ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, January 14, 2021

ఆ'కర్షక' సంక్రాంతి






ఆ'కర్షక' సంక్రాంతి 

వ్యవసాయాధారితమైన మనదేశంలో ఆంధ్రదేశానికి ‘అన్నపూర్ణ’ అని పేరుండేది అంటే అందుకు కారణం – తెలుగునేల వ్యవసాయానికి పెట్టింది పేరు. సుక్షేత్రమైన వ్యవసాయ భూములకు కాణాచి. తెలుగునాట రైతు కుటుంబాలు అసంఖ్యాకంగా వర్ధిల్లుతూ ‘దేశానికి వెన్నెముక రైతు’ అన్న మాటకు నిదర్శనంగా తెలుగునేల పండిన పంటలు దేశాన్ని అన్నివేళలా ఆదుకునేవి. అందుకే పంట ఇంటికొచ్చే పర్వంగా తెలుగువారి పెద్దపండుగగా ‘సంక్రాంతి’ శోభిల్లుతూండేది. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులే కాదు ఈ మాసం అంతా ఉత్సవాలతో, పచ్చదనాల ప్రకృతి శోభ కళకళలతో విరాజిల్లుతూండేది. పల్లెల శోభతో పట్టణాలూ మురిసేవి. సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, జంగమదేవరలు, గాలిపటాలు, కోడిపందేలు, బొమ్మల కొలువులు, గోపూజలు, అల్లుళ్ళ రాకలు, పిల్లలకేరింతలు, ధాన్యపురాశులు, భోగిపళ్ళు, నూతన వస్త్రాలు, ధాన్యాల వితరణశీలత… ఎన్నెన్ని మధుర ఘట్టాలు! ఎంతెంత సందడి – సంబరాలు.

ఎప్పుడో యాభైరెండేళ్ళ క్రితం పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో కృష్ణాపత్రిక రసమంజరిలో ప్రచురితమైన ‘సంక్రాంతివర్షము’ అనే నేను రచించిన కవిత ఒక తలుచుకునే తరుణం మరి!-

రమణుల్‌ రచించిన రంగవల్లికలతో
ఇంటింటి ముంగిళ్ళు ఇంపుమీర
మంచుభయము తోడ మారిన తామర
లనిపించు బంతిపూవరుసతోడ
పచ్చపచ్చని చేల పండినపంటల
ప్రజలముఖములు ప్రభలవెల్గ
అచ్చమైనట్టిదీ ఆంధ్రుల పబ్బంబు
సంక్రాంతినిచ్చెరా సంతసమును

పంట యింటనుండు పబ్బంబునాటికి
పిండివంటకొరకు చింతలేదు
కొత్తబట్ట తొడుగు కోరికయునుదీరు
ఏమి లోటు లేదు ఏటి కంత

ఏటికొక్క తఱిన ఏతెంచు నియ్యది
నేడునొసగె ముదము నెంతగానొ
నిజము చూడ నూత్న వర్షమ్మిదియెగాన
నెంతు కలుగు మీకు నెంతొ శుభము

కానీ కాలంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతమార్పు! ఒకనాటి సంక్రాంతి కళాకాంతులు ఈనాడేవీ? అప్పటి మానవసంబంధాలు పరస్పర ఆత్మీయతలు, పదిమందికి పెట్టుపోతలు ఈనాడు మసకబారుతున్న దృశ్యాలు కానవస్తున్నాయి. ఇది చూసే కనుల లోపంకాదు జనులలోపమే. ఆనాడు రైతుకున్న విలువ నేడు ఎక్కడుంది? వ్యవసాయ భూములు సైతం రియల్‌ఎస్టేట్‌ కబంధహస్తాల పాలవుతూ అసలు వ్యవసాయమే పనికిరాని వృత్తి అన్న భావనలు ఎగసివస్తున్నాయి.

రైతు పంటలు పండించడం తన ‘వృత్తి’ అని ఏనాడూ అనుకోలేదు. అది తన జీవన’ధర్మం’గా భావించాడు. వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో నెరపలేదు. సమాజాభ్యున్నతికి ప్రజల ఆకలి తీర్చడం తన సామాజిక బాధ్యతగా తలపోశాడు. నేలను నమ్ముకుని బ్రతికాడేగాని అమ్ముకు బ్రతుకాలని భావించినవాడు కాడు. అలాంటి దేశానికి వెన్నెముక వంటి రైతు జీవనమే నేడు వెన్నెముక విరిగినట్లవడం విషాదం.

ప్రజ కడుపు నింపే రైతునే శాసించే పాలకులు రూపొందడం నిజమైన కర్షక సంక్రాంతికి ఒక అవరోధం. ఏ పంటలు పండించాలో తాను చెప్పినట్లు వినాలన్నాడు ఓ ముఖ్యమంత్రి. రైతునేస్తం అంటూనే పథకం ప్రకారమే రైతుల ఆశలకు గండికొడతాడు మరో ముఖ్యమంత్రి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఇవాళ రైతు హస్తాలు మొక్కవోని సంకల్పంతో పైకి లేస్తూనే వున్నాయి. తమ హక్కులకోసం కర్షకులు క్షత్రియులుగా పోరాట యోధులు కావాల్సి రావడం కన్న కాలవైపరీత్యం ఏముంది. అన్నదాతలపై హర్యానా సర్కార్‌ విరుచుకుపడి లాఠీఛార్జి, జలఫిరంగులు, బాష్పవాయు ప్రయోగంతో యుద్ధవాతావరణాన్ని సృష్టించిన వార్త పాలకదాష్టీకానికి పరాకాష్ఠ కాదా! అసలు పైరుపాట పాడుకునే రైతు పోరుబాట పట్టడమే, పట్టకతప్పని పరిస్థితులు సంభవించడమే -కళతప్పిన సంక్రాంతికి సూచిక అనిపిస్తుంది.

ఇవాళ కర్షకుల ప్రయోజనాల కన్నా కార్పొరేట్‌ ప్రయోజనాలు ముఖ్యమైపోతున్నాయి. రైతు వ్యతిరేక చర్యలు స్పష్టంగా కానవస్తున్నప్పుడు రైతు బ్రతుకు తాడుతెగిన గాలిపటంలా అవుతున్నప్పుడు క్షోభకాక మరేమిటి? రైతులపై కార్పొరేట్‌ శక్తుల దోపిడీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. బాస్మతి వరి పండించే రైతులకు కిలోకు 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తూంటే అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూస్‌ స్పెషల్‌ బాస్మతీరైస్‌’ అనే బ్రాండెడ్‌ ఉత్పత్తికి కిలోకు రెండువందల ఎనిమిది రూపాయలకు చొప్పున అమ్మకాలు చేస్తోందంటే ప్రయోజనాల మధ్య వ్యత్యాసం ఎంతగా వుందో తెలీడం లేదా!

వ్యవసాయం, ఆహారభద్రత, పర్యావరణం, విత్తన సార్వభౌమాధికారం ఇలాంటివన్నీ రైతు బ్రతుకులతో ముడిపడి వున్నవే. నిజానికి ప్రజాప్రయోజనాల కోసం తమ జీవితాలను అంకితం చేసేదీ, చేస్తున్నదీ రైతులేకానీ రాజకీయ చదరంగాలాడే పాలకులు కాదు. అందువల్ల రైతు సంక్షేమంలోనే నిజమైన సంక్రాంతి వుంది. సంకురాత్రిని రైతులకు త్రిశంకురాత్రిగా మార్చే పరిణామాలను అడ్డుకోవలసిందే!

ఇది మకర సంక్రమణ వేళ. చచ్చినా బ్రతికినా విలువచేసే గజేంద్రుల వంటి రైతులు మకరం బారిన ‘లా’ వొక్కింతయులేదు’ అంటూ ఆర్తితో ‘సంరక్షింపు భద్రాత్మకా!’ అని మొరపెట్టుకోవడం అలవైకుంఠపురవాసి అయినా కరుణతో కదలిరావాల్సిన ఘట్టం. అలాంటిది పాలకులే కార్పొరేట్‌ దిగ్గజాల ముందు గంగిరెద్దు డూడూ బసవన్నలై వ్యవహరించడం సరికాదు. ఇళ్ళ ముంగిళ్ళు రంగవల్లులతో శోభిల్లాలేగానీ రాజకీయం ముగ్గులోకి దింపి ప్రజా సంక్షేమాన్ని పరిహాసపాత్రం చేయకూడదు.

నిజానికి సంక్రాంతి ప్రకృతితో ముడివడిన కర్షకపర్వం అనేది నిత్యసత్యం. నిజానికి ఇవాళ ప్రకృతి తన సహజతను తిరిగి సంతరించుకుంటోంది. 2020 ‘కరోనా’ కారణంగా జరిగిన ఒక గొప్ప మేలుగా ఈ పర్యావరణ సమతుల్యతను, ప్రకృతికి తనదిగా దక్కిన ప్రశాంతతను సంభావించాలి. అందుకే మనిషితప్ప అనేక జీవరాశులకు కరోనా స్వేచ్ఛావరదాయిని అయింది. ప్రయాణాలు – అవి రహదారులపైనయినా, గగనతలంపై అయినా నియంత్రితమై నేలా ఆకాశం కూడా కాలుష్యరహితమై కొంత సేదతీరాయి. ఒకప్పుడు కనబడని దూరపుకొండలూ, వనజీవాలూ స్పష్టంగానూ, స్వేచ్ఛగానూ దర్శనమిచ్చాయి.

గడచిన సంవత్సరం ‘కరోనా’ మనిషికి ఎన్నో కొత్తపాఠాలు నేర్పింది. ఈ సంక్రాంతి వేళకి వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేసింది. వ్యాధిబారిన పడకుండా టీకా చేతుల పరిశుభ్రత, మాస్క్‌, భౌతికదూరంకు తోడయి రక్షిస్తుంది. అంచేత సంక్రాంతి ఓ కొత్తధైర్యాన్ని ఇస్తోంది. కానయితే గతంలోని నిర్లక్ష్యాలను మళ్ళీ తిరగదోడుకోకుండా మనిషి తానే ఒక ‘వైరస్‌’ కాకుండా సాటివారిపట్ల మానవీయబంధాలతో మరింతగా ముడిపడాలి. శార్వరి అనే కటిక చీకటి తొలగి వి(శిష్టమైన) ‘ప్లవ’లోకి అడుగిడబోతున్నాం. ప్లవ అంటే నావ, లోతు అనే అర్థాలు కూడా వున్నాయట’. అందువల్ల లోతు అయిన మానవసంబంధాలతో ఈ కష్టాల కడలిని నావతో దాటేసి అసలుసిసలు సంక్రాంతిశోభలను భవిష్యత్తులో మునుపటి విలువలతో సహా నవనవోన్మేషంగా అందుకోగలమని ఆకాంక్షిద్దాం.

Wednesday, January 6, 2021

 


‘సుధామ’ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన బహుముఖీన సాహితీ వేత్త శ్రీ అల్లంరాజు వెంకటరావు తల్లిదండ్రులు కీ.శే. అల్లంరాజు రాజేశ్వరమ్మ, కీ.శే. అల్లంరాజు కామేశ్వరరావు గార్లు.హైదరాబాద్ లో పనిచేసి తనదయిన ఒక వ్యక్తిత్వ ప్రతిభతో గుర్తింపు సాధించిన సుధామ, కవి, సమీక్షకుడు, రచయిత, కార్టూనిస్ట్‌, చిత్రకారుడు, సినీ విశ్లేషకుడు, కాలమిస్టు, వక్త, పదబంధ ప్రహేళికానిర్మాత, అన్నిటినీ మించిన వక్తృత్వ పటిమతో సాహితీలోకానికి సుపరిచితులు. ఐదు కవితా సంపుటులు, రెండు వ్యాస సంపుటులు, మూడు కాలమ్‌ వ్యాసాలు ఆరు ఇతర ప్రచురణలు మొత్తం 16 గ్రంథాలు వెలయించి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వీరి శ్రీమతి ఉషారాణి కూడా ఆకాశవాణిలో స్వీయ ప్రజ్ఞాపాటవాలను కనపర్చిన విదుషీమణి.

సుధామ సాహిత్యంలో సహజంగానే వారి వ్యక్తిత్వ ముద్ర ప్రకాశిస్తుంటుంది. సుధామతో దాదాపుగా మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నాకు ఎప్పుడూ వారిలో లవలేశమయినా గర్వరేఖలు కన్పించలేదు. సాహిత్యం బహిఃప్రాణంగా సాగిన జీవనయానంలో అందరితో మైత్రీ భావంతో మెలుగుతూ తర్వాతి తరాలకు కూడా మార్గదర్శకుడయ్యారు. ప్రాచీన సాహితీ పరిమళాలు అద్దుకొని, తెలుగు సుగంధాలను నల్దెసల వెదజల్లి. ఆకాశవాణిలో ఎందరో మహనీయమూర్తుల సాంగత్యంలో అక్షరశిల్పిగా రూపొందారు. ‘యువభారతి’ సంస్థ ప్రచురణలకు ప్రధాన సంపాదకులుగా సుధామ అందించిన సేవలు అపూర్వమైనవి. సినారె, శేషేంద్ర, ఉత్పల, దివాకర్ల, దాశరథి… ఎందరో దిగ్దంతులతో యువావస్థలోనే వేదిక పంచుకున్న కవివతంసులు. మాట, గీత, రాత అద్భుతంగా ఉంటాయి. మంచి మనసున్న ”(మీ) మన సుధామ” గురించి రాస్తున్నప్పుడు మనసంతా ఆత్మీయత, ఆనందం, స్నేహపు వెలుగులతో నిండిపోతుంది.

వివేకానందుని బొమ్మ ఏడవతరగతిలో వేసి బహుమతి పొందింది మొదలు బాపు చిత్ర సహానుగామిగా, సచిత్ర లిఖిత మాసపత్రిక ”యువమిత్ర” పత్రికా సంపాదకులుగా… ఎన్ని పనులు… ఎన్నెన్నో ప్రశంసలు! 1968 సం||లో ‘లత’ పత్రికలో ప్రచురించబడిన తొలి కార్టూన్‌ మొదలు కార్టూన్ల సుధామగా కొనసాగారు. ‘శూలబంధు’ పిల్లల పత్రికలో 1965 సం||లో మొదటి కథ రాశారు. ‘యువభారతి’ తొలి వచన కవితా సంపుటి ”వీచికలు” నలుగురు కవుల్లో సుధామ ఒకరుగా ఆ పుస్తకానికి ముఖచిత్రం వేసి మహాకవి సినారెచే ”కవితలో బొమ్మ గీస్తాడు. బొమ్మలో కవిత రాస్తాడు” అని ప్రశంసలందుకున్న నాటి యువకవి, నాడు విశ్వరచన, హాస్యప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రిక, జయశ్రీ, ఆంధ్రప్రదేశ్‌, ఈనాడు, ఆంధ్రభూమి, ప్రజావాహిని, ఉదయం, హైదరాబాద్‌ మిర్రర్‌, శుభసందర్భ కార్డులు, పుస్తకాలకు ముఖచిత్రాలు, శంకర్స్‌ వీక్లీ (ఇంగ్లీష్‌ కార్టూన్స్‌), ఆకాశవాణిలో ‘హ్యూమరసం’, హాస్యనాటికలు, ధారావాహిక ప్రసారాలు చేయించారు. 1983లో ఆకాశవాణి జాతీయ కవిసమ్మేళనానికి తెలుగు కవిగా ఎంపిక కావటం సుధామ ప్రతిభకు నిదర్శనం. గుసగులు, లిటరేచర్‌, బంగారు పాళీలు, హ్యూమర్‌మరాలు, పూతరేకులు, జాలీట్రాలీ, సం.సా.రా.లు, సినీటాక్‌, సినీమానిసి, సుధామధురం పజిల్స్‌, హాస్యచేతన, ఇలా పలు పత్రికల్లో కాలమ్స్‌.. గళ్ళనుడికట్లు నిర్వహించారు. కార్టూన్ల గురించి విశేష వ్యాసాలు రాసిన చిత్రప్రియుడు. సుధామ చేతిరాతలా ఏ కొద్దిమందిదో ఉంటుంది. అచ్చంగా ప్రింటులా అన్పించే అందమైన చేతిరాత వారి వ్యక్తిత్వ చిహ్నం.

రచనల్లో కూడా సున్నితంగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని చొప్పించగల సుధామ రాసిన ‘ఎక్సర్సైజ్‌’ కథ చదివితే మన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి చంద్రవంకలా నింగికెగురుతుంది ఒక ఇల్లాలు తన ఇంట్లో పనిమనిషి తోమిన అంట్లల్లో ఒక వెండిగిన్నె కనపడక ఉదయాన్నే పరుగెడుతున్న ‘అబ్బూచి’ని దొంగ అనుకొని పట్టించి తన్నటం, ఆపై ఆ గిన్నె ఆమె ఇంట్లోనే మరో గిన్నెకింద దొరకటం, ‘అబ్బూచి’ సన్నటి శరీరాన్ని బలిష్టం చేసుకోటానికి ఎక్సర్సైజ్‌ చేస్తూ పరిగెత్తాడని అందరికీ తెలియటం… కథా ఇతివృత్తం. లోక సహజంగా మనుషుల స్వభావ చిత్రీకరణతో పాటు ‘అబ్బూచి’ దెబ్బలు తిన్నా మళ్ళీ పరుగందుకోవటం ఆనందింపజేస్తుంది.

”కార్టూనిస్టులంతా ఆనందవర్ధనులు” అంటూ కార్టూన్లలో ఒక ధ్వని సిద్ధాంతాన్ని కనిపెట్టిన లాక్షణిక శాస్త్రవేత్త సుధామ. వ్యంగ్య చిత్రాలలో రెండు భాగాలుంటాయంటారు. ఒకటి శబ్దాశ్రీతం, రెండోది రేఖాశ్రితం. ఈ రెంటి సమ్మేళనం సమస్థాయిలో ఉండేదే ఉత్తమ వ్యంగ్య చిత్రం. దీనికి వ్యంజనాశక్తి ఆధారం. ఇది మూడు శబ్దశక్తుల్లో ఒకటి. ఇదే ధ్వని గూఢార్థం… కార్టూన్లలో అప్పడాలకర్ర ధ్వని ఒక కాలంలో ఎక్కువగానే వచ్చింది. ఒక్కొక్క కార్టూనిస్టు యొక్క ధ్వని సిద్ధాంతస్థాయిని వివరించగలిగితే అదొక పెద్ద సిద్ధాంత గ్రంథమౌతుంది. ఇలా అనేక మంది వ్యంగ్య చిత్రకారుల అలంకార, రేఖా, ధ్వని సిద్ధాంతాలను వివరించిన సుధామతో బాటు మనం కూడా కార్టూనిస్టుల్లో పీఠికాకర్తలు, సిద్ధాంతకర్తలు, విమర్శకులు, వ్యాసకర్తలు, జీవిత చరిత్రకారులు, ఆత్మ కార్టూన్‌ (కథ) రాసుకునేవాళ్ళు కావాలి.. రావాలని ఆకాంక్షించాలి.

”వయసు చిన్నదే అయినా, అతడు ప్రదర్శిస్తున్న కవిత్వపు భావగరిమ పెద్దది” అంటూ కవిప్రముఖులచేత విద్యార్థి దశలోనే ప్రశంసలు పొందారు సుధామ. ప్రసార మాధ్యమ ప్రయోక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వివిధ సాహితీ ప్రక్రియల్లో అస్తిత్వాన్ని ప్రకటించారు. ఆకాశవాణి కోసం అనేక లలిత గీతాలు రాశారు. బాలల గేయాలూ రాశారు.

”ఊరేదైనా, పేటేదైనా, మాటాడే ఆ భాషేదైనా బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే” అనే ఈ పాట బహుళ ప్రచారం పొందింది. ఉచ్ఛారణలో స్పష్టత. ఆకట్టుకునే స్వర మధురిమ సుధామ సొంతం. ”గడ్డి మొలవని భూమి” లాంటి ఉత్తమ కథలు రాసిన ఈ కథకుడు జీవితపు లోతుల్ని తరచి చూసే తాత్వికతతో మనల్ని కదిలిస్తారు.

‘కాలం వెంట కలం’ వ్యాస సంపుటికి ప్రముఖ సాహితీవేత్త విహారిగారు రాసిన పీఠిక సుధామ పరిణత ప్రజ్ఞను ప్రకటిస్తుంది. ‘మహతి’లో కార్టూన్లు, జోకులగురించి సుధామ రాసిన వ్యాసం ఆనాడే (1972) ఒక న్యాయమైన అంచనా. ఆధునిక నవలారచన ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. సామయిక కవిత్వం గురించి మరింత విశ్లేషణ జరగాల్సి ఉందనీ, ప్రయోజనకరమైన చిన్న కథలు మరింతగా వెలువడాల్సిన అవసరం గురించి వివరించారు. ‘కాలం వెంట కలం’ పేరుతో వెలువడిన సుధామ వ్యాససంపుటిలో అనేకమంది ప్రాజ్ఞులు, పండితులు, సాహితీ దిగ్గజాలు, సంస్థలు, భాషల గురించి ఉన్నత ప్రమాణాలతో రాసిన వ్యాసాలు మనలో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. ఒక అంశం తీసుకొని వ్యాసం రాశారంటే సమగ్ర సమాచారంతో బాటు తన విశ్లేషణను సునిశితంగా వెల్లడించగల నేర్పరి సుధామ.

సుధామ ప్రజ్ఞాకోణం మరోటి … అది కవిత్వం..
”రాయటం మానేశాను
అని చెప్పని దొక్కటే!
అదే నా కవిత్వం”

ఇలా చెప్పగల సత్తాగల కవి వీరు.
”వృద్ధాప్యం
వసంతం వలసపోయిన
శూన్యపు తోటలా వుంటుంది”
అంటూనే అది ఉడిగిపోయినా గాడితప్పని దివ్య
జీవనం
అంటూ ఉగాదిలో వృద్ధాప్యాన్ని నిక్షేపించారు..
దీపావళి అంటే –
”నిన్ను నువ్వు వెలిగించుకుని
నీ వారిని వెలిగించటమే,
వ్యష్టి సమష్టిలో ప్రకాశనం కావడమే!”

ఇది దీపంలాంటి మనిషికే సాధ్యమయ్యే జీవితసత్యం.

‘సందర్భ’లోని వ్యాసాలు చూస్తే వాటిలోని సారాన్ని గ్రహిస్తే సుధామగారి అద్వితీయ సాహితీమూర్తిమత్వం కన్పిస్తుంది. భాషమీద పట్టు, సముచిత పదప్రయోగం, సమున్నత సంస్కారం, సమగ్ర విషయ పరిశీలన, వాఙ్మయాన్ని మధించిన ధీశక్తి విదితమౌతుంది. విద్యార్థుల కోసం పరిచయ వ్యాసాలలో కూడా ఘనిష్ట నిబద్ధతను పాటించారు. వెలువరించిన అన్ని గ్రంథాలలో సుధామ భాష, భావగరిమ ఆకట్టుకుంటుంది. సుధామ వ్యక్తిత్వాన్నీ జీవితాన్నీ, సాహితీ జీవితాన్ని వింగడించి చూస్తే అది ఒక పెద్ద సముద్రం. అందులోని అలల్ని లెక్కించలేము. అసలు, ఒక వ్యక్తి ఇన్ని రంగాలలో ఎలా రాణించగలరు అన్పిస్తుంది. ఆయా రంగాలలో ప్రజ్ఞ కన్పరచటమేకాదు, వ్యక్తిగా సుధామ అందరికీ ప్రీతిపాత్రులు. ఒక సోదరునిలా, స్నేహితునిలా అందరితో కలిసిమెలిసి ప్రవర్తించే సుధామ రాసిన ప్రతి అక్షరం ప్రతి క్షణాన్ని సద్వినియోగపర్చుకుని రూపుదాల్చినదే! ‘సుధామ’ సప్తతి సందర్భంగా ఆత్మీయమైన శుభాకాంక్షలు తెలుపుతూ మరింతగా ఎన్నుకున్న రంగాలలో ముందుకు నడుస్తారని ఆకాంక్షిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు.

Tuesday, April 28, 2020

కరో 'నా'... కవితలు





ఆంధ్రప్రభ దినపత్రిక సోమవారం సాహిత్య పేజీ .సాహితీ గవాక్షమ్ :13.4.2020





నమస్తే తెలంగాణ దినపత్రిక సోమవారం సాహితి పేజీ చెలిమె :20.4.2020







నవతెలంగాణ  దినపత్రిక సోమవారం సాహిత్య పేజీ దర్వాజ :20.4.2020 





   ఆంధ్రప్రభ దినపత్రిక సాహిత్యపేజీ సాహితీగవాక్షం సోమవారం 4.5.2020



నేటినిజం దినపత్రిక గురువారం సాహితీకెరటాలు 7.5.2020




Monday, March 16, 2020

తాత్త్విక పరీమళాల కథల మల్లె





Sudhama Writes Special Story On Munipalle Raju Birth Anniversary - Sakshi
నేడు మునిపల్లె రాజు జయంతి
వర్తమాన సమాజంలోని సంక్షోభాన్ని– అస్తిత్వ జీవన తాత్త్వికతా ఆలోచనా ధోరణులతో, పౌరాణిక, జానపద, చారిత్రక గాథల శిల్పంతో రాసిన మేజిక్‌ రియలిజం కథకుడు మునిపల్లె రాజు. మనిషిలోని అంతర్ముఖ భిన్న పార్శా్వలను, మానవ జీవన వైవిధ్యాలను, సంవేదనలను వివరించిన ‘కథన మాంత్రికుడు’. ‘అస్తిత్వ నదం ఆవలి తీరాన’ కథాసంపుటికి 2006లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి అన్నట్లు– ‘రాజుగారు హృదయమున్న మార్క్సిస్టు, జీవితం తెలిసిన సైంటిస్టు, అన్నింటినీ రంగరించగల ఆల్కెమిస్టు.’
1925 మార్చి 16న గుంటూరులో మునిపల్లె బక్కరాజుగా జన్మించిన ఈయన మునీంద్ర, మునిపల్లె రాజు పేర్లతో కథలు, కవిత్వం రాశారు. మునిపల్లె రాజు కథలు, పుష్పాలు–ప్రేమికులు–పశువులు’, దివోస్వప్నాలతో ముఖాముఖి కథాసంపుటాలు వెలువరించారు. ఆయన రాసిన పూజారి నవల వెండితెరపై పూజాఫలంగా అలరించింది.
వేరొక ఆకాశం– వేరెన్నో నక్షత్రాలు కవితా సంపుటి ఆయన కవిహృదయాన్ని ఆవిష్కరిస్తుంది. జర్నలిజంలో సృజన రాగాలు, అలసిపోయిన వారి అరణ్యకాలు వంటి వ్యాస సంపుటాలు ఆయన మేధోపటిమకు దర్పణంగా నిలుస్తాయి. మొదటి సంపుటిలోని మొదటి కథ వారాలబ్బాయి లగాయతు, అస్తిత్వ నదం ఆవలి తీరాన ఆఖరి కథ వరకూ ఆయన ఆలోచనా ధోరణులు సమగ్ర మానవ నాగరికతా స్వభావానికి ప్రతీకాత్మకంగా ప్రస్తానించినవే. బిచ్చగాళ్ల జెండా, సవతి తమ్ముడు, యశోద కొడుకు, వీర కుంకుమ, అంతా విషాదాంతం కాదు, దంపతులు వంటివి చదివిన పాఠకులను వెంటాడే కథలు. నిశ్శబ్దం ఒక పదం కాదు, నైమిషారణ్యంలో సత్రయాగం లాంటి ప్రయోగాత్మక కథలు ఆయన నవ్య పరిణామ కథాభివ్యక్తులు.
చిన్న విషయాన్నో సంఘటననో కథలుగా అల్లగల కథకులు ఎందరో వున్నారు. కానీ బాల్యం నుంచి జీవన పర్యంతం ‘జీవితపు బైప్రొడక్ట్‌’గా కథలను మలిచిన ఘనత రాజుగారిది. అందుకే ఆయన కథలు నిడివిలో కూడా పెద్దవిగా ఉంటాయి. ‘మీ ఆకాశవాణి ప్రసార సమయంలో పది నిమిషాల వ్యవధిలో చదవగలిగే కథలు నేను రాయగలిగినపుడు వస్తానులే సుధామా’ అని రేడియో కథకు ఆహ్వానించినపుడు ఆయన అనడమూ, వారి కథారచన అనుభవాలూ జ్ఞాపకాలను అందుకే ఓ గంట వ్యవధి కార్యక్రమంగా రూపొందించి హైదరాబాద్‌ ఆకాశవాణి నుండి ప్రసారం చేయడమూ ఒక మధుర స్మరణికే.
రక్షణ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసి పాఠకులకు తన ఆలోచనలతో బతుకు రక్షణనిచ్చే దిశానిర్దేశక కథా రచయితగా తెలుగు సాహిత్యంలో సుస్థిరుడు మునిపల్లె రాజు. తొంభై రెండేళ్లపాటు జీవించి 2018 ఫిబ్రవరి 24న అస్తమించి పాఠక హృదయాల్లో జీవిస్తున్న కీర్తిశేషుడు.
- సుధామ
                             

Sunday, March 15, 2020

విద్వత్ సంపాదక ‘ఆంధ్రీ’మయ మూర్తి


S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.







ఆంధ్ర పురాణ కర్త, ప్రముఖ కవి పండితులు కీ.శే.మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి శత జయంతి సమాపనోత్సవ సభ మార్చి 5న,కాకినాడ దగ్గర పల్లిపాలెము గ్రామంలో జరుగనుంది. ఈ సందర్భంగా వారు సంపాదకునిగా 1939లో వెలువడిన ‘ఆంధ్రి’ సారస్వత పత్రికా విశేషాలతో కూడినవ్యాసం పాఠకులకు ప్రత్యేకం.
*
అక్షరామృత ఛందస్సుందరమైన ‘ఆంధ్ర పురాణ’కర్తగా, మాధుర్యధురీణ కావ్యకవితా నిత్యోత్సవ శ్రీ కళాధాములు నూర్గురి అమృతగాథా జ్యోతులనీనే ‘ఆంధ్ర రచయితలు’ గ్రంథ రచయితగా, ఆంధ్ర సాహితీ సామ్రాజ్య కవిత్వ ‘మధుకోశము’గా కీర్తిగాంచిన మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు విద్వత్సంపాదక ‘ఆంధ్రీ’మయమూర్తి. ఒక కవి, పండితుడు ఒక సారస్వత పత్రిక సంపాదకునిగా రాణ్మహేంద్రవరము రాకముందే గ్రామం పల్లిపాలెంలో ఆయన రాణకెక్కారు.

తెలుగు సాహిత్య చరిత్ర వైభవప్రాభవాలకు కేవలం మహనీయ వ్యక్తులే కాదు, స్థల కాలాదులు కూడా వారి ఉనికి పట్టులుగా సంస్మరణీయాలే, సంస్తవనీయాలే! అలా మధునాపంతులవారు ఆంధ్ర పురాణం రచించిన పల్లిపాలెము- ‘ఆంధ్రి’ సారస్వత మాసపత్రిక ఆవిర్భావ కార్యస్థలిగా కూడా భాసించింది. నిజానికి గ్రామాలలో విద్యావ్యాప్తి కలిగించాలనే సంకల్పంతోనే, తమ గ్రామంలో, చుట్టుపట్లనున్న పల్లెటూళ్ళలో- ఆంధ్ర భాషావ్యాప్తిని పాఠశాల నెలకొల్పి బాలబాలికలకు సంస్కృతాంధ్రాలు బోధించడానికీ, అనుబంధంగా ఒక గ్రంథాలయం స్థాపించి గ్రంథాలనూ, వార్తాపత్రికలను ఉచితంగా పఠించే అవకాశం, ప్రోత్సాహం కల్పించడంకోసమూ బహుధాన్య సంవత్సరంలో 1938లో అప్పటి కాకినాడ తాలూకా పల్లిపాలెము గ్రామంలో మధునాపంతులవారు ‘ఆంధ్ర కుటీరం’ స్థాపించడం ఒక ఉజ్జ్వల వైభవ ఘట్టం.

విద్యాబోధన, గ్రంథాలయం, విద్యార్థులకు గ్రామస్తులకు వివిధ విషయములు బోధపడుటకు సభలు జరిపి, ఉపన్యాసములిప్పించడం, నీతి, మత, సాంఘికాచారాదులను గురించిన కథలు, కావ్యములను ప్రచురించి భాషాజ్ఞానాభివృద్ధికి సహాయపడటం, క్రమంగా ఒక చిన్న పత్రిక నెలకొల్పి తద్వారా కూడా విద్యాప్రచారం చేయాలన్న మహోద్దేశ్యములతో ‘ఆంధ్ర కుటీరం’ స్థాపించబడింది. సంకల్పించిన విధంగానే కొందరు వదాన్యుల సహకారంతో పాఠశాల, గ్రంథాలయం ఏర్పడి అభివృద్ధి చెందసాగాయి. పాఠశాలలో ప్రతిదినం ఉదయం ‘ఆంధ్రీప్రార్థన’తో ప్రారంభించి సాయంకాలం ప్రార్థన మంగళ గీతాదులతో ముగించే సంప్రదాయం, అలాగే పెద్దతరగతి విద్యార్థులు చిన్నతరగతుల వారికి పాఠాలు చెప్పడం అనే పద్ధతి పరికల్పనం చేశారు. వ్యాస రచన, ఉపన్యాస శిక్షణ, పత్రికాపఠనం వంటి అలవాట్లు పిల్లలకు కలిగించారు. నూలు వడకించటం, వృత్తివిద్యలకు పూనుకోవడం అనే గ్రామాభివృద్ధి పనులకు కూడా సంకల్పం చేశారు.

‘ఆంధ్ర కుటీరం’ ద్వారా మధునాపంతులవారి ఈ ఆశయ తత్పరత, సేవాసరణి నాటి పిఠాపురం సంస్థానంలో విద్వత్కవిగా వుండిన శతావధాని ఓలేటి వేంకటరామశాస్ర్తీగారిని ఎంతగానో ఆకట్టుకుంది. వారి జన్మస్థలం ‘పల్లిపాలెము’ కావడంవలన తమ గ్రామం పట్ల అభిమానంతోనూ, మధునాపంతుల వారిపట్ల వాత్సల్యంతోనూ ‘ఆంధ్ర కుటీరం’కు అండగా నిలవడమేకాక ‘ఆంధ్రి’పత్రికా ప్రచురణకు ప్రోత్సహించి ఆలంబనమై నిలిచారు.
1939 జనవరి ‘ఆంధ్రి’ ప్రథమ సంచిక మచ్చునకై ప్రకటింపబడింది. ఆపై 1939 ఏప్రిల్ ప్రమాథి నామ సంవత్సరం వైశాఖంనుండి, ‘ఆంధ్రి’ మాస పత్రికగా మూడు సంవత్సరాలపాటు పత్రికాప్రపంచంలో తనదైన ముద్రతో తెలుగు సారస్వత సేవలో మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారి సంపాదకత్వంలో చిరస్మరణీయ చరిత్ర సృష్టించుకుంది. పంతొమ్మిదేళ్ళ వయస్సులో సంపాదకునిగా రాణించిన ఘనత మధునాపంతుల వారిదే. 1938నాటికే ఆయన ‘తోరణం’ కావ్య సంపుటి వెలువడింది. ‘ఆంధ్రి’ పత్రికా సంపాదకత్వం వహించిన మూడు సంవత్సరాలూ వెలువడిన ముప్ఫైఆరు సంచికల కాలంలోనూ ఆయన దానికే అంకితమైపోయిన ‘ఆంధ్రీ’మయమూర్తి. ‘ఆంధ్రి’ నిజముగా అప్పుడు తెలుగునేలకు చేసిన సేవ అమూల్యమైనది. ‘ఆంధ్రి’ వెలువడిన నాటికి తెలుగువారికి తమదైన రాష్ట్రం లేదు. ఏర్పడగలదన్న ఆశ కూడా పొడచూపక గ్రాంథిక, వ్యావహారిక భాషావాదాల నడుమ పెద్ద గుంజాటనలు సాగుతున్న రోజులు అవి. గ్రాంథిక ఆంధ్రము తెలిసి, విశిష్ట ప్రయోజనమునకై వ్యావహారికమును ఆదరించేవారూ, గ్రాంథికం మొగమెరుగక వ్యావహారికం పట్టుకుని ఊగులాడేవారు కవి పండితులలో నాటికే వున్నారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీ, వేలూరి శివరామశాస్ర్తీ, గిడుగు, శ్రీపాద, విశ్వనాథ గ్రాంథికంలో మహోన్నత విశారదులై వ్యావహారికాన్ని ఆదరించినవారే! అలాంటి శక్తిసామర్థ్యలు లేని వ్యావహారిక రచయితలూ వుండేవారు.

పూర్వాంధ్ర మహాకవుల కావ్యాలతోటీ, భాషతోనూ వున్న సంబంధం తెగిపోకూడదనీ, భాషావైశిష్ట్యం నిలచి వుండాలనీ ‘ఆంధ్రి’ మహత్త్వ పటుత్వ సంపదను నిలబెట్టాలనే పట్టుదలతోనే మధునాపంతులవారు పత్రికా నిర్వహణం చేశారు. వారి విద్వత్సంపాదక మూర్తిమత్వాన్ని పునశ్చరణ చేసుకోవడం ఈ శత జయంతి సమాపన సందర్భంలో ఔచితీమంతం.ఒక సాహిత్య పత్రిక నిర్వహించడం నాటికీ నేటికీ కత్తిమీద సాములాంటిదే! అందునా ఒక స్థిరమైన ఆశయంతో సంకల్పంతో నిర్వహించడం, పత్రికా సంపాదకుడు స్వయంగా కవీ, రచయితా అయివుండి సాటి రచయితలనూ, కవులనూ నిష్పాక్షికంగా, నిజాయితీగా సమాదరించటం, ప్రసిద్ధులను గౌరవించడం కొత్తవారిని ప్రోత్సహించడం అలవోక విషయమేమీకాదు. సంపాదకునిగా మధునాపంతులవారు అనుసరించిన బాట ఒక ఒజ్జబంతి వంటిదే! ‘ఆంధ్రి’ పత్రికా విశేషాలు, విశిష్ఠతలు కొన్నింటిని ఈతరం పాఠకులు అందుకోవాలనే ఈ రచనోద్దేశ్యం.

మధునాపంతులవారు ‘ఆంధ్రి’ పత్రికలో పల్లిపాలెము గ్రామ చరిత్రను ఓలేటి వేంకటరామశాస్ర్తీగారి ద్వారా వెలయించారు. వేంకట రామకృష్ణ కవులుగా పేరొందిన మేనత్త మేనమామల పిల్లల్లో కృష్ణకవిగారు ముందే దివంగతులయ్యారు. ఓలేటి వెంకట రామశాస్ర్తీగారు కూడా పిఠాపురం ఆస్థాన కవులుగానే ప్రసిద్ధికెక్కినవారు. వారే ‘ఆంధ్రి’కి సర్వాధ్యక్షులు. పిఠాపురం మహారాజావారి ఆదరణపొందిన వీరు శ్రీ చర్ల నారాయణశాస్ర్తీ గురువుగా చెప్పుకున్నారు. చెళ్ళపిళ్ళవారు తనను శిష్యుడనడం కూడా నచ్చక ఆ విషయంలో నాడు వాదులాడుకున్న సందర్భాలు కూడా వున్నాయని శ్రీపాద కృష్ణమూర్తిగారు పేర్కొన్నారు.
మధునాపంతుల వారి పట్ల అపార ప్రేమాభిమానాలుకల ఓలేటి వెంకట రామశాస్ర్తీగారి పిఠాపురంలోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షరశాలలోనే ‘ఆంధ్రి’ పత్రిక ప్రచురణ జరిగేది. ‘ఆంధ్రి’కి అభిరక్షక ప్రభువులుగా శ్రీ పిఠాపురం మహారాజావారు, జయపురం మహారాజావారు, పిఠాపురం యువరాజావారు, వేంకటాద్రి అప్పారావుగారు, మంత్రిప్రగడ భుజంగరావుగారు, చెలికాని సీతారామచంద్ర మధునందన రావుగారు పేర్కొనబడేవారు. సహాయ సంపాదకులుగా కొన్ని సంచికలలో విద్వాన్ పాలెపు వేంకటరత్నముగారిని పేర్కొన్నారు.
‘ఆంధ్రి’ని తమ రచనలతో అలంకరించిన ప్రముఖులలో జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మగారితో సహా నాటి ప్రముఖ కవి పండితులుగా పేరొందిన కుప్పా ఆంజనేయశాస్ర్తీ, కందుకూరి ఈశ్వరదత్తు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ, బెల్లంకొండ చంద్రవౌళి శాస్ర్తీ, చెఱుకుపల్లి జమదగ్నిశర్మ, జాషువా, కూచి నరసింహం పంతులు, చిలుకూరి పాపయ్యశాస్ర్తీ, జంధ్యాల పాపయ్యశాస్ర్తీ, జయంతి రామయ్య, గోనుగుంట పున్నయ్య, నండూరి బంగారయ్య, జమ్మలమడక మాధవరామశర్మ, ఆకొండి రామమూర్తి, కొండురి కొండురి వీరరాఘవాచార్యులు, దివాకర్ల వేంకటావధాని, ఓలేటి వెంకటరామశాస్ర్తీ, ఈయుణ్ణి వీరరాఘవాచార్యులు, పాలెపు వెంకటరత్నం, పన్యాల వేంకట రంగనాథరావు, ద్విభాష్యం వేంకట రమణయ్య, వసంతరావు వెంకటరావు, నిడదవోలు వేంకటరావు, పులివర్తి శరభాచార్యులు, వేలూరి శివరామశాస్ర్తీ, తుమ్మల సీతారామమూర్తిచౌదరి, కాశీభట్ల సుబ్బయ్యశాస్ర్తీ, ద్విభాష్యం వేంకటరావు, అల్లమరాజు సోమకవి, అల్లంరాజు రంగనాయకులు వంటి వారు ఎందరోవున్నారు. సంపాదకులు అయివుండీ మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు ‘తెలుగుబిడ్డడు’ అనే కలం పేరుతో ఆంధ్రాభిమానోద్దీపక కవితలను అద్భుత ఛందస్సుందర పద్యాలుగా రాసేవారు. ‘ఆంధ్రాభ్యర్చనము’ పేరున తెలుగు మహనీయులపై ప్రత్యేక పద్యాలను ‘ఆంధ్రి’లో రాశారు.అంతేకాదు! ‘ఆంధ్ర రచయితలు’ గురించిన వ్యాసాలు ‘ఆంధ్రి’లోనే రాయడం ప్రారంభించారు. ఈ వ్యాసపరంపరే ఆ తరువాత ‘ఆంధ్ర రచయితలు’ సంపుటాలుగా విస్తరించి అనేక ముద్రణలు పొందాయి. ‘‘ఆంధ్రదేశమున సుప్రసిద్ధులైన యధునాతన రచయితల సంక్షిప్త చరిత్రాంశములకు ‘ఆంధ్రి’ మాసమాసము నవకాశము కల్పింపనున్నది’’ అని పేర్కొంటూ మొదటగా జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారి గురించి ఏప్రిల్ 1939 సంచికలో ఈ వ్యాసపరంపర మొదలయింది. ఆ పరంపరలో వరుసగా విశ్వనాథ, చిలుకూరి నారాయణరావు, పానుగంటి, చిలకమర్తి, వేలూరి శివరామశాస్ర్తీ, వేదం వెంకటరాయశాస్ర్తీ, జయంతి రామయ్య పంతులు, వేంకట రామకృష్ణ కవులు, శ్రీపాదకృష్ణమూర్తిశాస్ర్తీ, చిలుకూరి వీరభద్రరావు, వడ్డాది సుబ్బారాయుడు, తిరుపతి వెంకట కవులు గురించి ‘ఆంధ్రి’లోనే రాశారు. మరొక విశేషం ఏమిటంటే ఈ ఆంధ్ర రచయితలు శీర్షికనే ‘ప్రభుప్రకరణము’ అంటూ ప్రత్యేకంగా నాటి సంస్థానాధిపతులుగా వుండి సాహిత్య రచనలుచేసిన ఏలూరు జమీందారు ‘మంజువాణి’ అనే పత్రికను సైతం నిర్వహించిన శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగారావుగారి గురించి, జయపురం సంస్థానాధీశులైన మహారాజా శ్రీ విక్రమదేవవర్మ బహద్దురువారు గురించి, పిఠాపురం మహారాజా శ్రీ రావు వేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దరువారు గురించి, ఉయ్యూరు మహారాజా వేంకటాద్రి అప్పారావు బహద్దూరువారి గురించి పిఠాపురం యువరాజా అయిన రావువేంకటకుమార మహీపతి గంగాధర రామారావు బహద్దరు వారి గురించి ఇలా వరుసగా వ్యాసపరంపరలు రాసారు. అభిరక్షక ప్రభువులుగా ‘ఆంధ్రి’కి పేర్కొనబడినవారే వీరంతా. అలాగే కపిలేశ్వరపురం మహారాజా శ్రీ బలుసు బుచ్చి సర్వారాయడు జమీందారువారు కూడా ‘ఆంధ్రి’ని సమాదరించారు.

యుద్ధదినాలలో కూడా ‘ఆంధ్రి’ పత్రికను నడిపిన ఘనత మధునాపంతుల వారిది.
‘ఆంధ్రి’ పత్రికలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే- పత్రికలో ప్రచురితమైన రచయితల ప్రతి రచనపైనా ఎక్కడికక్కడే సంపాదకుడి వ్యాఖ్య సంతరించబడటం. నిజంగా ఇదొక సాహసమే! కానీ మధునాపంతులవారు చేసి చూపారు. ప్రశంసిస్తే రచయితలు పరవశిస్తారు నిజమే కానీ ఏమాత్రం లొసుగులు, నెరసులు ఎత్తిచూపినా రచయితలు సహించడం కష్టం. కానీ రచనలోని బాగోగులు తెలిసేదెలా? మధునాపంతులవారు పంతొమ్మిదేళ్ళ ప్రాయపు సంపాదకుడై వుండీ తనకంటె పెద్దలయినా, చిన్నలయినా రచయితల రచనలమీద చేసిన వ్యాఖ్యలు నిజాయితీతోనూ, మృదువుగానూ వుండేవి. ఈ వ్యాఖ్యా పద్ధతిని ‘్భరతి’ వంటి పత్రిక కూడా ఒకప్పుడు చేబూని సమర్థవంతంగా చేయలేక రచయితలు కొందరి తిరుగుబాటుతో సంపాదకులైనవారి పదవికే ముప్పుతెచ్చుకొందిట! మధునాపంతులవారికి విజయవంతంగా రచయితల సహకారం లభించడం విశేషం. అయితే తరువాతి చివరి సంచికలలో రచన క్రిందకాక ఆ సంచికలోని రచనల గురించి ఓ సంపాదకీయ వ్యాఖ్యలతోకూడిన రచనగా శాస్ర్తీగారు సంతరించారు.

మహారాజా విక్రమదేవవర్మగారి రచన అయినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీగారి రచన అయినా మధునాపంతులవారు సంపాదకునిగా తన వ్యాఖ్యను వెలువరించడం అదే నిష్ఠతోచేశారు. ఎక్కడా మోమాటపడలేదు. తాము రాసిన దానికి భిన్నంగా సముచితములైన సమాధానాలు పంపినా ప్రచురిస్తామనీ ఈ విశిష్ట పద్ధతి అభిజనాంగీకృతంకాకపోతే విరమిస్తామనీ నాల్గవ సంచిక నివేదనములో పేర్కొన్నారు కూడాను.
‘ఆంధ్రి’ ఆగస్టు 1939 సంచికలో ‘పయనపు జెలికాఁడు’ అనే శ్రీ విక్రమదేవవర్మగారి రచనపై మధునాపంతులవారి వ్యాఖ్య ఇలా సాగుతుంది.
‘‘శ్రీశ్రీశ్రీ జయపురాధీశ్వరులు శ్రీ విక్రమదేవవర్మ మహారాజుగారు ఆంధ్రి యెడల దమకుఁగలిగిన యకారణ కారుణికత్వాభి మానాతిశయములచే నీ వ్యాసము నిందుఁ బ్రకటింప ఁబంపినందులకు మా ‘ఆంధ్రి’వారికనేక ధన్యవాదములు సమర్పించుచున్నది. పురాతనాధునాతన పద్ధతులను మేళవించి సలక్షణమైన గ్రాంథిక భాషలో సరస భావభరితముగ సహృదయ హృదయాను రంజకముగా వ్రాయబడిన ఈ వ్యాసరాజమన్నివిధముల నాంధ్రినుజ్జీవింపఁజేయుచున్నదని చాటుటకు సంశయములేదు. శ్రీ మహారాజుగారి గ్రాంథిక వచనరచనా కౌశలమును సహజ భాషాభిమానము నీ వ్యాసము వేయివిధముల వెల్లడించుచున్నది. ఇట్టి విద్వత్ప్రభువుల యాదరాభిమానములు బడయఁగలిగినప్పుడే కదా సలక్షణాంధ్రికి మరల సంపూర్ణవికాసము సమకూరుట?

శ్రీవారి యాజ్ఞానుసార మీవ్యాసము సాధ్యమైనంతవఱకు యధామాతృకనుగనే- అర్థానుస్వారములు శకట రేఫములు మఱికొన్ని భాషాచిహ్నములు మున్నగువానితో- ముద్రించితి పో-కాని; - ఏగు, చక్కగా, చెలరేగు, పులుగు, ఇద్దరము, గుండా-కౌఁగలి, శవసత్కారము, పాషాండా, తిరుగా మున్నగు పదములయందు లేఖన ప్రమాదవశమునఁ విడువఁబడిన యర్థానుస్వార వకటరేఫాదులను సవరించుటకుఁగూడ సాహసించలేనందులకు క్షంతవ్యులము- ఆం॥

దీనినిబట్టి ఒక రచయిత పంపిన రచనను యథాతథంగానే ప్రచురించి దానిలోని గుణదోషాలను సంపాదకునిగా మధునాపంతులవారు వ్యాఖ్యానించేవారని గ్రహించవచ్చు. అలాగే తిరుపతి వేంకటకవులలోని సుప్రసిద్ధ విద్వత్కవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీగారి ‘కాలదుస్థితి’ అనే రచనను అక్టోబర్ 1939 సంచికలో ప్రచురించి మధునాపంతుల సంపాదకునిగా ఇలా వ్యాఖ్యానించారు-
‘‘చేయి వణఁకుచున్న యత్యంత వార్థక స్థితియందుండియు ‘‘ఆంధ్రి’’ యందలి అవ్యాజానురాగాతిశయమున నీ పద్యవ్యాసమును వ్రాసి పంపిన శ్రీ శాస్త్రులగారికి ‘‘ఆంధ్రి’’యభివాదములొనర్చుచున్నది. శ్రీ శాస్త్రులుగారు జగమెఱిఁగిన బ్రాహ్మణులు. ‘ఆంధ్రి’ వారి కవిత్వమును గుఱించి యేమి వ్రాయఁగలదు?
ఈ పద్యములయందచటనచటఁ బద్య కవిత్వమున ‘పాదావసానముల యుదేకాక పాదమధ్యముననున్న వాక్యావసానాదుల యందు ఁగూడ సంధి చేయకున్నను దోషంబులే’దని సూచించుటకుఁగాఁబోలు సంధి నియమములు పాటింపఁబడలేదు. ఇది శాస్త్రులవారి భాషాసంస్కార పరాయణత్వమును సూచించుచున్నది. ఇంతియేకాక, ఇటీవల వీరు ప్రకటించు పత్రికా వ్యాసాదులనుబట్టి చూచినను శ్రీ శాస్త్రులవారు కొంతవఱకు భాషాసంస్కార విషయమున నొకయడుగు ముందునకు వైచంచున్నట్లు తోఁచుచున్నది. కాని, రుూ వ్యాసమునందు హరిజన దేవాలయ ప్రవేశాది సంఘసంస్కారముల విషయమై మాత్రము పూర్తిగా వెనుకంజ వైచినట్లే కనుపట్టుచున్నది. ఇది సంఘసంస్కార పరాయణులైన దేశీయ మహాజనులకెట్లుండునో? శ్రీ శాస్త్రులుగారు ‘శాస్త్రంబన్న జంకన్వలెన్’అనుచున్నారు. శబ్దశాస్త్రం బన్ననో?-- ఆం॥సం
ఈ వ్యాఖ్య నిజానికి కొండతో ఢీకొన్న చందమే అయినా, మధునాపంతులవారి సంపాదక ప్రతిభకు, తిరుగులేని భాషావిషయిక నిశ్చయ భావ శబలతకు తార్కాణం అనక తప్పదు. చెళ్ళపిళ్ళవారి పైనే చెణుకువేయడం విశేషమే మరి!
‘ఆంధ్రి’ పత్రికలో జైనుల్ అబ్ ఉద్దీన్, అహ్మద్ షరీఫ్, ఉమర్ అలీషా వంటి కవుల రచనలు కూడా ప్రచురించారు మధునాపంతులవారు. అక్టోబర్, 1939 సంచికలో మహమ్మద్ జైనుల్ ఆబెదీన్ ‘దేవా’అనే పద్యకవితను ప్రచురించారు ‘‘పద్యములన్నియు సర్వమత సమ్మతములై భగవద్భక్తి బంధురములై భావభరితములై యొప్పచున్నవి. వ్యాసకర్త మహమ్మదీయ మతస్థుఁడై యుండియు నాంధ్ర కవిత్వమున నిట్టి పరిశ్రమచేయుట ‘ఆంధ్రి’కెంతయు నభినందనీయముగాదా? -ఆం॥ అని సంపాదక వ్యాఖ్యతో ప్రశంసించారు.

‘ఆంధ్రి’లో వైవిధ్యభరితమైన రచనలు ప్రచురితమయ్యాయి. ‘‘్భరతీయ శాస్తమ్రులు-శాస్తజ్ఞ్రులు’’ అనే కామఋషి సత్యనారాయణరావుగారి సైన్స్ రచన (జూలై ’39), ‘వాఙ్మయము-దేశాభ్యుదయము’’అనే శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారి రచన (మే ’1941), అలాగే ‘ఏగు’ ధాతువు గురించి శ్రీ విక్రమదేవవర్మగారి వ్యాకరణాంశ రచన (్ఫబ్రవరి ’1940) ‘కళలు- కావ్యకళ’ గూర్చి శ్రీ చిలుకూరి పాపయ్యశాస్ర్తీగారి రచన (మార్చి ’1940) ఇలా పలు విశేష రచనలు కానవస్తాయి.

‘ఆంధ్రి’కి సర్వాధ్యక్షులుగా పేర్కొనబడిన పిఠాపురం సంస్థాన కవీశ్వరులు శ్రీ ఓలేటి వేంకటరామశాస్ర్తీగారు 1939, డిసెంబర్ మూడవ తేదీ పరమపదించారు. జనవరి, 1940 ‘ఆంధ్రి’వారి సంస్మరణ ప్రత్యేక సంచికగా మధునాపంతులవారు వెలయించి ప్రముఖుల నివాళి రచనలను అందించారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారి నివాళి రచనకూడా ‘ఆంధ్రి’లో కానవస్తుంది. ఆంధ్ర భాషాభివర్థినీ సంఘం మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తాపీ ధర్మారావుగారి అధ్యక్షతన నిర్వహించిన ఓ సభలో 1938, ఆగస్టు 19న ఓలేటి వేంకట రామశాస్ర్తీగారు చేసిన ‘మాతృభాషాసేవ’ అనే ఉపన్యాసాన్ని ‘ఆంధ్రి’ ఆ తరువాత సంచికల్లో ధారావాహికగా ప్రచురించింది. వేంకటరామశాస్ర్తీగారు కుమారులు ఓలేటి వెంకట చలపతిరావుగారు ‘ఆంధ్రి’ప్రచురణను తమ వి.ఎమ్.ఆర్. ప్రెస్‌లోనే కొనసాగించారు.

‘ఆంధ్రి’లో కనబడే ఏకైక కవయిత్రి శ్రీమతి ఉభయ భారతి. ఫిబ్రవరి ’1941 సంచికలో ‘బొమ్మరిల్లు’అనే కవితాఖండిక ప్రచురితమైంది. అది పెట్టుడు పేరేమో అని వేరొక సందర్భంలో సంపాదకులే వ్యాఖ్యానించడమూ కానవస్తుంది. ‘ఆంధ్రి’లో కాకినాడ పి.ఆర్. కళాశాలలో జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాల గురించిన నివేదికా, అలాగే సంపాదకులు మధునాపంతులవారే స్వయంగా చేసిన కొన్ని పుస్తక సమీక్షలూ పేర్కొనదగినవి. సూర్యారాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో ‘ఆంధ్రీ’మయమూర్తి పాత్ర కూడా వుంది. 1940 జనవరి 1న పానుగంటి లక్ష్మీనరసింహారావు, 9 ఫిబ్రవరి 1941న జయంతి రామయ్య పంతులుగారు కాలధర్మం చెందినపుడు ‘ఆంధ్రి’లో మధునాపంతులవారు సంపాదకులుగా నివాళి ఘటించారు.

‘ఆంధ్రి’కి నాటి మహామహులైన ఎందరెందరో సాహితీ దిగ్దంతులు ప్రశంసలందించారు. అభిమానించారు. తమ రచనలతో పరిపుష్టంచేశారు. నవ్యభావ ప్రభావంతో వెలయు గ్రామ వాతావరణంలో ‘ఆంధ్రి’ ఉదయించింది. విశ్వనాథవారు మధునాపంతులవారికి లేఖరాస్తూ ‘‘మీరు స్థాపించిన ఆంధ్రీకుటీరము వంటివి ప్రతి పల్లెటూరున వెలసిననాఁడు భాషకు విముక్తి. రసజ్ఞత మీ యూరిలో వెదచల్లుట మీ బాధ్యత. మీరు తలపెట్టిన పనికి నా అభినందనములు, నా సానుభూతియు’’అని కొనియాడారు. పల్లిపాలెము కేంద్రంగావున్న ‘ఆంధ్రీ’కార్యాలయ చిరునామా 1941లో పిఠాపురంకు మారింది. ముప్ఫై ఆరు సంచికలతోనే ‘ఆంధ్రి’ పత్రిక ముద్రణ ముగిసిపోయింది. తదనంతర కాలంలో మధునాపంతులవారు రాజమండ్రికి తరలిపోయారు.

కవిగా, రచయితగా తనదైన రచనలతో ‘ఆంధ్ర కల్హణ’గా ‘సాహితీ సమ్రాట్ట్’గా ఖ్యాతిపొందారు. 1968లో ‘ఆంధ్ర పురాణము’కు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో గౌరవించింది. రత్నపాంచాలిక (1943), షడ్డ్శరనసంగ్రహం (1942), సూర్యసప్తతి (1943), ధన్వంతరి చరిత్ర (1945), రత్నావళి (1947), ఆంధ్ర రచయితలు (1950) బోథివృక్షం (1951), ఆంధ్ర పురాణం (1954) చరిత్ర ధన్యులు (1955) కళ్యాణతార (1956), స్వప్నవాసవదత్త (1956), శ్రీఖడ్గం (1968), తెలుగులో రామాయణాలు (1975) చైత్రరథం (1976), సదాశివ పంచశత (1977), కేళాకూళి, జీవనలేఖలు- సాహితీ రేఖలు, మధుజీవనము, మధుకోశము, మధునాపంతుల సాహిత్య వ్యాసాలు, ప్రసంగాతరంగిణి వంటి అమూల్య గ్రంథాలను తెలుగుజాతికి అందించిన మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు అమలాపురం తాలూకా ఐలెండ్‌పోలవరంలో 1920 మార్చి 5న ప్రభవించి 1992, నవంబర్ 7న రాజమండ్రిలో కాలధర్మం చెందారు. ఆ శత జయంతి సాహితీమూర్తికి వినమ్ర నివాళులు.
*
- సుధామ
Andhrabhoomi Daily sahithi Literary page Published Monday, 2 March 2020