ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 26, 2015

ఆబాలగోపాలాన్ని అలరించిన రత్నం


ఆకాశవాణిలో లలిత సంగీత కళాకారిణిగా, 
కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా పేరెన్నికగన్న శ్రీరంగం గోపాలరత్నం 
అశేష శ్రోతలకు చిరపరిచితమైన పేరు. విదుషీమణి సంగీత చూడామణి కుమారి శ్రీరంగం గోపాలరత్నంగారి జీవితం-సంగీతం గురించి
శ్రీమతి ఇంద్రగంటి జానకీబాలగారు ఓ గ్రంథాన్ని సంతరించటం ఎంతైనా అభినందనీయమైన సంగతి. 

వారితో జానకీబాలగారికి సన్నిహిత పరిచయం వుండటం కూడా
ఈ గ్రంథ రచనకు లాభించింది. శ్రీమతి శారదా శ్రీనివాసన్‌గారు 
ఈ గ్రంథానికి చక్కని పీఠిక సమకూర్చారు.

సంగీత ప్రపంచంలో శ్రీరంగం గోపాలరత్నంగారి పేరు ఆ రోజుల్లో 
విస్తారంగా వినిపించేది. రేడియోలో ఆమె పాటలంటే శ్రోతలు పరవశించిపోయేవారు. లలిత గీతాలు పాడినా, శాస్ర్తియ సంగీతం 
పాడినా, శ్లోకాలు, పద్యాలు వినిపించినా ఆమె గొంతు 
ఎంతో శ్రావ్యంగానూ పలుకు ఎంతో స్పష్టంగానూ వుండి 
పాట భావానికి రసానుభూతి తెచ్చిపెట్టేది. మంచాల 
జగన్నాథరావుగారు బాలమురళిని ,గోపాలరత్నంని హైదరాబాద్ 
పిలిపించి నండూరివారి ఎంకి పాటలు ఎన్నింటినో పాడించారు గానీ 
ఎందుకో ఎంకి పాటలు ప్రసారం చేయకూడదని రేడియోలో నిషేధం విధించబడింది. 

గోపాలరత్నంగారు మొదట్లో ఓలేటి వెంకటేశ్వర్లుగారు గురువుగా 
ఆకాశవాణి సంగీత శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారు. 
తరువాత ఆవిడే స్వయంగా సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కూడాను. భక్తిరంజనిలో తిరుప్పావై, సప్తపదులు విశేష ప్రాచుర్యం పొందడానికి ఆవిడ గళం కూడా కారణమే. 
ధనుర్మాస ప్రారంభానికి రేడియో భక్తిరంజనిలో ఆమె గళం 
ఆనాడు ఒక ‘ఐకాన్’గా నిలిచింది.

జానకీబాలగారు ఎంతో శ్రమకూర్చి అజ్ఞాతంగా వుండిపోయిన గోపాలరత్నంగారి జీవితానికి, సంగీతానికి సంబంధించిన 
అనేక విషయాలను ప్రోగుచేసి ఆ విదుషీమణిని ఈ తరానికి కూడా పరిచయం చేస్తూ అపురూపమైన ఈ గ్రంథరచన కావించారు.

శ్రీరంగం వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు 1939వ 
సంవత్సరంలో జన్మించిన గోపాలరత్నం ఇంట సహజంగానే వున్న
 సంగీత ప్రతిభను వంట పట్టించుకున్నారు. చిన్నవయసులోనే తన మేనమామ, తల్లి కలిసి వ్రాసిన హరికథలకు బాణీలుకట్టి 
గానంచేసిన ఘనత ఆమెది. వైష్ణవ భక్తి సంప్రదాయపు కుటుంబం 
గనుక సంగీతానురక్తీ, భక్తీ బంగారానికి తావిలా అబ్బాయి. 
కళానిలయమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జి.పి.ఎస్.నాయర్ డైరెక్టర్‌గా వుండగా 1957లో శ్రీరంగం గోపాలరత్నం ‘టీన్ ఏజ్’లోనే 
నిలయ విద్వాంసురాలిగా చేరారు. 1957నుండి 1977 వరకు రెండు దశాబ్దాలపాటు రేడియోని ఏలిన గళం ఆమెది. నటిగా, యక్షగాన గాయనిగా, లలిత సంగీత గాయనిగా, అన్నమాచార్య పద 
ప్రచారకురాలిగా, సంస్కృత నాటకాల పాత్రధారిణిగా, పద్య గాన ప్రతిభామతిగా, స్వరకారిణిగా గోపాలరత్నం గొప్ప ప్రయోగశీలిగా భాసించారు. రేడియోలో పనిచేస్తూనే కర్ణాటక శాస్ర్తియ సంగీత 
కచేరీలను దేశమంతటా తిరిగి చేశారావిడ. ఎందరో కవులు రాసిన
లలిత గీతాలకు తన గళంతో విశేషఖ్యాతి తెచ్చిపెట్టిందావిడ. 
వేటూరి సుందరరామమూర్తిగారి ‘సిరికాకొలను చిన్నది’ సంగీత 
రూపకంలో ప్రధానపాత్ర పోషించింది గోపాలరత్నమే. 
అన్నమాచార్య కీర్తనలు గానంచేసి ప్రచులితం చేసిన వారిలో ప్రథమగణ్యురాలు అని చెప్పదగిన గాయని గోపాలరత్నం.

ఆమె సినిమాల్లో రెండే పాటలు పాడారు. ఆ మార్గంలో తనకంత 
కుదరలేదని ఆమే స్వయంగా చెప్పారట! దేశంలో విస్తృతంగా తిరిగి 
కర్ణాటక శాస్ర్తియ సంగీత కచ్చేరీలు చేశారావిడ. 1977లో హైదరాబాద్ త్యాగరాజ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్‌గా 1979లో సికింద్రాబాద్ రామదాసు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 
అలాగే 1988లో తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠానికి 
తొలి ప్రొఫెసర్ డీన్ ఆవిడే. 1990లో తెలుగు విశ్వవిద్యాలయం విడిచిపెట్టారు. 1991లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో ఆమెను 
గౌరవించింది. సంగీత విద్యలో గాయనిగా అలా పురస్కారం 
అందుకున్న తొలి కళాకారిణి ఆమెయే కావడం, అనేక బిరుదులు
ఆమెను వరించడం జరిగింది. ఆమెలో ఎంతో సంగీత ప్రతిభవున్నా 
చిత్రంగా క్యాసెట్లుగానీ, డిస్క్ రికార్డులు కానీ ఆమెవి తగినన్ని 
లేకపోవడం జరిగింది. 
1993 మార్చి 13న ఆమె హఠాత్తుగా కనుమూశారు.

జానకీబాలగారు గోపాలరత్నంగారి మరణం గురించి రాస్తూ-
‘‘కీర్తి, డబ్బు ఒక్కొక్కసారి ప్రాణాంతకాలు కావచ్చునని అనిపిస్తూ వుంటుంది- నిజ జీవితం చిక్కుల్లో పడినప్పుడు అసలైన సంగీత విద్య మరుగునపడిపోయే ప్రమాదం వుంది. అలాంటి సంఘర్షణలో 
ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా వుంటాయేమో.
శ్రీరంగం గోపాలరత్నం వంటి బహుముఖ ప్రతిభ గల గాయని సైతం 
ఇలాంటి పరిస్థితులు రుచి చూశారా? వాటిని అధిగమించి 
తనను తాను రక్షించుకోలేకపోయారా? ఊహకి కూడా అందని విషయాలు అనేకం వుంటాయి మానవ జీవితాల్లో’’అంటూ రాశారు. 

ఆమె మరణించి రెండు దశాబ్దాలకు పైగా గడిచినా 
శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న 
శ్రీరంగం గోపాలరత్నంగారి గురించి 
జానకీబాలగారు 
ఈ గ్రంథ రచన చేసి అందించడం 
ఆ ప్రతిభామతికి నిజంగా అక్షర నివాళి.

సుధామ
25/12/2015

శ్రీరంగం గోపాలరత్నం
(జీవితం- సంగీతం)
- ఇంద్రగంటి జానకీబాల
వెల: రూ.100/-
అనల్ప ప్రచురణలు, సాహిత్య కలశం సంయుక్త ప్రచురణ, 
102, శుభోదయా అపార్ట్‌మెంట్స్,
ఆర్.కె.పురం, సికిందరాబాద్-56;



గ్రంథ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో సమీక్షకుడు సుధామ 







3 comments:

GKK said...

yes sir. she is a great singer with unique and melodious voice.

sastry said...

A great singer

sastry said...

A great singer