక్కసారి మత విద్వేషాలూ, కల్లోలాలు చెలరేగుతూంటాయి. జనం మధ్య సామరస్యం దెబ్బతింటూంటుంది. అందుకే వ్యాకులం తొలగించే కరుణయే కులం. మమత పెంచుకు మసలు మానవతే మతం. నిజానికి పైకి భిన్నాలన్నీ లోన సున్నాలే. అట్టహాసపుజీవి ఆత్మ లోతంటితే అసలు పరమార్థం తెలుస్తుంది.

మతసామరస్యం అనేదే దైవం మెచ్చే జీవన స్వారస్యం.
- సుధామ




(13/02/2012 - ఆంధ్రభూమి - దినపత్రిక )