ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, January 13, 2014

కవీ!



వినవస్తుంది
‘వద్దులే ఏం రాస్తావూ’
విముఖించిన అవరోధ స్వరం.
జలగలా పట్టుకు లాగేస్తున్న సారం.
ఆత్మహత్య చేసుకున్న ఉదయకిరణం సాక్షిగా
అలుముతున్న తిమిరపు అమావాస్య కుట్ర
చీకటి కప్పిన వె
న్నెల  దుప్పటి.

నిద్రపుచ్చే జోలపాటలు - డబ్బు ఘలంఘలలు
కీర్తి మువ్వల రవాలు.
శాలువా కప్పి, జ్ఞాపిక చేతులో పెట్టడం ఆలస్యం-
గర్వించిన హృదయం సృజనకు సూసైడ్ నోట్ రాసినట్లే!
రాస్తున్న అక్షరంచేప నీటి బయటపడి చావుకు
గిలగిల్లాడినట్లే!

కొండ శిఖరం అంచుదాకా ఎక్కాక
అక్కడ దిగబెట్టినది ఏ హెలికాప్టరో వెళ్లిపోతుంది.
ఎక్కినట్లు కనబడుతున్నది నీ కృషి కాక,
అందివచ్చిన అదృష్టం గాలిలోనే మాయమయ్యాక,
ఇంక ఎక్కేందుకు ఏం లేనప్పుడు
దిగి రావాల్సిందే కదా!
అక్కడే ఉండిపోలేవు.
ఎక్కడం ఎక్కేసావు గానీ దిగడం సులభం కాదు
దూకడమో, 
దొర్లడమో...
నిన్ను నువ్వు లోలోపలగా చుట్టేసుకుని.

‘వద్దులే ఏం వస్తావూ’ -
అగుపించ
ని అవరోధవ్రాతం - సమాజ సహజాతం.
నిప్పులు చిమ్ముకుంటూ ఎగరావద్దు
నెత్తురు కక్కుకుంటూ రాలావద్దు
సజావుగా నడు. సాము వద్దు నేలవిడిచి.
వెళ్లిపోవద్దు కలం ముడిచి.
ఈ రస్తాలోనే సమస్త శక్తుల మనస్కంతో అను -
నే రాస్తా!

  • - సుధామ

4 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

బాగా చెప్పారు.

Ganti Lakshmi Narasimha Murthy said...

బాగుంది సుధామగారు కవిగారి కవితలో కవులు తొంగిచూస్తున్నారు.కళాకారులకు సరియైన జీవితయానాన్ని నిర్దేశిస్తున్నారు.సమాజంపోకడలను కాచి వడబోస్తున్నారు-గంటి

Padmarpita said...

వావ్....బాగుందండి

సుధామ said...

మీ సహృదయ స్పందనకు కృతజ్నతలు ఆచార్య ఫణీంద్ర, శ్రీ గంటి లక్ష్మీ నరసింహమూర్తి, మరియూ పద్మార్పిత గారూ!