ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 6, 2012

సుఖ‘దారి’ద్య్రం




‘ 'మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగనూనె’అన్నట్లు ఒకప్రక్క పేదరికం, పేదరికం నిర్మూలనం, ప్రజాసంక్షేమం... కబుర్లు చెబుతూనే- మరోప్రక్క అనవసర ఆడంబరాలు, ఖర్చులు, విలాసహాస సౌఖ్యాలు కలిగివుండడాన్ని ఏమనాలి? పదవులూ, అధికారాలూ పేరుచెప్పుకుని, ‘సంపన్నులు’ మరింత సంపన్నులు అవుతూంటే, ‘పన్నుల’్భరంతో, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో- సామాన్యుడు మరింత సామాన్యుడు, పేద-‘నిరుపేద’ అవుతున్నాడు’’ అన్నాడు సన్యాసి.

‘‘ ‘మన స్వాతంత్య్రం మేడిపండు- మన దారిద్య్రం రాచపుండు’అని ఆరుద్ర ఊరికే అన్నాడు! నిన్నా-రేపూ- మర్నాడా! ఏరోజయినా స్థితిగతుల్లో మార్పులనేవి ఒక సమతుల్యంతో లేక, ఒకచోట ‘వాపు’, ‘ఒకచోట ‘బలుపు’అన్నట్లే వున్నాయి! ఆర్థిక అసమానతలు ప్రజలకూ పాలనాధికారులకూ మధ్య, మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధాని పదవినేలినా లాల్‌బహదూర్ శాస్ర్తీగారు గానీ, రాష్టప్రతిగా వున్న అబ్దుల్‌కలామ్‌గారు గానీ- పదవి వున్నా, లేకున్నా ఒక విధమైన నిరాడంబర జీవనమే గడిపారు. వాళ్లెవరూ డబ్బు ‘కాపీనం’ చూపలేదు. ఈనెలలో దిగిపోతున్న రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌గారు- తన హయాంలో తన వేతనాన్ని నాలుగువందల రెట్లు పెంచుకుందట! అసలు ప్రజాప్రతినిధులు అనేవారు ప్రజాజీవన సరళికి కూడా ప్రతినిధిగా వుండాలి గానీ, ఒక ఎం.ఎల్.ఏ.గానో, ఎం.పిగానో ఎన్నిక కాగానే- ఆ ప్రజలకే అందనంత ‘అందలాలు’ ఎక్కేస్తున్నారు! ‘ప్రజాస్వామ్యం’ అన్నదానికి అర్థం ఇదా?’’ అన్నాడు ఆర్తితో రాంబాబు కూడాను.


‘‘అర్థం లేకుండా మాట్లాడకండి! మన దేశం పేద దేశంకాదనీ, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం అనీ, ప్రపంచానికి కనిపించాలంటే ఇండియాలో రాష్టప్రతికి ఇంత పేద్ద జీతంట! అక్కడ ఎం.ఎల్.ఏలు, ఎం.పీలు ఇంత గొప్పవారట! అనుకునేలా వుండాలా వద్దా?’’ అన్నాడు ప్రసాదు నవ్వుతూ.
‘‘మరి అలాంటప్పుడు భారతదేశం పేద దేశంగా చిత్రిస్తూ స్లమ్‌డాగ్ మిలియనీర్ లాంటి చిత్రాలు, అంతకుముందు సత్యజిత్‌రాయ్ చిత్రాలు ఎందుకట? అవి కూడా అడిగేస్తారని నాకు తెలుసోయ్ ప్రసాదూ! కానీ చూసావ్! విదేశీ సహాయాలు, విదేశీ అప్పులు కావాలంటే మాత్రం- మనం ‘వున్నవాళ్లం’గా చూపించుకోకూడదు కదా! ఫారిన్ ఫండ్స్, విదేశీ ధన సహాయాలు కావాలంటే- మన ప్రజల స్థితిగతులు మెరుగుపరచడానికనీ, మన దేశంలో ప్రజల సమస్యలు ఎన్నింటినో పరిష్కరించడానికనీ, నమ్మబలికే కదా- ప్రభుత్వాలూ, స్వచ్ఛంద సంస్థలూ విదేశీ ఋణాలూ, విదేశీ విరాళాలు అందుకుంటూన్నది!- అంచేత ‘దేనిదారి దానిదే’ అన్నాడు శంకరం.


‘‘అంతేలే! కానీ చూసావ్! ఇండియా అంటే దరిద్రగొట్టు దేశం అన్న ఇమేజ్ ప్రపంచానికి కలగకూడదు కదా! పాపం అంచేతే-ప్రజలు మింగడానికి మెతుకులేకున్నా, ఏలికల ‘మీసాలకు’ సంపెంగ నూనెలు రాస్తున్నాం! దేశంలోని అనేక వేల గ్రామాల్లో మహిళలకు సరియైన బహిర్భూమి సౌకర్యాలు ఇప్పటికీ లేవు. అలా టాయ్‌లెట్లు, మరుగుదొడ్లు లేని అనేక పాఠశాలల కారణంగానే- కొన్నిచోట్ల అక్కడికి తమ ఆడపిల్లల్ని చదువులకు పంపడానికి కూడా తల్లితండ్రులు జంకుతున్నారట! కానీ దేశంలో ఆర్థిక వనరుల్ని ఔచిత్యంతో మదింపుచేయాల్సిన కేంద్రంలోని ప్రణాళికా సంఘం భవనంలో- ఓ రెండు టాయ్‌లెట్లను ఆధునీకరించడానికే ‘లక్షలు’ఖర్చయ్యాయిట! విదేశీ పర్యాటకులకు సౌకర్యవంతమైన ‘శౌచాలయాల’ నిర్మాణానికి - ముప్ఫైలక్షల పైగా వెచ్చించి, అది అసలు పెద్ద ఖర్చేకాదని ప్రణాళికా సంఘం కమిషన్ ఉపాధ్యక్షులు అహ్లూవాలియా సమర్ధించుకోవడం ఏమని అర్థంచేసుకోవాలి’’అన్నాడు రాంబాబు.


‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌గారు ఇంకో అడుగు ముందుకువేసారోయ్! నిజానికి వాళ్ల పార్టీగుర్తు ‘సైకిల్’. సైకిల్- ప్రజలెందరికో అందుబాటులో వుండగల వాహనమే! ఎన్నికల్లో ప్రచారానికి అప్పడు మాత్రం- ఆ గుర్తుని హైలైట్ చేస్తూ, అది ప్రజాజీవన సరళికీ, నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన జీవనానికీ ప్రతీకగా ఊదరగొడతారు! సైకిల్ ర్యాలీలు తీస్తారు. కానీ- ఆ పార్టీ నాయకుడే కాదు, అసలు ఏ ఒక్క రాజకీయ నాయకుడూ... అతగాడు ఎం.ఎల్.ఏనో, ఎం.పీ.నో, సైకిల్ మీద అసెంబ్లీకో, పార్లమెంట్‌కో రెగ్యులర్‌గా వెళ్లిన ఉదంతాలు కనబడతాయా? అందరికీ పదవి రాగానే కారు, ఫోను, భవంతి విలాసవంతంగా అమరిపోతాయి, అమరిపోవాలి! అసలు వాటన్నింటి కోసమే కదా ఎన్నిక కావాలన్న తాపత్రయాలంతాను! అంచేత- అఖిలేష్‌యాదవ్‌గారు తమ రాష్ట్రంలోని ఎం.ఎల్.ఏలందరికీ కూడా ‘ఇరవై లక్షల రూపాయల ఖరీదైన కారు’ సౌకర్యం ప్రకటించేసారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు కేటాయించిన సొమ్ము అటు బదలాయించారని కూడా వ్యాఖ్యలు వెలువడ్డాయి కూడాను.- ఏమయితేనేం? ‘సైకిల్’ గుర్తువారు లక్షల ఖరీదైన ‘కార్లల్లో’ తిరగడమే కదా నిజమైన అభివృద్ధి! దేశం ‘సంపన్నం’అవడం అంటే ఇది కాదా మరి!?’’ అన్నాడు ప్రసాద్ పరిహాస ఫణితిలో.


‘‘ ‘గరీబీ హఠావో’ అంటే- నేతల సంపన్నతకు అవరోధమయ్యే ‘గరీబీ’ని తొలగించమనే! ‘మురికివాడల అభివృద్ధి పథకం’అని వాడడం చూస్తూంటాం! అంటే- మురికివాడల నిర్మూలన కాదన్నమాట! వాటిని పెంచడం అన్నమాట! మురికివాడలు, పేదరికం వుంటేనే కదా- అవి పోగొట్టడానికి నేతలు శ్రమించడం అనేది! అంచేత- అవి పోకూడదు! వీళ్లు ఆ కబుర్లు చెబుతూ వుండాలే గానీ, అటుపోకూడదు. ప్రజలందరూ ‘బాగుపడిపోతే’ ఇంక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడుంటాయి? ఎందుకుంటాయి? అంచేత ‘ఎక్కడ వేసిన గొంగడి’- ప్రజలది, అక్కడే వుండాలి. పాలకులు మాత్రం ఆ ‘గొంగడి’ కప్పుకుని వెచ్చగా తమ రాజకీయ ‘అంగడి’వ్యాపారాలు పెంచుకుని, పైడితో, పాడితో సుఖించాలి! దటీజ్ భారత్.’’ అని పాదం తాడించి లేచాడు సన్యాసి..

1 comments:

శ్రీ said...

చాలా బాగుంది సుధామ గారూ!
సమస్య తీరితే నేతలకు ఇబ్బంది...
సమస్యలు ఎపుడూ ఉండాలి...
తీర్చడానికి ఫండ్స్ రావాలి...
వాళ్ళు చక్కగా మేయాలి...
@శ్రీ