ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 13, 2012

'మధ్య’మావతి







‘ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచడంవల్ల, వాటి ధరలు పెరుగుతున్నాయి.’’ అన్నారట చిదంబరంగారు.’’

‘‘ఆ లెక్కన మరి వాటిని పండించిన రైతు లాభపడాలి కదా! అదెక్కడ జరుగుతోంది? రైస్ మిల్లర్లు, వ్యాపారాలు రైతుకు గిట్టుబాటు ధరలు చెల్లించి కొనడం లేదు. వారి అవసరాలనూ, దుస్థితినీ ఆసరాచేసుకుని, వారిని ఉద్ధరిస్తున్నట్లుగా చేసే కొనుగోళ్లు, అతి చవక బేరాలే! కానీ ఆ తరువాత తాము మార్కెట్‌లో అమ్మకానికి విడుదల చేయడం మాత్రం- ఓ గొప్ప మాయాజాలం. దాంతో ఇబ్బడిముబ్బడిగా లాభపడేది వాళ్ళే! ‘అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి’లాంటి సామెతలు ఊరికే పుట్టలేదు. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంట, అతని కళ్ళముందరే రెక్కలు కట్టుకుని ధర విషయంలో పైకి ఎగిరిపోతుంది. తనకు ముట్టేది మాత్రం ‘నేలబారే’! ఆ తరువాత తాను కొనుక్కుందామన్నా ధర ‘ఆకాశాన్నంటు’తుంది. ధరల నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనబడడంలేదు. అందువల్లే బియ్యం రేటు గత మూడేళ్ళలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.’’

‘‘సర్లే! మినరల్ వాటర్ పదిహేను రూపాయలయినా, ఐస్‌క్రీమ్ పాతిక రూపాయలయినా పెట్టి కొంటారు గానీ, బియ్యానికి రూపాయి ఎక్కువ పెట్టాలంటే ఈ మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెట్టేస్తారు అంటూ చిదంబరంగారు మిడిల్ క్లాస్‌ను ఎద్దేవాకూడా చేసారు. ఐస్‌క్రీమ్ ఏమయినా నిత్యావసర వస్తువా? అసలు ‘నీళ్లు’కొనుక్కునే స్థితికి తెచ్చిందీ, ప్రకృతి సహజవనరైన నీటిని అమ్ముకునే స్థాయికి దిగజార్చిందీ- ఈ ప్రభుత్వాలే కదా! శుద్ధిచేసిన మంచినీటిని గ్రామగ్రామానికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది కదా! నీటిని వ్యాపార సరుకుగా చేసిన మన దేశ దుస్థితికి పాలకులూ, వారి ప్రపంచీకరణ బానిసతనాలూ కారణం కాదా? నిజానికి మధ్యతరగతి కోణంనుంచే కదా తలసరి ఆదాయాలూ, అభివృద్ధిరేట్లూ లెక్కకట్టేది. ‘ధరల పెరుగుదలను మధ్యతరగతి ప్రజలకోణంనుంచి చూడరాదు’అని చిదంబరంగారు అనడం- అర్థరహితం. అక్రమార్జనలతో ఎదిగే సంపన్నులకు ఇబ్బందేం వుంటుంది? ఇక మధ్యతరగతి దిగువ ప్రజల విషయానికి వస్తే- వారిని ప్రజలుగా కాక ప్రభుత్వాలు ‘ఓటర్లుగా’ చూస్తాయి కనుక, కిలో రెండు రూపాయల బియ్యం వంటి సంక్షేమ పథకాలు అన్నీ వారికే కదా! నిజంగా- ఉచితాల పేరుతో, పథకాల పేరుతో, పాలకులు కలిగించే ప్రయోజనాలు మధ్యతరగతికి అందేవేమీ కావు. ‘తెల్లరేషన్ కార్డు’దారులు వేరు! నిజంగా వారి కోణంనుంచీ ధరల పెరుగుదల చూడకూడ
నేఅనేస్తారేమో చిదంబరంగారు. ఏమన్నా అంటే- సబ్సిడీలు అన్నీ మీకేకదా అని, వారినీ బుకాయించగలరు!’’



‘‘అన్నిటికీ తేరగా దొరికింది ‘మధ్యతరగతి వాడే’! అగ్రరాజ్యమైన అమెరికావాడి దృష్టిలో భారతదేశం సంపన్న దేశమూ కాదు, పేద దేశమూ కాదు. ‘మధ్యతరగతి దేశమే’. అందుకే భారతీయులు తిండిపోతులు అనీ, చమురు ధరలు పెరగడానికి భారతీయులే కారణమనీ తమ పెత్తనంతో మొత్తాలని వ్యాఖ్యానిస్తూంటుంది అమెరికా! అసలు ‘మధ్యతరగతి మనస్తత్వం’అనేది చిదంబరంగారు అనేంత పరిహాసాస్పదమైంది కాదు. నిజానికి మధ్యతరగతిలోనే సర్దుబాటుతనం, ఓరిమి, సంతృప్తి అనేవి వున్నాయి కనుకనే, వాళ్లవి తాటాకు మంట ఆవేశాలు కనుకనే, ప్రభుత్వాల నిర్లక్ష్యాలూ, నిస్తేజాలూ, ఆటలూ సాగుతున్నాయి. మధ్యతరగతి మేధావులుమౌనం’వహిస్తున్నారు కనుకనే, ఉద్యమాలు ‘ఉప్పెనలు’కావడం లేదు. ప్రభుత్వాలని ముంచెత్తడం లేదు! నిజానికి ‘ఓటు’మీద మధ్యతరగతి విరక్తియే, ఎక్కువవుతోంది! మధ్యతరగతి వాళ్లు ఓటువేయడం మానేస్తారేమోగానీ, మధ్యతరగతి ఓటర్లను కొనడం నేతలకు నల్లేరుమీద బండి నడకేమీ కాదు! డబ్బులు పంచీ, సారాయి పోయించీ, ప్రలోభాలుపెట్టీ, ఉచితాల పేరుతో ఊదరగొట్టీ, దిగువ మధ్యతరగతి నుండీ, సామాన్య అణగారిన ప్రజలందరినుంచీ, తమతమ గారడీ గమ్మత్తులతో- అనుకూలంగా ఓట్లు రాబట్టుకోగలరేమోగానీ, నిజంగా ‘మధ్యతరగతి’ తలుచుకుంటే, వ్యవస్థలో మార్పు అసాధ్యమేమీ కాదు! అందుకే ఓటర్ల లిస్టులో పేర్లు గల్లంతయ్యేదీ, రాజకీయాలంటేనే ఓ చిరాకూ, ఉదాసీనత కలిగేదీ మధ్యతరగతికి సంబంధించే.’’


‘‘కానీ చూసావ్! మధ్యతరగతివారి నుండే ఆదాయపుపన్నులు రాబట్టగలిగేదీ సజావుగా జరుగుతోంది. ఉద్యోగస్తులైన ‘మిడిల్ క్లాస్’వారే సక్రమంగా అధిక సంఖ్యలో పన్నులు కడుతున్నది. ఏమైనా పన్నులు ఎగవేసేది సంపన్నులే! దారిద్య్రరేఖకు దిగువున వున్నవారి గూర్చి చెప్పేదేముంది! అంటే ఏమిటన్నమాట?- ధరల పెరుగుదలను భరిస్తున్నదీ, పన్నుల భారం మోస్తున్నదీ, క్షుద్ర రాజకీయాలను కొనసాగనిస్తున్నదీ ‘మధ్యతరగతి’ మనస్తత్వమే. బతుకుపచ్చడి అవుతున్నా- పచ్చడి మెతుకులతో సంతృప్తిపడేదీ వారే! అలాంటి మధ్యతరగతిని చిన్నచూపు చూస్తూ, అవహేళనగా మాట్లాడటం- చిదంబరంగారికే కాదు, ఎవరికయినా సముచితం కాదు! నిజానికి మధ్యతరగతి చైతన్యవంతం కావలసిన అగత్యమే ఎక్కువగా వుంది. పట్టణ మధ్యతరగతి ప్రాంత ప్రజల దృక్కోణంనుంచి మాత్రమే ధరల పెరుగుదలను చూడరాదంటే- అసలు కొనుగోలుశక్తికి కొలబద్ధ ఎక్కడనుండి చూస్తున్నారో చెప్పాలి? నిజానికి ‘కన్స్యూమరిజం’ అంత, మధ్యతరగతి వారిపై ఆనుకునే సాగుతోంది. వినియోగదారుల్లో అధిక శాతం మధ్యతరగతి అని ఒప్పుకు తీరేప్పుడు, ధరల పెరుగుదలను వారి దృక్కోణంనుంచి చూడకపోవడం అంటే- ‘మొగుడిని కొట్టిమొగసాలకు ఎక్కడం’ లాంటిదే.’’

ఇలా రాంబాబు, సన్యాసిల సంభాషణను శంకరం, ప్రసాదు 
మౌనంగా అలా వింటున్నారంటే అదీ మధ్యతరగతి మెంటాలిటీయేనేమో!

0 comments: