ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, January 4, 2020

స‘కాలమ్’లో స‘కలం-విహారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

"WRITING COLUMNS- AND GAINING COMPETENCE AND PROFICIENCY-IS A MATTER OF PATIENCE AND PERSEVERANCE. THE ONLY WAY TO PERSIST IS TO LIKE AND LOVE WHAT THEY DO. FOR A COLUMNIST THE JOURNEY IS FAR MORE INTERESING AND FULFILLING THAT THE DESTINATION.''
- LUKE KOELMAN
(DUTCH WRITER & JOURNALIST)
*
అవిరామ కృషి, అభినివేశము అందరికీ పట్టుబడే గుణాలు కాదు. ప్రతిభావంతులు అయినా, కొందరు క్రమరాహిత్యంతో ఉంటారు. కవులు, రచయితలు నిజానికి తమ రచనల ద్వారా సమాజానికి ఒక సరియైన దిశానిర్దేశం చేయగలవారుగా, బాధ్యతాయుతమైన వారిగా పాఠకలోకం భావిస్తూంటుంది. రచయిత రచనను చూసి మాత్రమే పాఠకుడు అభిమానించడు. తద్వారా ఆ రచయిత వ్యక్తిత్వాన్నీ, వ్యక్తిత్వంతో కూడిన వారి రచనల వల్ల కలిగిన ప్రభావాన్నీ అనుసరించి ఆ రచయిత పట్ల గౌరవాదరాలు పెంచుకుంటాడు. అందుకే రచనకూ, జీవితానికీ పొత్తు కుదరని రచయిత తాత్కాలిక కీర్తిప్రతిష్టలు ఆర్జించగలడేమోగానీ, కాలానికి నిలిచే మహనీయునిగా మనలేడు. పాఠకుని వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించేదే ఉపయుక్త రచన. అలాంటి రచనలు చేసేవారే ఉత్తమ రచయితలుగా సార్వకాలికులు కాగలుగుతారు.

పత్రికా రచయిత ఒక నిత్య యాత్రికుడు. అలా నిరంతర అధ్యయనంతో, సమాజమమేకమై, ఏ విషయం మీదనయినా తన సాధికారిక ప్రభావోపేత వ్యాఖ్యనూ, సదసద్వివేచననూ కలిగించగల విషయ వ్యక్తీకరణను చేయగల పట్టు, నిరంతర శ్రమచేయగల రచయితయే ఒక ‘కాలమిస్టు’గా రాణించగలుగుతాడు. అందుకే ఒక రచయిత కాలమిస్టుగా రాణించ గలగడమనేది అందరి విషయంలోనూ సాధ్యంకాదు. అలాంటి విశిష్ట శేముషీ సంపన్నులు విహారిగారు. ‘విహారి’ అన్న కలం పేరున సుప్రతిష్టులయిన శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసినవారు. ప్రధానంగా ఒక కథకుడుగా ఆయన కీర్తినెరిగిన వారెందరో. కానీ ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదనడం అతిశయోక్తికాదు. కవిగా సంప్రదాయవాదులు సమాదరించే- 6500 పద్యాలలో ‘శ్రీపద చిత్ర రామాయణం’వెలయించారు. అభ్యుదయవాదులు, వచన కవితాభిమానులుమెచ్చే ‘చలనమ్’, ‘కలంకన్ను’, ‘చీకటి నాణెం’, ‘మనం మనం’, ‘‘మధ్య’మా‘గతి’’ వంటి అయిదు కవితా సంకలనాలు వెలువరించారు. ఛందస్సుందర మహాకావ్యంగా రామాయణం రచించినవారే ‘వ్యక్తి-త్వం-వికసనం’ పేరున వినూత్న దీర్ఘ వచన కవితాకావ్యం విరచించారు. సమశ్రుతి, నవతరం, ప్రణయా‘నలం’ అనే మూడు నవలలు రాసారు. ఇప్పటికి ‘స్పృహ’తో మొదలిడి ‘కూకటి’ వరకు పదిహేను కథల సంపుటాలు వెలయించిన కథకునిగా పాఠక జనాదరణకు పాత్రులయ్యారు.

తానొక మహోన్నత కథాభూజంగా విస్తరించినా ఎందరో, నవ, యువ కథకులను భుజంతట్టి ప్రోత్సహించుతూ, వారి ఎదుగుదలకు సారవంతమైన తమ సమీక్షాసత్త్వాన్ని అందిస్తూ ఇప్పటికి అయిదు ‘కథాకృతి’ సంపుటాలను, సమీక్షాకృతులను ప్రకటించారు. మూర్తిదేవి పురస్కార గ్రహీతలయిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అయిన సలీం, విశాల సాహితి అధినేత, తెలంగాణ బి.సి.కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములుగార్ల సాహిత్య వైశిష్ట్య విశే్లషణా గ్రంథాలు, ‘సాహిత్య జీవి శారద’, ‘కథానిక వస్తు రూపాలు’ వంటి గ్రంథాలు సాహిత్య విమర్శకుడిగా విహారిగారి వైభవదీప్తులను వెలార్చేవిగా ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీకై ‘రాయప్రోలు’ వారిపై రాసిన మెమోగ్రాఫ్ వెలుగుచూడబోతున్న గ్రంథం.
ఇవన్నీ ఒక ఎత్తుకాగా ఇప్పటికీ ఇంకా గ్రంథస్థంకానీ ఆయన సాహిత్య కృషి అపారంగా ఉంది. అందులో ఆయన వివిధ పత్రికలలో నిర్వహించిన- ‘కాలమ్స్’ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆయన దృష్టికిరాని కథగానీ, కథకులు గానీ నాటి నుంచీ నేటివరకూ ఎవరూ వుండకపోవచ్చు. ఆయన అధ్యయనశీలత అంత విస్తారమైనది. దాదాపు నాలుగువందల మంది కథకులను వారి కథారచన గుణవిశేషాలను విశే్లషిస్తూ ఆయన తమ ‘కాలమ్స్’ ద్వారా వివిధ పత్రికలలో రాసిన పరిచయవ్యాసాలు తెలుగు కథాసాహిత్యంలో ‘నభూతో నభవిష్యతి’ అనదగినదిగా మన్ననలందుకొన్నది. ఒకనాటి ‘్భరతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికలనుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు అనేక దిన, వార, మాస పత్రికలలో వందలాది గ్రంథసమీక్షలు చేశారు. ఆయన వివిధ పత్రికలలో నిర్వహించిన ‘కాలమ్స్’ కూడా వైవిధ్యభరితమైనవి.

విహారిగారు వృత్తిరీత్యా ఎల్.ఐ.సీ హౌసింగ్ ఫైనాన్స్ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. మధ్యతరగతి జీవులకు ఉపయుక్తమైన ఆర్థిక అంశాలనెన్నింటినో 2007-2008 సంవత్సరంలో ‘వార్త’ దినపత్రికలో 'ధన’ పేరిటి కాలమ్‌లో ప్రతి మంగళవారం ఆయన రాసిన వ్యాసాలు కుటుంబ రక్షణకు వలసిన ఆర్థిక విధానాలనూ, ఆదాయానికి అనువుగా పొదుపుచేసుకుంటూనే నిధిని సమకూర్చుకోవాలనీ, మన జీవనపథంలో సమంజసమైన, సరళమైన ఆర్థికప్రణాళికా గమనం అని ప్రబోధిస్తూ సాగిన ఉపయుక్త వ్యాసాలు. విహారిగారు గతానుగతిక భావాలకు, ‘మూస’కు భిన్నంగా నిరంతరం ఆలోచించే సృజనశీలి. కాలానుగుణంగా వస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండటం మాత్రమేకాదు. ఆ నవ్యతను, సరికొత్త తరం ఆలోచనా ధారను అందిపుచ్చుకుని తన అనుభవంతో సానబెట్టి యువతకు సరియైన దిశానిర్దేశం చేసే రచనలను చేయడం బాధ్యతగా భావించే రచయిత. యువతకు వ్యక్తిత్వ వికాసం మీద ఆయా పత్రికా సంపాదకుల కోరిక మేరకు ఆంధ్రభూమి, చినుకు, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికలలో ‘కాలమ్’ రూపేణా వ్యాసాలుగా రాసారు. యువ(త) రంగం శీర్షికన యువ కవులను, రచయితలను, కళాకారులను పరిచయంచేస్తూ వారి కృషిని వెన్నుతడుతూ ప్రోత్సాహకర వ్యాసాలు రాసారు. అనేక మెళకువలను ఆయా వ్యాసాల రూపంలో వారి పురోగమనానికై ఉపాయనం చేశారు. ఆంధ్రప్రభలో నాలుగు సంవత్సరాలకు పైగా ‘పరిచయాలు-పరామర్శలు’ శీర్షిక నడిపారు. అది ఒక రికార్డు.

ఆంధ్రభూమి దినపత్రిక వారానికి ఒకరోజు కేటాయించిన ‘యువ’ పేజీతో 2009 నుండి రెండు మూడేళ్ళ పర్యంతం జె.ఎస్. మూర్తి (విహారి)గారు రాసిన వ్యాసాలు నిజంగా ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పాఠాలే! ‘మేధోపరిణతే వ్యక్తిత్వ దర్పణం’ అనీ ఆలోచనా ధోరణి, భావవ్యక్తీకరణ, అంగవిన్యాసం, ప్రవర్తనావిధానం వంటి అనేక అంశాలను యువతలోని నిరాశానిస్పృహలూ, వ్యతిరిక్త్భావనలూ తొలగిపోయే రీతిగా ఆ వ్యాసాలను సంతరించారు. ‘పరిష్కారం (2) సమస్య.కామ్’, ‘గురిపెట్టండి..’, ‘మాట కలపటమే మనసు విప్పటం’ వంటి వ్యాసాలు యువతలో సాఫ్ట్‌స్కిల్స్‌ను, టీన్‌టామిక్‌ను, హెల్త్‌కేర్‌ను, భాషానైపుణ్యాన్ని, భావదీప్తిని ప్రచోదితం చేసేవిగా రాసారు. అవి గ్రంథ రూపేణా వెలువడవలసిన అవసరం ఎంతయినా వుంది. ఇవాళ జంక్‌ఫుడ్ వంటి వాటి ప్రభావాలను హెచ్చరిస్తున్న విషయాలను గురించి ఆనాడే విహారిగారు యువతను అప్రమత్తం చేశారు. ‘చిత్ర’మాసపత్రికలోనూ, ‘్ధర్మశాస్త్రం’ అనే మాసపత్రికలోనూ కూడా 2015, 2016లలో ‘యువ(త)రంగం’ పేర ఇలాంటి వ్యాసాలు రాసిన విహారిగారు ‘చినుకు’ మాసపత్రికలో ‘తేజోరేఖలు’ పేర 2013లో నిర్వహించిన కాలమ్ యువతకు జీవన నైపుణ్యాన్ని నేర్పిన మరో విశిష్ట వ్యాస పరంపర. ‘ఎదగడానికెందుకురా తొందర’అనే సినీ గీతం పల్లవి పట్టుకుని ‘ఎదగటం’మీదే యువత భవిత ఆధారపడివున్న వైనాన్ని, అందుకు వలసిన సదాచరణను విశే్లషించారు. రామాయణం, మహాభారతంలోని అంశాలను ఉపపత్తులుగా స్వీకరించి నవ సమాజ పథ ఫణుతులను యువతకు ఉపయుక్తంగా మలచిచెప్పిన ప్రజ్ఞ ‘తేజోరేఖలు’లో కానవస్తుంది. జీవికకూ, జీవనానికీ, అనివార్యమైన వాహికగా ‘మాటతీరు’ గురించీ, అన్నిరకాల సామాజిక, నైతిక నియమ నిబంధనలకూ అతీతంగా ‘నలుపు’ని ఆశించి ఆరాధించే వైఖరినుండి యువత నీతినిజాయితీలవైపు చిత్తశుద్ధితో ఎదగవలసిన తీరుతెన్నులను, ‘వ్యక్తిత్వ వికాసం - రేపటి తరం అవసరాలు’ కూడా అందిపుచ్చుకునేలా విహారిగారు విశే్లషించిన తీరు యువతకే కాదు ఆబాల గోపాలానికి విభ్రమ కలిగిస్తూనే వివేచన కలిగించేదిగా భాసిస్తోంది.

ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్‌లో ఆదివారాల్లో ‘మెఱుపు’ అనే పేజీలో యువతరం కవులూ-రచయితలను పరిచయంచేసే ‘కాలమ్’ను నిర్వహించారు. ప్రతిభావంతులైన యువతరాన్ని జల్లెడపట్టి కవులుగా రయితలుగా రాణించగలవారిలోని ప్రతిభను గుర్తిస్తూ ఆయన రాసిన ఆ ధారావాహిక శీర్షికారచన తెలుగు సాహిత్య ప్రపంచంలో అప్పుడప్పుడే విచ్చుకుని పరీమళిస్తున్న కొత్త పుష్పాలను ఏర్చికూర్చి మాలకట్టిన మనోజ్ఞ కదంబం. ఆయన ఆ కాలమ్‌లో పరిచయంచేసిన యాభై మందికి పైగా ‘కవులూ రచయితలు’లో చలపాక ప్రకాష్, జమదగ్ని, కోసూరి రవికుమార్, కె.విల్సన్‌రావ్, వంశీకృష్ణ, సాదనాల వెంకటస్వామినాయుడు, నియోగి, అమ్మిన శ్రీనివాసరాజు, షేక్‌అబ్దుల్ హకింజాని, కోటమర్తి రాధాహిమబిందు వంటి వారెందరో నేటి కథాప్రసంగంలో ఎదిగి రాణిస్తున్నవారున్నారు. ఒక సంగమనం, నిష్పక్షపాత విశే్లషణ, యువభావ ప్రశంసావైఖరి ‘విహారి’ గారి ఈ పరిచయ వ్యాసాలలో ద్యోతకమైందని కొందరు ప్రముఖ విమర్శకులే ప్రశంసించారు.

అలాగే 2013లో ఆంధ్రభూమి ‘మెరుపు’ పేజీలోనే ‘ఆనాటి కథలు- ఆణిముత్యాలు’ శీర్షికన ఇవాల్టితరం విధిగా చదవవలసిన అపురూప కథకుల ఆణిముత్యాల వంటి కథలను పరిచయం చేశారు. విహారిగారు పరిచయంచేసిన కథలు కాలానికి నిలిచే ఉదాత్త విలువల ప్రోది అయిన కథలు. శ్రీపాద - ‘కలుపుమొక్కలు’, సురవరం ప్రతాపరెడ్డిగారి ‘సంఘాల పంతులు’, విశ్వనాథవారి - ‘ముగ్గురు బిచ్చగాళ్ళు’, వట్టికోట ఆళ్వారుస్వామి - ‘పరిగె’, చలం - ‘యవ్వనవనం’, కనపరి త- ‘కుటీరలక్ష్మి’, మధురాంతకం - ‘పొద్దుచాలని మనిషి’ వంటి కథల వైభవ ప్రాభవాల గురించి మునుపెవరూ చూపని మంచి కథలనూ, వాటి కోణాలను విహారిగారు ఈ ‘కాలమ్’లో పరిచయం చేశారు. నిజానికి కథకులు ప్రసిద్ధులే. అయినా వారి విస్మృత అపురూప కథలను పరిచయం చేయడం విహారిగారికే చెల్లింది. ఈ అపురూప కథాసంపుటిని నిజానికి ఏ సాహిత్య అకాడమీ లాంటి సంస్థలో పూనుకుని ప్రచురించాలి. ‘చినుకు’ మాసపత్రికలో 2014లో విహారిగారు ‘అక్షర జీవులు- ఆణిముత్యాలు’ అనే కాలమ్‌లో ఇప్పటితరం కథకుల మంచి కథలను విశే్లషిస్తూ పరిచయం చేశారు. శ్రీపతి, రంగనాథ రామచంద్రరావు, అదృష్టదీపక్, నాయని కృష్ణమూర్తి, డా.చింతకింది శ్రీనివాసరావు, గంటి భానుమతి వంటి వారి కథానికలు గురించి ఈ వ్యాసాలలో విశదీకరించారు. సాహితీ స్రవంతి మాసపత్రికలో కథావాఙ్మయ లహరి శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు.

ముందే చెప్పుకున్నట్లు విహారిగారు చేపట్టని ప్రక్రియ లేదు. శ్రీశ్రీ, ఆరుర్రు వంటివారు నిర్వహించిన ‘పదబంధ పారిజాతం’ వంటి గళ్ళ నుడికట్టును కూడా విహారిగారు ‘చిత్ర’ మాసపత్రిక సంపాదకుల అభీష్టంమేరకు 2012-2013లో ‘పదప్రజ్ఞ’ శీర్షికన పదిగళ్ళ పదక్రీడగా నిర్వహించారు. విరిగిపడబోదులెండి(మిన్ను) భాగం త్రాగవచ్చు (పాలు) గోదావరిచే సుతజల పూరితంబులు... వడ్లు పండేదిక్కడే (వరిచేలు), మిమ్మల్నేమీ అడ్డగించం (ఆపం), ‘గాలివాన’కథకుని పొట్టిపేరు (పాప), మరమరాల్లో లక్ష్మి(రమ) వంటి చమత్కార ఆధారాలతో ఈ ‘పదప్రజ్ఞ’ 300/- రూ. బహుమతి మొత్తంతో పోటీగా సాగింది. భాష మీద విహారిగారికి ఉన్న పట్టుగొప్పది. ఆయన ‘పదచిత్ర రామాయణం’లోని పద సంపదనంతా ఒక ‘వాఙ్మయ సంచిక’గా సంతరించవచ్చును.

2018నుండి ఏడాదికి పైగా విశ్వామిత్ర, మధుర, అనసూయ, శూర్పణఖ, లాంటి వ్యాసాలు భక్తి మాసపత్రికలో ‘రామాయణ పాత్రలు’ అనే ధారావాహికలో వ్రాశారు. ఆయన రాసిన ఆ వ్యాసాలు వాల్మీకి హృదయాన్ని చూపుతూ ఆ పాత్రల వైశిష్ట్యంపై కొత్తవెలుగులు ప్రసరింప చేసేవిగా భాసించాయి. ‘‘కథాగతిని అనుసరించి పాత్రపోషణ జరగాలనే పాఠాన్ని అందించారు మహర్షి. ప్రతి పాత్ర చిత్తవృత్తిని స్పష్టంగా ఎరిగిన కవి ఆయన. ఆయా పాత్రల మనస్తత్వ వైరుధ్యాలను, వైచిత్రిని అపూర్వంగా దర్శనం చేసినవాడు ఆయన’’అని వాల్మీకిని విశే్లషించిన విహారిగారూ తామూ ఆ బాటనే అనుసరించి అడుగడుగునా చూపారు. విహారిగారి కథారచనలోని పాత్రలకు కూడా వర్తించే అంశమే అది. ‘్ధర్మసూక్ష్మ ప్రసారం’ శీర్షికన హిందూ ధర్మ ‘శంఖారావం’ మాసపత్రికలో ఆరు కాండల సంక్షిప్త వివరణగా ‘సంపూర్ణ రామాయణం’ను శీర్షికారచనగా విహారిగారు 2019లో అందించారు.

ఇలా విహారిగారు ‘సకాలంలో సకలం’ అన్నట్లుగా తమ కాలమ్స్‌లో కలం జీవులకు బాసటగా నిలుస్తూ, ఎందరో కథకుల వైభవ ప్రాభవాలకు సముచిత దర్పణం పట్టారు. యువ రచయితల వెన్నుతట్టారు. యువతకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. మధ్యతరగతి జీవుల ఆర్థికావసరాలకు సలహాదారుగా నిలిచారు. వయోధికులు ‘అల్జీమర్స్’ బారిపడకుండా మెదడుకు మేతపెట్టే ‘పదప్రజ్ఞ’లు చూపారు. వాల్మీకి హృదయాన్ని రామాయణ పాత్రల విశ్లేషణతో ఆవిష్కృతం చేశారు. ఆయనలోని సమ్యక్‌దృష్టి, విషయ విశ్లేషణా నైపుణ్యం, సకాలానికి రచన అందించే సమయపాలన, రచనలోని పఠనీయత ఒక ‘కాలమిస్టు’గా విహారిగారిని సంపాదకులెవరయినా సమాదరించగల సహృదయ శేముషీ వైభవశీలిగా నిల్పుతున్నాయి.

ఆయన ‘కాలమ్స్’రచనలన్నీ కూడా పుస్తక రూపందాల్చి భావితరాలకు అందే ‘విహారి సమగ్ర సాహిత్య సర్వస్వం’ వెలువడాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. ఈఏటి అజో-విభొ-కందాళం సాహిత్య జీవనసాఫల్య పురస్కారం విహారిగారిని వరించి సఫలత చెందిందని ఆనంద కందళిత హృదయారవిందంతో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (విహారి) గారికి మనసా, శిరసా అభినందనలందిస్తున్నాను.
- సుధామ, 98492 97958
Published Monday, 23 December 2019 సాహితి పేజీ 

Thursday, September 12, 2019

వ‘సుధా(స)మ’యం

పఠనీయం

సూటిదనపు వ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ‘సుధా(స)మ’యం
రచన:సుధామ, వెల:రూ.150/-,
కాపీలకు: ఎ.ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి.12, సాదత్ టవర్స్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్:9849297958
మరియు నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, హైదరాబాద్-27.

==========================================================
ఒక పత్రికలో- అదీ దినపత్రికలో ‘కాలమ్’ నిర్వహించటం అంత తేలికైన వ్యవహారం కాదు. సమయ పరిమితి స్థల పరిమితులను అనుసరిస్తూ, క్లుప్తత, సారళ్యతను తోడుచేసుకుని, శైలి పట్ల జాగరూకత వహిస్తూ, ఆలోచనల్లో వైవిద్యము కనబర్చుతూ, పాఠకులను అనుక్షణం తన వెంట నడిపించుకుంటూ తీసికెళ్లగలగాలి.

కార్టూనిస్టుగా, కవిగా, సమీక్షకుడిగా, రచయితగా, చిత్రకారుడిగా, వక్తగా, ప్రహేళిక (క్విజ్)ల నిర్వాహకుడిగా, కాలమ్నిస్టుగా అల్లంరాజు వెంకటరావు (సుధామ)గారు తెలుగు పాఠకులకు మీదుమిక్కిలి ఆంధ్రభూమి పాఠకులకు చిరపరిచితులు. 4 కవితా సంపుటులు, పలు ప్రశ్నోత్తరమాలికలు, పీఠికలు కాలమ్ వ్యాసాలు రాస్తూ నిత్య నవ్యతను కనబర్చుతూ గళ్ళ నుడికట్టు నిర్వహణ లాంటి పలు ప్రక్రియలతో సుధామ తెలుగు‘వాడి’ నాడి పట్టుకోగలిగారంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు. 1978 నుండి 2008 వరకు ఆకాశవాణిలో, వివిధ విభాగాలలో పనిచేసి తన అనుభవాలకు సానపెట్టుకున్న సుధామగారి ‘కాలమ్’ రచనల సంకలనమిది.

ఒక దినపత్రిక వారి కోరిక మేరకు 2018 మే నుండి నలభై వారాలపాటు వీరు నిర్వహించిన ‘వసుధా(స)మయం’ అన్న కాలమ్ వ్యాసాల సంకలనాన్ని, అదే శీర్షికతో ఇప్పుడు పాఠకుల ముందుకు తెచ్చారు సుధామగారు.

సాహిత్య సంస్థలు, వాటి నిర్వహణ, సభలు సమావేశాలు, వీటిలో కనబడుతున్న వింత ధోరణులు, సభల్లోని సన్మాన ప్రహసనం, పత్రికల్లో నిర్వహించబడుతోన్న పోటీ లు తనదైన శైలిలో మెత్తగా, సుతిమెత్తగా చిన్నగా వీపుతడుతూ ఒక్కోచోట వీపు చరుస్తూ వివరించారు.

‘కలందాటుల కవుల మంద’, ‘ఓ గుడ్డముక్కా- దిమ్మచెక్కా’, ‘పూలదండ(గ)లు’, ‘సన్మానశాలు(వా)లు’, ‘(చెడ)తిట్టుకుందాం రా’, ‘మీ(రె)టూ!’ లాంటి శీర్షికలతో పాఠకులలో ఆసక్తి రేకెత్తించటంలో రచయిత కృతకృత్యులయ్యారు.

ఎత్తుగడ, నడక, నర్మగర్భత, సున్నితమైన మందలింపులు- వెరసి సంకలనం ఆదినుండి అంతంవరకు పాఠకుడిని విడవక చదివిస్తా
యి ఈ వ్యాసాలు!

ఇవాళ సాహితీ సాంస్కృతిక సంస్థలకు కొదవలేదు. ‘వాసి’ మృగ్యమైనా, ‘రాశి’ మాత్రం బానే వుంది. (పే.40). సినీగాన కచేరీలు దినమానసికాలుగా సాగిపోతూనే ఉంటాయిట (పే.42). ఇవాళ ప్రతిదీ ఒక ‘రికార్డింగ్’ డాన్సు అయిపోతోంది (పే.48). వడియాలు ఆరబెట్టుకునే గుడ్డముక్కల శాలువాలు (పే.69), ఒక్కరోజులో వాడిపోయే పుష్పగుచ్ఛాల మీద, పూలదండలమీద అంతంత ఖర్చుపెట్టుకోవటంలోని సబబును ప్రశ్నిస్తారు (పే.63) రచయిత.
పూలబదులు కూరగాయల దండలు (కీ.శే. శ్రీ గోరాగారి సూచన) పళ్ళు, మిఠారుూలు, డ్రైఫ్రూట్స్ ఇస్తే బావుంటుందనటం (పే.65)లో ఎంతో నిజాయితీ కనబడుతుంది.

సమకాలిక రచయితలలో సుధామగారికో విశిష్ట స్థానం ఉంది. ‘‘మంచి వైపు మార్పు అంత త్వరగా సమకూడదని తెలుసు. మార్పునకు సదాలోచన ప్రేరేపించకలిగినా అదొక తృప్తి’’ అనే సుధామగారి సుధామ యోక్తుల్ని విందాం. విని అలానే వదిలిపెట్టకుండా ఆలోచిద్దాం. సుధామగారి సుధాపూరితమైన వాక్కుల్ని వంటపట్టించుకుందాం. వైతాళికులెప్పుడూ ముందు నిలిచి మందకు ప్రేరేపణ అవుతారు. వ్యాసాల్లోని ‘ఆర్తి’ని అర్థం చేసుకుని అనుసరించటంలోనే విజ్ఞత వుందని తెలుసుకుందాం. 

ఇంటింటా ఉండాల్సిన సంకలనమిది. నేటి విపరీత ధోరణుల్ని ఎండగడుతున్న ఈ సంకలనం తెలుగువారం అందరం తప్పక చదవాలి.
-కూర చిదంబరం
 8639338675


Monday, July 29, 2019

అస్తమించిన అనుభూతి పూర్ణజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన కవిత్వ అనుభూతితో పరిచయం కలిగిన పుష్కర కాలానికి కానీ ఆయన పరిచయం కలగలేదు. ఆకాశవాణిలో ప్రసార నిర్వహణాధికారిగా వున్న నాకు పదోన్నతితో కార్యక్రమ నిర్వహణాధికారిగా విజయవాడ కేంద్రానికి బదిలీ కావడంతో, 1991లో ఉషశ్రీగారి స్థానంలో అక్కడ తెలుగు విభాగాన్ని నిర్వహించే బాధ్యతలు చేపట్టాను. అప్పటికి ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో స్క్రిప్ట్‌రైటర్ పదవిలో వున్నారు. అప్పటి స్టేషన్ డైరెక్టర్ జి.కె.కులకర్ణి కన్నడిగులు. తెలుగువారు కాదు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడంతోనే ఆయన ‘‘అయామ్ అలాంటిగ్ సాంస్క్రిట్ అండ్ తెలుగు సెక్షన్స్ టు యు. శ్రీకాంతశర్మ విల్ అసిస్ట్ యూ.’’ అనేసారు. కులకర్ణిగారికి స్ట్రిక్ట్ డైరెక్టర్ అనే పేరుంది. ఒకరిమాట అంత సులభంగా వినేరకం కూడా కాదు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్క్రిప్ట్ రైటర్ ఉద్యోగంలో వున్నారు గానీ ఆయన ఎంతటి ప్రతిభామతి అయిన పండితుడో, కవియో నాకు తెలుసు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి పుత్రుడిగానే కాదు అప్పటికే స్వయంగా కవి పండితునిగా పేరుప్రతిష్ఠలార్జించిన గొప్ప గౌరవనీయ వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు సబార్జినేట్‌గా అసిస్ట్ చేయడమేమిటి? నేను కులకర్ణిగారితో ఆమాటే అని ఆయనకు సంస్కృత విభాగాన్ని నిర్వహించే బాధ్యత పూర్తిగా అప్పచెప్పమనీ అంతగాఅయితే ఇంకేమైనా అదనపు బాధ్యత కూడా ఆయనే స్వతంత్రంగా నిర్వహించేలా చేయవచ్చనీ, తెలుగు విభాగం కార్యక్రమాల విస్తృతి కూడా ఎక్కువే కనుక నాకు ఆ విధంగా వెసులుబాటు కల్పించిన వారవుతారనీ అభ్యర్థించాను.
ఏ కళనున్నారో కులకర్ణిగారు నా అభ్యర్థనను మన్నించి సంస్కృత విభాగంతోబాటు ప్రతిరోజూ ఉదయం ప్రసారమయ్యే ‘సూక్తిసుధ’ను శ్రీకాంతశర్మగారే రోజూ రాసి ప్రసారం చేయాలని స్వతంత్ర బాధ్యతలు అప్పచెప్పారు. నాకు విజయవాడ కేంద్రం, అక్కడి ప్రాసంగికులు కొత్తవారు కనుక శ్రీకాంతశర్మగారే ఎన్నో విలువైన సూచనలు ఇస్తూండేవారు. ఆయన సెలవుపెడితే నేను, నేను సెలవుపెడితే ఆయనా మా కార్యక్రమాలను నిర్వహించేవారం. ఆయన ఏంచేసినా పద్ధతిగా వుండేది. రోజూ సూక్తిసుధ రాసి ఆ స్క్రిప్ట్‌మీద డైరెక్టర్ కులకర్ణిగారు సంతకం చేశాకనే రికార్డుచేసి కానీ సాయంత్రం వెళ్ళడానికి వుండేది కాదు. ప్రతి స్క్రిప్ట్‌కూ రీడర్స్ రిపోర్ట్‌పెట్టి డైరెక్టర్ అంగీకార సంతకం తీసుకోవలసిందే!
శర్మగారి మీద ఎంత గౌరవం వున్న కులకర్ణిగారు ఆయన రాసిన స్క్రిప్ట్‌ను ఎవరిచేతయినా చదివించుకునిమరీ సంతకం పెట్టేవారు. డైరెక్టర్ రూమ్‌నుంచి ఆ స్క్రిప్ట్ ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు రికార్డుచేసి వెళ్ళాలా అని ఎన్నోమారులు ఆ రూమ్‌ముందు శర్మగారు తచ్చాడటం కూడా నాకు తెలుసు. కానీ చిరునవ్వుతోనూ, సహనంతోనూ, నలుగురితో సరదాగా కబుర్లు చెబుతూనూ వుండేవారే కానీ ఏనాడూ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతారహితంగా వుండేవారు కాదు. ఉషశ్రీగారి అనార్కిజం వ్యవహారాన్ని భరించి తెలుగు విభాగం అసిస్ట్ చేసింది శ్రీకాంతశర్మగారు కనుకనే విజయవాడ వైభవ ప్రాభవాలకు ఆకాశవాణి ఉద్యోగిగా కూడా శర్మగారు ఓ ఐకాన్. నిజమే! స్క్రిప్ట్ రైటర్‌గా ఆయన కలం సృజించిన సృజనాత్మక రూపకాలు, నాటకాలు ఆకాశవాణి జాతీయ స్థాయిలో వరుసగా పదేండ్లకు పైగా అవార్డులు గెలుచుకున్నాయంటే అది ఆయనలోని సృజనాత్మక వైభవానికి ప్రతీక. హృదయధర్మంతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించాడాయన. ఆ తరువాత కొద్దినెలలకే ఆయనకూ కార్యక్రమ నిర్వహణాధికారిగా పదోన్నతి లభించి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి బదిలీ చేశారు.
కార్యక్రమ నిర్వహణాధికారులకు ఢిల్లీలోని ఆకాశవాణి శిక్షణా కేంద్రంలో నలభై రోజుల బేసిక్ ట్రైనింగ్ వుండేది. ఆయనకూ పదోన్నతి వచ్చాకే ఢిల్లీ శిక్షణాకేంద్రంలో ఆ శిక్షణ మొదలుకావడంతో ఒకే బ్యాచ్‌లో నేను, శ్రీకాంతశర్మగారు, ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులుగా వున్న కాకరపర్తి సత్యనారాయణ, ప్రస్తుతం రిటైరైపోయిన ఎం. బాబూరావు తెలుగు అధికారులుగా ఆ బ్యాచ్‌లో వున్నాం. ‘ట్రైనింగ్ సెంటర్’ హాస్టల్లో వుండి శర్మగారితో గడిపిన ఆ నలభై రోజుల కాలం జీవితంలో మేం ఎప్పటికీ మరచిపోలేనిది. ఎంత పాండిత్యం! ఎన్ని విషయాలు! ఎంతటి హాస్యచతురత! ఎంతటి స్నేహశీలత. అంత సాన్నిహిత్యంగా వారితో పెరిగి గ్రహించిన జ్ఞాన సంపద, అనుభూతి సంపద ఎంతో! అది అదృష్టంకాక మరేమిటి?
ఒక స్థాయి పదవిలోకి వచ్చాక ఉద్యోగంలో బాధ్యతలూ, బదిలీలు అన్నీ అనివార్యం! శ్రీకాంతశర్మగారు ఆంధ్రజ్యోతిలో పాత్రికేయునిగా 1969-76 మధ్య పనిచేసి 1976లో ఆకాశవాణిలో స్క్రిప్ట్ ఎడిటర్‌గా చేరారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా నిజామాబాద్‌లో వుండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1996నాటికి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా వెళ్ళారు. ఇరవై ఏళ్ళ కాలం పదవిలోవుంటే గానీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా పెన్షన్ లభించదు. శ్రీకాంతశర్మగారి పట్ల గౌరవంగల ఢిల్లీ స్థాయిలోని ఓ అధికారి సౌజన్యంతో ఇరవై ఏళ్లకు కొద్దినెలలు తక్కువ పడిన అభ్యంతరాన్ని తొలగించి, ఆకాశవాణి రిటైర్మెంట్ బెనిఫిట్స్ శర్మగారికి అందచేయడం జరిగింది. అలా ఆయనకు ఆకాశవాణి జీవితకాలపు పెన్షన్ లభించడం ఆయనకు దక్కిన గౌరవం!
ఆంధ్రప్రభ వారపత్రిక ఆయన హయాంలో పాఠకులను అగ్రగామిగా అలరించింది. ఎడిటోరియల్ పేజీలో ఆయన ప్రతివారం ఒక సంస్కృత శ్లోకాన్ని తాత్పర్య సహితంగా అందించడం, విలువైన ఆ శ్లోక సంపదను ఎందరో భద్రపరుచుకోవడం నేనెరుగుదును. సంస్కృతాంధ్రాలలో ఆయన గొప్ప పండితుడు. తండ్రినుండి పుణికిపుచ్చుకున్న వారసత్వం మాత్రమే కాదు ఆయన స్వయంకృషి, వ్యుత్పన్నత అనితరమైనవి. ఆయన పాత్రికేయుడు, సంపాదకుడు కూడా కావడంవల్ల ఏ ప్రక్రియలో ఆయన రచన చేసినా అది ఎంతో వైశిష్ఠ్యాన్ని సంతరించుకుని అలరించేది. నవల, కవిత్వం, గేయం, వ్యాసం, నాటకం, సంగీత రూపకం, యక్షగానం, సమీక్ష, పరిశోధన, సినిమా పాట ఏది రాసినా ఆ ప్రక్రియలో తనదైన ప్రతిభాపాటవాలను, విలక్షణ సృజనశీలతను నిలుపుకున్నవాడాయన. ‘‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’’ అన్న దేశభక్తి గేయం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొంది జనం నాల్కలపై నడయాడిందో అందరికీ తెలుసు. అది రాసినది ఇంద్రగంటి శ్రీకాంతశర్మయే! అనుభూతి గీతాలు, శిలామురళి, ఏకాంత కోకిల, నిశ్శబ్దం గమ్యం వంటి కవితా సంపుటులు, పొగడపూలు పేరిట ఆయన లలిత గీతాల సంకలనం, అలాగే తూర్పున వాలిన సూర్యుడు, క్షణికం వంటి నవలలు, శ్రీపాద పారిజాతం, కిరాతార్జునీయం, శ్రీ ఆండాళ్ కళ్యాణం, గంగావతరణం వంటి యక్షగానాలు, అవతార సమాప్తి, మహర్షి ప్రస్థానం వంటి నాటకాలు ఆయన బహుముఖీన ప్రతిభాదర్పణాలు. ఆయన సినిమాల్లోనే కుదరుకుపోదలుచుకోలేదు గానీ సినీ గీత రచయితగానూ ఆయన అందించిన పాటలు సాహిత్య విలువలతో వాసికెక్కినవే. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘నెలవంక’ చిత్రంలో అన్ని పాటలూ ఆయన రాసినవే! రెండు జెళ్ళసీత, పుత్తడిబొమ్మ, రావుగోపాలరావు, తన తనయుడు సినీ దర్శకుడు అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలు సినీ కవిగా ఆయన విలక్షణతను, విన్నాణాన్నీ విపులీకరించేవి. ‘ఆ పాటలన్నీ నేనే పాడాను. అది నా అదృష్టం’ అని సినీ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం ఆనందపడుతూంటారు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 1944 మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రసిద్ధ కవి పండితులు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, వెంకటరత్నం దంపతులకు నలుగురు సంతానంలో మూడవవారిగా జన్మించారు. ఆయనకు ఇంద్రగంటి భానుమూర్తి, ఇంద్రగంటి సుబ్బరాయశాస్ర్తీ అన్నలు కాగా చెల్లెలు సత్యవాణి. చిన్నతనం నుండే సాహిత్యం, సంగీతాల పట్ల శర్మగారికి మక్కువ ఎక్కువ. ఎం.ఏ. తెలుగు పట్ట్భద్రులయ్యారు. సంస్కృతంలో కూడా నిష్ణాతులయ్యారు. బాలగంగాధర్ తిలక్, ఇస్మాయిల్ వంటివారి సరసన చేర్చదగిన అనుభూతి వాద కవిగా కవిత్వంలో తనదైన ముద్రవేశారు. పద్యం, గేయం, వచన కవిత, పాట అలా ఏ కవిత్వ ప్రక్రియలో రాసినా నిజంగా ఆయన భావం, భాగ్యం అనుపమానమైనది. ఇంద్రగంటి జానకీబాల ఆయన ధర్మపత్ని. ప్రేమించి పెళ్ళాడారు. ఆమె కూడా మంచి కథా, నవలా రచయిత్రిగా, గాయనిగా వనె్నకెక్కినవారు. అలా ఆ సాహిత్య దంపతులకు మోహనకృష్ణ కుమారుడు, కిరణ్మయి కుమార్తె. మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమా దర్శకునిగా నేడు రాణిస్తున్నారు. కిరణ్మయి డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మాణంచేశారు. బెంగుళూర్‌లో భర్త బలరాంతోబాటు నివసిస్తూ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కవిత్వానికి మాత్రమే శ్రీకాంతశర్మ అంకితమైతే బాగుండేదనీ, ఆయన పాట కూడా కవిత్వాన్ని కప్పేసిందనీ ఆయన మిత్రుడు, సహోద్యోగి పన్నాల సుబ్రహ్మణ్యభట్టు మేలమాడుతుంటాడు గానీ నిజానికి ఆయన పాండిత్యం, జ్ఞాన సంపద విస్తారమైనది. ఆయన సమగ్ర సాహిత్యం రెండు బృహత్సంపుటాలుగా వెలువరించారు. ఇటీవలనే ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ అని తమ ఆత్మకథను ప్రచురించారు. ఆంధ్రభూమి దినపత్రికలో అనేక సమీక్షలు అలాగే ‘పరిపరి పరిచయాలు’ పేరిట తమకు పరిచితమైన ఎందరో సాహితీమూర్తులను గురించి ధారావాహికగా రాసి ప్రచురించారు. ‘సంచలనమ్’ అని ఆయన ఆంధ్రప్రభలో వెలయించిన కాలమ్, అలాగే ‘తెలుగు కవుల అపరాధాలు’ అనే వ్యాసాలు ఆయన విమర్శనా పటిమకు, గొప్ప అధ్యయన శీలతకు నిదర్శనాలు. జాతీయస్థాయిలో ఆకాశవాణి ద్వారా అనేక అవార్డులు, ఫ్రీవర్స్‌ఫ్రంట్ అవార్డు, శిఖామణి పురస్కారం వంటివి ఎన్నో లభించినా నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మాత్రమేకాదు పద్మశ్రీ స్థాయి పురస్కారానికి సైతం ఆయన సమార్హుడు. కానీ ఏనాడూ ఆయనకు పురస్కారం గురించీ, గుర్తింపుల గురించీ వెంపర్లాట లేదు. తన కృషిని తాను సాగిస్తూపోవడమే, నిరంతర రచయితగా, అధ్యయనశీలిగా సాగడమే ఆయన చేసిన పని. ముద్రారాక్షసం మీద విపుల పరిశోధన చేస్తున్నవారు.
గత అక్టోబర్‌లో శిఖామణి ఆయనకు జీవన సాఫల్య పురస్కారం అందించిన సందర్భంగా యానాంలో చాన్నాళ్ళకు ఆయనతో రోజంతా గడిపే అవకాశం లభించింది. ఆయన పాఠశాల మిత్రుడు ఇంద్రగంటి హనుమంతరావు, నేను, శర్మగారు గడిపిన ఆ క్షణాలే గుర్తున్నాయి. డి.కామేశ్వరిగారి ‘సీతోపదేశం’ పుస్తకావిష్కరణ సభలోనే చివరగా ఆయనను చూసింది. అంతకుముందు ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం 2019లో అనువాద కవులుగా హైదరాబాద్ కేంద్రంలో కలుసుకున్నాం.
ఆయనతో ముడివడిన జ్ఞాపకాలు ఎనె్నన్నో! నా శ్రీమతి అల్లంరాజు ఉషారాణి మా వివాహానికి ముందు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసార నిర్వహణాధికారిగానూ, ఆ తరువాత మేం ఇద్దరం విజయవాడలో కార్యక్రమ నిర్వహణాధికారులుగా పనిచేస్తున్న కాలంలోనూ మాపై అపార వాత్సల్యాన్ని, అభిమానాన్నీ చూపిన సహృదయ స్నేహశీలి ఆయన. ఆయనతో కబుర్లాడడం అంటే గొప్ప ఉత్సాహంగా వుండేది. సాహిత్య, సాంస్కృతిక విషయాలనేకం ఆయన కబుర్లలో అందుకునేవారం. ఎప్పుడూ చిరునవ్వుతోనే తనమీద తానే జోకులేసుకునేలా కూడా వ్యవహరించేవారాయన. ఆయనలో మంచి నటుడున్నాడు. పాండురంగ, రామం అనబడే ఎస్.బి.శ్రీరామమూర్తి, కృష్ణమోహన్ ఆకాశవాణిలో ఆయనకు అత్యంత సన్నిహితులు. ఆయన స్నేహం ఎవరికయినా అపురూప వరమే!
హైదరాబాద్ నేరేడ్‌మెట్ ఆర్.కె.పురం జి.కె.కాలనీ సాహితీ రెసిడెన్సీలోని ఆయన స్వగృహంలో ఆయనతో ముచ్చటించే అవకాశమే లేకపోయింది. ఎన్నోమార్లు ఆయన ఆహ్వానించినా ఆ ఇంటికి వెళ్లడం కుదరనే లేదు. ఆఖరికి ఆయన పార్ధివ శరీరాన్ని ఈ జూలై 25 గురువారం అక్కడే సందర్శించుకోవడం మనసును కలచివేస్తోంది. సాహిత్యలోకపు ఒక ‘ఐకాన్’, తరలిపోయిన ‘ఇంద్ర’జాలపు కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మకు అశ్రు నివాళులు.
- సుధామ, 9849297958


Sunday, March 31, 2019

నవచేతనా వసంతం




కాలచక్ర పరిభ్రమణంలో విళంబి తప్పుకుని, కొత్త సంవత్సరాది ‘వికారి’ని ప్రవేశింపచేస్తోంది. తిథి, వార, నక్షత్రాల ఊసే లేక, ఇంగ్లీష్ తేదీ, వారంతోనే కాలం గడిపేసుకునే - అలవాటయి పోయాక, ఉగాది కొత్త సంవత్సరం అంటేనే - ‘జనవరి ఒకటి కదా న్యూఇయర్! మళ్లీ ఇదేమిటి?’ అని నివ్వెరపోయే తరం స్థిరమైపోతోంది. ఇది మన తెలుగుతనం, తెలుగు వత్సరాదియే ఉగాది పండుగ. అభ్యంగన స్నానాలు, కొత్త బట్టలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, ఉదయాన్నే  ఉగాది పచ్చడి సేవనం ఇవన్నీ మన తెలుగు అస్తిత్వాలు. వాటిని క్రమేపీ మటుమాయం చేసుకుంటూ పరాయీ కరణం చెందడం విషాదమే మరి!
అయితే నేటికీ మన పల్లెసీమల్లో మామిడి తోరణాలతో ఇంటి ద్వారాలను అలంకరించుకుని, వాకిళ్లలో ముగ్గులు పెట్టుకుని కోయిల కుహూ రావాలతో, వేపపూలతో, మామిళ్ల గుబురులతో, పూల సౌరభాలతో, పిండి వంటలతో, బంధు సమాగమంతో, ఆలయాల్లో పూజాదికాలతో వేద పండితుల ఆశీర్వాదాలతో పండుగను నిండుగా నిలుపుకుంటున్న ఛాయలు పూర్తిగా మటుమాయం కాలేదు. మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవాదరాలు, మానవీయ విలువల పట్ల సమాదరణలు కలవారున్నారు.

వసంతకాలే సంప్రాప్తే
కాకం కాకః పికం పికః

అన్నట్లు కోయిలలేవో, కాకులు ఏవో ఆమని ఏమని వివరించాలా అని సందిగ్ధపడదు. చైత్రమాస సంరంభమే కొత్త ప్రకృతికి ఆవిష్కరణమై కాలం విలువను, ఉగాది ఉనికిని ఉల్లాసభరితం చేస్తుంది. సూర్యమండల మధ్యమున శ్రీమన్నారాయణుడే హిరణ్మయ స్వరూపంలో కాలచక్రాన్ని నడుపుతున్నాడని మనవారి విశ్వాసం.
మహత్తర తపశ్శక్తి సంపన్నులైన మన ఋషులు నవగ్రహాలను, వాని భ్రమణాలనూ గుర్తించి, అనంతమైన కాలస్వరూపాన్ని నిరూపిస్తూ - కాలం కాలమానానికై ఘడియలు, విఘడియలు, దివారాత్రాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ మాసాలను ఏర్పరచారనీ, ముఖ్యంగా చాంద్రమానాన్ని తెలుగు వారు పాటించడం జరుగుతోందనీ అనూచానంగా మనం చెప్పుకుంటున్న విషయం. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 3 సెకన్లు పడుతుందట. అమావాస్య వెళ్లిన పాడ్యమి నుండి మరల అమావాస్య వరకూ చంద్రుడు ఒక భూప్రదక్షణం చేస్తూ ఒక రాశి నుండి మరో రాశికి భూమితోపాటు చేరుతూంటాడనీ, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 54 నిమిషాల కాలం పడుతుందనీ, భూమి సూర్యుని చుట్టి వచ్చిన కాలానికే సౌరమాన సంవత్సరమని పేరు పెట్టారనీ మన జ్యోతిషవేత్తలు చెప్పే మాట.
చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం నెల, అలాంటి పనె్నండు నెలలు ఒక సంవత్సరం అదే చాంద్రమాన సంవత్సరం. సౌరమానానికీ, చాంద్రమానానికీ రెండింటికీ కొద్ది రోజులు తేడా వస్తుంది. మన జ్యోతిష్కులు ఋతువులతో స్పష్టంగా కాన వస్తున్న సౌరమాన సంవత్సరాన్నీ, శుక్ల, కృష్ణ పక్షాలతో కానవస్తున్న చాంద్రమాన సంవత్సరాన్ని దేనినీ వదులుకోలేక ఆ తేడా వచ్చే రోజులను సరిపెట్టేందుకే ‘అధిక మాసం’ సృష్టించారు. ఈ ఆచారం ఋగ్వేద కాలం నుండీ వుందని పురాణాల వల్ల తెలుస్తోంది. సంవత్సరాది పండుగ జరుపుకునే ఆచారం వేదకాలం నుంచీ ఉందట!
రాత్రింబగళ్ల కాలం సమానమయ్యే వసంతకాలమే వేదయుగంలో కూడా ఉగాదిగా పరిగణింపబడింది. యజ్ఞయాగాదులు ఆ దినానే్న ప్రారంభించి సంవత్సరం పొడుగునా చేసేవారట! అనాది నుంచి ఈ సంవత్సరాది భిన్న ప్రాంతాల వారికి, భిన్న భాషల వారికీ భిన్నంగానే ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్రులు ఈ ఉగాది వేడుకల విషయంలో మనకు దగ్గర. తమిళులు, బెంగాలీల సంవత్సరాది వేరు.
జీవితం షడ్రుచుల సమ్మేళనం అన్నదానికి ప్రతీకగానూ అన్నింటినీ స్థిరచిత్తంతో స్వీకరించాలనీ, స్థితప్రజ్ఞత అవసరమనీ ఉగాది పండుగ ఉదయానే్న వగరు, పులుపులతో కూడిన మామిడి పిందెలతోను, పులుపు, తీపులతో మిళితమైన కొత్త చింతపండుతోనూ చేదయిన వేపపువ్వుతోనూ, కొత్త బెల్లంతోనూ తయారయిన పచ్చడిని సేవించడం, కొన్ని పల్లెల్లోనయితే గ్రామ పురోహితుడే ఇంటింటికీ వచ్చి ఆ పచ్చడిని తెచ్చి ప్రతివారికి ఇవ్వడం జరిగేది. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో పల్లె ప్రజలు ముఖ్యంగా రైతులు ఉదయం నుండీ కొత్త గోగునారతో పగ్గాలను తయారుచేసుకుని, సాయంత్రం తమ నాగలికి పూజలు చేసి సకుటుంబంగా తమ పొలంలో ఏరువాక ప్రారంభించి పాలేళ్లకు, జీతగాళ్లకు కానుకలివ్వడం, ఒక సమష్టి జీవన సంవిధానాన్నీ, పరస్పర ప్రేమాదరాలనూ ప్రతిఫలింప చేయడమూ ఉంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసుకుని తదనుగుణంగా తమ జీవన విధానాలనూ, కార్యక్రమాలను ప్రణాళికాబద్ధం చేసుకోవడం సంప్రదాయం పట్ల విశ్వాసానికి నిదర్శనం. పంచాంగ శ్రవణం యజ్ఞ ఫలంతో సమానమనే భావన వుంది.
క్రితం మాటు వికారి నామ సంవత్సరం 1959లో వచ్చినప్పటికి అంతకు ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలుగా ఛిన్నాభిన్నమైన తెలుగు జాతి ఏకజాతిగా సుసంఘటితం కాగా, ఈ వికారి 2019కి మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడివడి అసలు దేశం మొత్తం ఎన్నికల సంరంభంతో రాజకీయ నానా వికారాలతో సాక్షాత్కరిస్తూండడం విధి వైచిత్రియే మరి!

ఏ పేరు పూని వచ్చిన
నీపై మా కోర్కులెల్ల నెలకొనునయ్యా
ప్రాపై ఏటికి యేడున్
చూపుము నీ మంచితనపు సౌరది నుగాదీ!
బొడ్డు బాపిరాజు గారన్నట్లు, పేరేదైనా తీరేదన్నదే మనకు ముఖ్యం. ఆ సౌరు బాగుండాలనే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అసలు ఉగాది అంటేనే వసంతం, కోకిలలు, పూలకారు ప్రకృతి అందాలు.
ఆకులందున అణగిమణగీ
కవిత కోకిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమందభిమానములు
మొలకెత్తవలెనోయ్!

అని గురజాడ వారన్నారు అంటే - కవి కోకిలలకు బాధ్యత వుందనీ, వారి కూతలు దేశానికి ప్రగతి చేతలు కావాలనీ, అలాంటి నేతలును ఎన్నుకునే చైతన్య స్ఫూర్తి నివ్వాలనీ సత్సంకల్పం. కానీ కవిత్వమూ రాజకీయమై పోయి సమష్టి చేతన కులాలుగా, ప్రాంతాలుగా శకలాలు శకలాలుగా ఛిద్రమై పోతుంటే ఆర్తియే కలుగుతోంది.
మావి గుమ్మ కొమ్మ మాటున
పల్లవము మెక్కి కోయిల పాడుటేల
పరుల తనియించుటకో - తన బాగు కొరకో
గానమొనరింపక బ్రతుకు గడువబోకొ?

అని కృష్ణశాస్త్రి గారన్నట్లు కవిత్వం మానవీయ విలువల శిఖరాయమానం కవి తన గురించి తాను రాసుకున్నట్లు కనబడినా అందులో పరహితార్థ చింతన వుంటుంది. ఉండాలి. కవిత్వమే జీవితం అన్నంత స్వచ్ఛత ఉండాలి. ఉగాదిని లక్ష్మిగా, సౌందర్య దేవతగా సంభావించడమూ వుంది.
ఉగాది లక్ష్మిని చూదాము
వసంతలక్ష్మిని కొలుతాము
రారండి! రారండి!
రంగురంగులా పూలివిగో
కమ్మని పూలా తావిదుగో
పూలను చేరే రేడిడుగో
ఝుమ్మను తుమ్మెద రవమిదిగో
గున్నమామిడి కొమ్మదిగో
కొమ్మ చివరా చివురిదిగో
చివురుల మేసే పికమిదిగో
రాగము కూర్చే స్వరమిదిగో
రారండి! రారండి!!

అని పిల్లలమర్రి హనుమంతరావు గారు పిల్లలకు కూడా సుబోధకంగా ఉగాది లక్ష్మిని ఆహ్వానించారు. మామిడులు, కోకిలలు, పూలు, తుమ్మెదలు లేని ఉగాది కవిత అందునా సంప్రదాయ కవుల పద్యాలే లేవు.
1959 నాటి సుప్రసిద్ధ స్ర్తిల మాసపత్రికగా పేరొందిన కేసరి కుటీరం వారి ‘గృహలక్ష్మి’ ఉగాది సంచికలో వికారి నామ సంవత్సర ‘ఉగాది కానుక’ అంటూ కవిభూషణ బిరుదాంకితులైన కల్లూరు అహోబలరావుగారు రాసిన పద్యాలివి కొన్ని-

పండుగ నేడుగాది, పరిపాటిగ భామినులెల్ల, నిండు పూ
దండలు గ్రొత్త పుట్టములు దాల్చి, సుభూషణముల్ ధరింత్రు; నీ
వండజయాన! శ్రీకరము - హాస మనోహర వేషభూషలన్
నిండుగ దాల్చి రమ్ము; తరుణీ! వరదమ్మ - వికార వేషముల్
హృదయానందకరీ! సౌ
ఖ్యదరీ! నారీ! ఒయారి! కడు శృంగారీ!
ముదమొసగెడు, సంసారీ!
ఇదె మా స్వాగతము! స్వీకరింపు, వికారీ!
కలరుతములు బలికెను, కో
యిలగమి, మలయా నిలంబు లింపుగ వీచెన్
లలిసుమములు వర్షించెను
కోలు వింపారంగ జేసికొమ్ము, వికారీ!
... ...

జిలిబిలి పల్కులన్ తెలుగు జినె్నలువనె్నలు జిందులాడ, కో
కిలకలనాదముల్ వెలయఁ గినె్నరసానులు, నట్టువాడగా
గలకలఁదెల్లు కబ్బములు, కమ్మగవ్రాయ గవీంద్రకోటి, మే
ల్కొలుపుము శ్రీ వికారి! కయికొమ్ము! జోహారులుగాది కానుకల్.

1959లో రాజుగా గురువు, సేనాధిపతి చంద్రుడు, మంత్రిగా కుజుడు వున్న వికారి వస్తే ఇప్పుడు రాజు, సేనాధిపతి, అర్ఘ్ధాపతి కూడా శనియేననీ, మంత్రి రవి అనీ, సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు అనీ ధాన్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు అనీ, రసాధిపతి శుక్రుడు అనీ జ్యోతిష పండితులు అంటున్నారు. మరి ఈ ‘వికారి’ ప్రారంభమే ఎన్నికల వేళ అనేక రకాల రాజకీయ వికారాలతో అడుగు పెడుతూంటే ఏ విధమైన ఫలితాలు లభిస్తాయన్నది సందేహాస్పదమే అయినా ఆశాజీవులం కనుక మంచినే అభిలషిస్తాం. అభిలషిద్దాం.
ఉగాది సంప్రదాయవాదులకే అనుకోవడం నేడు పొడచూపుతున్న ఓ విడ్డూర వైఖరి. ఉగాదిని జరుపుకోవడం కూడా వర్ణగత ఆధిపత్య భావజాలం అనే వ్యాఖ్యలు నేడు కొన్ని వినబడుతూండడం కూడా ‘ఎక్కడికి పోతున్నాం మనం? అగాధ పాతాళ కుహరాలలోకా? ఉత్తుంగ హిమవన్నగ శృంగాల వైపునకా?’ అని సి.నా.రె. ప్రశ్నను వేసుకోవాల్సి వస్తోంది.
గత వికారికి విశాలాంధ్ర దినపత్రికలో ‘ఉదయభాను’ అనే నాటి, కవి ‘సమీక్ష’ అని ఉగాదినిలా సంభావించాడు.

ప్రేయసి ఉత్తరంలా వచ్చింది ఉగాది
పేకాటలో జోకరులా వచ్చింది
విచ్చిన ఉషస్సులా విచ్చేసింది ఉగాది
ఇరాక్‌లో ఖాసింలా వచ్చింది
ఎడద ఎడదను కొత్త కోర్కెలే పండీ
గుండె గుండెకు క్రొత్త నెత్తురులు నిండీ
వింతగా ఉంటుంది ఉగాది వేడుక
ఇది కాలం పుట్టిన రోజు పండుగ
తెలుగు సాహితీ లోకంలో శ్రీశ్రీలా
అక్షరాలా అతని మహాప్రస్థానంలా
సామ్యవాద జగతీ సంస్థాపనా
లక్ష్యసంఘటిత ప్రజాపోరాటంలా
ఈ ఉగాదిలో నిండుదనం నిండి వుంది
ఏదో నిత్యనూతనత్వం నిబిడి వుంది
ఆమని చిగురించి నేడు మామిళ్లు కాసి
వేపలు పుష్పించి నేడు వేకువలు వెలిగి
ఎదురేగి ఎదమ్రోగి హారతిచ్చాయి
సిగ్గుపడుతూ చైత్ర మనునయించింది.
మనిషి మనిషికి మధ్య దూరాలు త్రెంచి
మనసు మనసుకు మధ్య వైరాలు త్రుంచి
సముజ్జ్వల భావికై బాట వేసేను
ఈ రోజు
మరో మంచి లోకానికి నాంది చేసేను
ఇది ప్రస్థాన యాత్రలో ఒక మైలురాయి
అంచేత నేడు గతాగతాల సమీక్ష వ్రాయి.

అంటాడు ఆ కవి.
ఆ స్వతంత్ర స్వర్గమునకు మేలుకో భారతీయుడా
ఈ వికారి వత్సరమున ఇంపుసొంపు గులుకుచుండ
దైన్య జడత లేని మనోధైర్య స్థైర్య సహితమైన
నిశ్చలత్వమంది నీవు నిక్కినడచు ఠీవి గల్గి

అంటూ డి.రాజన్న అనే కవి గృహలక్ష్మిలోనే వికారి గేయము రాస్తూ నాటి దేశభక్తి జనితమైన భావనలను జమలికగా ఇలా అంటుకట్టాడు.
సత్యధర్మ మహింసా శాంతి దాంతులొల్కునట్టి
నిత్యవౌ ప్రభుత్వరీతి నెగడుగా వికారిలోన
దేశపిత మహాత్మాగాంధి తెలిపినట్టి విశ్వప్రేమ
దేశదేశములను నెగడి తేజరిల్లు వికారిలోన
భారత త్రిమూర్తులరయ గాంధి, టాగూరు, అరవిందులూ
వారి వేద సత్యఘోష నీ ‘వికారి’లో వెలయగా
ఆటంబాంబు లలజడిని ఆత్మబల్మి నణగద్రొక్కి
పంచశీల జండా నూత్న వత్సరమున వెలయుగా
ఈ వికారి వత్సరమున నే వికారములు లేక
పాడిపంటలెల్ల భోగభాగ్యములు జేకూరుగా!

అని అభిలషించి ఆశావహ సందేశగీతి పలికాడు. ప్రస్తుతం మహాత్మాగాంధీ 150వ జయంతి సమాపన వేడుకలు సాగుతున్నాయి. ‘గాంధీ అనేది ఒక పేరు కాదు ఈ కాలానికి అవసరమైన ఒక జీవన విధానం’ అని ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి పెరల్‌బక్ అన్నట్లు నేటి తరానికి గాంధీ మార్గం గురించిన పునర్ముల్యాంకనం అవసరం. పంచశీల సూత్రాలు అప్పట్లో ప్రాచుర్యంలో వున్నాయి. నిజానికి ‘దేవుడే సత్యం’ అని మొదట్లో అన్న గాంధీ ఆ తరువాతి కాలంలో ‘సత్యమే దేవుడు’ అని విశ్వసించి నడిచి నడిపించాడు.
తుపాకీల హతం చేసి
కృపాకీల వెలిగించుడు

అని కవి దాశరథి అన్నట్లు అణుబాంబులు కాక అహింస యొక్క ఆవశ్యకతే ఈ తరానికీ అవసరం. భోగభాగ్యాలతో, పాడిపంటలతో దేశం విలసిల్లాలంటే అన్నదాత రైతు ముందు క్షేమంగా ఉండాలి. ప్రస్తుత వ్యవస్థ పట్ల ‘రోసి’ నిజామాబాద్‌లో రైతులు తామే అధిక సంఖ్యలో పార్లమెంట్ నామినేషన్ పత్రాలు వేసి ఓ హెచ్చరికను చూపారన్నప్పుడు నిజంగా భూమిని నమ్ముకున్న రైతు నేలను అమ్ముకుని పోకుండా జీవించగలిగే సుఖమయ తరుణమే అభిలషణీయంగా కదా మరి!విశిష్టమైన కాలపురిక్క అనే భావనకు ఈ ‘వికారి’ ఓ సంకేత పదం అన్నాడో కవి. నిజంగా నక్షత్ర కాంతితో కాలం వెలుగొందాలని ఈ వికారిలోని అర్థాన్ని పరిణామయుక్తం చేసుకోవడం దోషమేమీ కాదు కదా!
దేశరాజు భారతీదేవి అరవై ఏండ్ల క్రితం తన కవితలో సంభావించినట్లుగా అందుకోదగిన అశంసల భావశబలత ఇది.

సగుణబ్రహ్మము నీ మహామహిముచే సంజాతమై యందు నీ
జగతీ చక్రము గల్గె నీ వలననే, సర్వంబు నీ కార్యమే
యగు గాదే; నిను దప్పుకోగలుగు బ్రహ్మంబొండు మాత్రంబె, ని
త్యగుడౌనేమో, వికార శూన్యతను బెంపారన్ ‘వికారీ’ నమః
శుభం భూయాత్ !
-సుధామ 
98492 97958

Home

Monday, July 9, 2018

పిఠాపురం పుస్తకం -పాలమూరు పుస్తకం



ఆంధ్రభూమి 
వారపత్రిక 

5.జూలై '2018 సంచికలో 
వచ్చిన 
రెండు పుస్తక సమీక్షలు 

1.పిఠాపురం క్రానికల్స్ -
          -శ్రీ కంభంపాటి రవీంద్ర 

2.సాహితీవనంలో ఒక మాలి 
       కపిలవాయి లింగమూర్తి 
         -డా.కొల్లోజు కనకాచారి