ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 27, 2011

ప్రతిభా సూత్రం

ఏమయినా మీ ఇద్దరికీ ‘ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్’ బాగా ఉందనుకుంటానే!- అన్నాడు సుందరయ్య శంకరాన్నీ, సన్యాసినీ ఉద్దేశించి.
‘‘అబ్బే! మేం ‘ఇంటర్’లో ఫ్రెండ్సేమే కాదోయ్! తరువాత్తరువాతే పరిచయమవుత’’ అన్నాడు సన్యాసి.
‘‘నీ తలకాయ్ ‘ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్’ అంటే ‘ఇంటర్‌లో’ పరిచయం అని కాదు! మనిద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు బాగున్నాయని. ఆ మాటకొస్తే సుందరయ్యా! నేను అందరితోనూ అలాగే ఉంటాను. ప్రత్యేకించి సన్యాసితో గురించే, అలా ఎందుకనుకుంటున్నానో తెలీడం లేదు’’ అన్నాడు శంకరం.
‘‘తెల్సు లేవోయ్! నేనూ సరదాగానే అన్నాను. కానీ చూసావ్! అసలు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్ ఈ రోజుల్లో వ్యక్తులు రాణించడానికి చాలా అవసరం! ఎన్నో పనులు చక్కబెట్టుకోవాలంటే, ఇవాళ ఈ నైపుణ్యాలు చాలా అవసరం’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.
‘‘నిజమే! కొందరు బాగా రాణిస్తున్నారంటే, అందులోనూ పనిచేసే చోటా, కంపెనీల్లో మంచి గుర్తింపు పొందుతున్నారంటే, వారికి ఈ ‘స్కిల్స్’ ఉండడమే కారణం! కేవలం ప్రతిభ ఉంటే సరిపోదీనాడు. తమ ప్రతిభను వెలార్చుకోగల-‘కమ్యూనికేషన్ స్కిల్స్, సాటివారితో మంచి ‘ఇంటర్ పర్సనల్ రిలేషన్ షిప్’ ఉండాలి. అందునా సంఘటితంగా కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు-చొరవగా, కలగలుపుగా ఉంటూ, విషయపరమైన చర్చల్లో పాల్గొంటూ, సలహాలు, సూచనలూ ఇస్తూ, నలుగురి తలలో నాలుకలా మెలగడం చాలా అవసరం’’ అన్నాడు శంకరం.  

‘‘ఔను! కానీ చూసారూ! కొందరి చాకచక్యం ఎలా ఉంటుంది అంటే-‘‘నువ్వు దంచుతూండు. నేను భుజాలెగరేస్తూంటాను’’ అన్నట్లుంటుంది. భుజాలెగరేస్తున్న వాడిని చూస్తూ-నిజంగా వాడే కష్టపడుతున్నాడనుకుంటారు కూడాను. వౌనంగా దంచుతూ పోయేవాడికి పనిమంతుడిగా గుర్తింపే రాకపోవచ్చు! కానీ, బాస్ అయినవాడు ఎవరు పనిమంతుడో, ఎవరు వట్టి ‘పోచుకోలు రాయుడో’, గుర్తించగలిగి ఉండాలి’’ అన్నాడు సుందరయ్య.
‘‘ఉంటారయ్యా కానీ ఉండి ఏం లాభం? వారు కూడా తమ చుట్టూ చేరి భజనలు చేసే కబుర్లతో బురిడీ కొట్టించగల వారివైపే మొగ్గుతూంటారు! నిజమైన ప్రతిభావంతుడు ఒక్కోసారి వౌనంగానే ఉంటాడు. కానీ వాడిముందే-‘ఆవగింజంత ప్రతిభ ఉన్నవాడు గుమ్మడికాయంత ప్రచారం చేసుకుంటూ’, తను-లౌకిక ఫ్రయోజనాలూ, లాభాలూ అని ఒడిపేసుకుంటూ ఉంటాడు. పైగా ఈ రోజుల్లో ‘మందు’ ఒకటి-ఈ రిలేషన్‌షిప్స్‌ను పటిష్టం చేసేదిగా తయారవుతోంది! ఆ అలవాటులేనివాడు బలహీనుడై, పనులు చురుకుగా సాగడానికి ‘మందు’విందులే, మంచి పసందైన కార్యాచరణాస్త్రాలుగా లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి’’ అన్నాడు శంకరం.

‘‘ అది ఒప్పుకోవాల్సిన మాటే! ఆ మధ్య గతంలో ఒక ప్రముఖ సాహిత్యా విమర్శకుడు తనకు ‘మందు’ పోయించిన వారినీ, కబుర్లు చెప్పిన కవయిత్రులనీ, తన కాలమ్‌లో వారి రచనల్లో గొప్ప ప్రతిభాపాటవాలున్నట్టు చిత్రించి, నెత్తికెత్తుకున్నాడు. అలా ఆయనతో లాభపడినవారే-తదనంతర కాలాన ఆయనను తిట్టిపోశారు. ఆయన కలం బలం, అవకాశాలు తగ్గగానే ఆయనను ఇవాళ పలకరిస్తున్న పాపాన కూడా ఆ లాభపడిన సాహితీ బృందం పోవడంలేదని విన్నాను’ అన్నాడు సన్యాసి. ‘‘నిజమైన ప్రతిభావంతుల గురించి ఆయన రాయన లేదనే వారూ ఉన్నారు’’ అన్నాడు.
‘‘ ‘అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అని ఒక ‘నుడి’ ఉంది. పదవులవల్లా, హోదాలవల్లా, డబ్బువల్లావచ్చే కీర్తి, గుర్తింపూ, అవి లేవన్న మరుక్షణం మటుమాయమైపోతాయి! అది తెలియక కొందరు తమలో లేని ప్రతిభను, హోదాని గొప్పగా ఊహించుకుని బింకాలు పోతూ, శాసించే స్థాయిలో వ్యవహరిస్తుంటారు! సీటు దిగిన మరుక్షణమో, ఆర్థికంగా అతనినుండి ఏమీ లభించదని తెలిసిన మరునిముషమో, అంతవరకూ ఆయనకు భజనచేసి-తమ పనులు, పబ్బం గడుపుకున్నవారు,ఇంక పట్టించుకోవడం మానేస్తూంటారు! ఒకప్పుడు గొప్ప గుర్తింపు లభించినట్లయి, ఒక్కసారిగా ఆ గౌరవ మర్యాదలూ, గుర్తింపులూ, చట్టూ ఆహా ఓహోలూ, అంతమైపోయేసరికి, అంతవరకు ‘భ్రమావరణం’లో బ్రతికిన జీవికి తట్టుకోవడం కూడా కష్టమైపోతుంది’’ అన్నాడు సుందరయ్య.

‘‘ తమ హోదాలు, అధికారాలు, పలుకుబడులు, పెట్టుబడులు కారణంగా- సంఘంలో కొందరికి సాహితీవేత్తలుగా, సృజన శీలురుగా పేరుంటుంది. వారిచేత తమ పనులు చేయించుకోవడానికీ, వ్యక్తిగతంగా లాభం పొందడానికీ వారి చుట్టూ తిరుగుతూ, వారిని ఉబ్బేస్తూ తమ సభలకు వారిని ఉన్నత పీఠమలంకరించడానికి ఆహ్వానిస్తూ, దండలతో, శాలువాలతో, జ్ఞాపికలతో సన్మానిస్తూ, ఎంతో ఎక్కువ చేసి కూర్చోబెట్టిన వాళ్లే-ఆయనకు ఆ పదవీ, ఆ హోదా, ఆ వితరణ శీలత చూపగల స్థారుూ అవకాశాలూ పోయిన తరువాత, ‘ఓడదాటాక తెప్ప తగలేసిన’ తరహాలో, వ్యవహరించేవారుంటూంటారు. నిజానికి ‘కృతజ్ఞత’ చూపగలగడం అనేది, పరిసీమిత వ్యవహారమై, హృదయ గతమైనది కాక, కేవలం వైయక్తికం, స్వార్ధ పూరితమూ అయిప్పుడు, తాత్కాలిక ప్రయోజనాలు నెరవేరుతాయేమోగానీ, శాశ్వత విలువలూ, గౌరవాలూ నిలబడవు’’ అన్నాడు శంకరం. ‘‘అందువల్లనే నేడు అన్నిరంగాలలో భ్రష్టత్వమూను’’ అనీ అన్నాడు.
‘‘మీరన్నదంతా నిజమే! కానీ-ఇదంతా చేతకానివాడి పౌరుషం, సమర్ధత లేనివాడి ‘మిషా ప్రవచనాలు’ అనుకునే సమాజమే నేడు మనముందుంది. స్వకుచమర్దనమో, పరస్పర భజన సమాజమో లేకుండా-‘నేను ప్రతిభావంతుడిని’ అంటే, ‘‘అదేదో నీ దగ్గరే ఉంచుకో మాకెందుకు’’ అ వారే ప్రబలంగా ఉన్నారు! మీడియానూ, అధికార గణాన్నీ మచ్చిక చేసుకుని, రెచ్చిపోగలవాడికే రోజులు. జనాలకు నిజాలు తెలియవనుకోకండి! కానీ ఆ జనాలూ-వెల్లువలో పూచికపుల్లలు కావడానికే సంసిద్ధం. ఏం చేస్తాం’’ అన్నాడు సన్యాసి విరక్తుడై లేస్తూ.

0 comments: