ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 7, 2014

(వి)చికిత్స వేళ



‘ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రానికి హఠాత్తుగా ఇంత శ్రద్ధ, ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్లబ్బా! అన్నదమ్ములు విభేదించుకునేలా మరీ ప్రోత్సహిస్తూ, విడగొట్టి ఇద్దరికీ బోలెడు న్యాయం చేయాలని ఎందుకు కంకణం కట్టుకుంటున్నట్లో! ‘తెలంగాణ బిల్లు’ను ఎన్నికల లోగా పాస్ చేయించి, విభజన ద్వారా తన పెద్దరికం నిలుపుకోగలనని ఎలా భావిస్తున్నదో కదా!’’ అన్నాడు సన్యాసి.

‘‘ఇందులో చిత్రం ఏముందోయ్! ‘డివైడ్ అండ్ రూల్’ పాలసీ- ‘విదేశీ’ సోనియాగారికి తెలియనిదేమీ కాదుకదా! ఒకటిగా బలంగా వున్న కట్టెల మోపును- విడగొట్టి చితుకులుగా వాడుకోవడం సులభం కానీ, బలపడిన రాష్ట్రంముందు కేంద్రమే బలహీనమై పోగలదని అటు ఎన్.టి.ఆర్ పాలనలో గానీ, వై.ఎస్సార్ పాలనలో గానీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ తడాఖా బాగానే తెలిసి వచ్చింది! వైఎస్సార్ మరణించకపోయి వున్నట్లయితే- ‘సోనియా పెత్తనం’ సాగేదే కాదు. ఆంధ్రప్రదేశ్ బలపడడం ఆవిడకు ఇష్టంలేదు. పి.వి.నరసింహారావు మీద ఆమెకు పీకలదాకా కోపం! పి.వి. తెలంగాణా వాడన్న సంగతి ఆవిడకు తెలియంది కాదు. ఇప్పుడు విభజన ద్వారా తెలంగాణాకు గొప్ప మేలు జరుగుతుందన్న భావనలను అసలు ఆవిడే రెచ్చగొట్టిందనాలి! నిజానికి ఆవిడ కడుపులో వున్నదేమిటో కె.సి.ఆర్ కూడా గ్రహించలేక పోతున్నారనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ విలీనమే ఆవిడ లక్ష్యం కావచ్చుగానీ, అందులో తెలంగాణ మీద ఆవిడ ఒలకబోస్తున్న ప్రేమ ‘ధృతరాష్ట్ర కౌగిలి’వంటిదన్న అనుమానం కలగకుండా జాగ్రత్తపడుతున్నట్లుంది. నిజానికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తనదైన కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వున్నప్పుడు, రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం విభజనవైపు మొగ్గుచూపే దక్షత తానెందుకు నెరపలేకపోతోంది? తన మాటను కాదన్నట్లు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే సమైక్య తీర్మానం అసెంబ్లీలో మూజువాణీ పద్ధతిలో చేయించి పంపితే- ఆగ్రహించి, తన అధికారాన్ని వినియోగించి, సి.ఎం.ని తప్పించి వేయచ్చుకదా! నోరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి చేత జంతర్‌మంతర్ దగ్గర వౌనదీక్ష పట్టేటట్లు చేసి, నోరులేని ప్రధాని మన్మోహన్ చేత పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం గురించి స్వయంగా మాట్లాడేలా చేయడం- అదేం ద్వంద్వ వైఖరి? లేదా అతి తెలివి?’’ అన్నాడు ప్రసాదు.


‘‘శరీరావయవాల్లోని కణాలన్నీ సక్రమంగా వుండాలి. సరిగా పనిచేస్తూండాలి. ఏ కణం అపరిమితంగా అభివృద్ధి చెందినా, అది క్యాన్సర్ కారకమవుతుందిట! దేశమనే దేహంలోని ఆంధ్రప్రదేశ్ కణం అలా పెరిగిపోతున్నట్లుందన్న వ్యాధికారక భావన పాపం సోనియాకు బహుశః ఏర్పడిందేమో తెలియదు. ‘విభజనే’ ఆంధ్రప్రదేశ్ రోగానికి చికిత్స అని ఆవిడ భావనేమో! అసలు వ్యాధి నిర్ధారణ చేసేదెవరట? పేషెంట్‌కు కొన్ని లక్షణాలనుబట్టి భయాలు ఏర్పడటం సహజం. ‘అభివృద్ధి గురించిన’ తెలంగాణ భయాలను నివారించడానికి- మందులు, థెరపీలు కాక, ఏకంగా ‘శస్తచ్రికిత్స’కు సమకట్టడం ఆవిడకు ‘కేస్ స్టడీ’బాగా తెలిసినందువల్లనే అని నమ్మడం ఎలా? శ్రీకృష్ణకమిటీ రిపోర్టులు గానీ, అసెంబ్లీలో వ్యక్తమైన అభిప్రాయాలు, తీర్మా నం గానీ, పరిగణనలోనికి తీసుకోకుండా- అసలు ‘శస్తచ్రికిత్స’కు పేషెంట్ తట్టుకుని నిలబడగలడా? అనయినా ఆలోచించకుండా, దిగ్విజయ్‌సింగ్, షిండేలే ‘ఎక్స్‌పర్ట్’ లన్నట్లు, వారి మాటలకే విలువనిస్తూ- కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తి చందాన, ఓట్లకోసం తాననుకున్నదే చేసే ఈ వైఖరి- సమర్ధనీయమేనా? అని ఆలోచించేదెవరు’’ అన్నాడు సన్యాసి ఉద్వేగంగా.


‘నిజమే! తెలుగుతేజం చాలామందికి కంటగింపుగానే ఉంటోంది. బిల్‌గేట్స్ అంతటి వాడే తాను తప్పుకుని, ఈ సాంకేతిక విప్లవ సంధికాలంలో ‘మైక్రోసాఫ్ట్’వంటి సంస్థను ఇక ముందుండి నడిపించగల సత్తా- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువాడు సత్య నాదెళ్ళకు వుందని, అతనిని సి.ఈ.ఓగా నియమించడం మన తెలుగు ఘనతకు నిదర్శనం కాదా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి. అనంతపురం బుక్కాపురు గ్రామానికి చెందినవారు. కేంద్ర ప్రణాళిక కమిషన్ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా చేసినవారు. ఉద్యోగరీత్యానే హైద్రాబాద్‌లో వుంటూ- కొడుకుని రాష్ట్ర రాజధానిలో చదివించారు మరి! మైక్రోసాఫ్ట్ పీఠంపై తెలుగువాడున్నందుకు గర్విస్తామా? ప్రాంతం పేరు చెప్పుకుని, అసలుకి- మనవాడు అనో, మనవాడు కాదనో ‘మందబుద్ధితో’ సంకుచితంగా ఆలోచిస్తామా? కలసి వున్న కాలంలో పొందిన లాభాలన్నింటినీ విస్మరించి, కేవలం అసంతృప్తులను భూతద్దంలో చూపి, పెంపుచేసుకుని, కోరి కష్టాలను తెచ్చుకుంటామం టే- సర్దిచెప్పవలసిన వారే ‘విభజించుపాలించు’ సూత్రం తో రాజకీయం చేయడం... ఇప్పుడు ప్రత్యక్ష వర్తమానం. జలుబుకూ, దగ్గుకూ కూడా - కార్పొరేట్ ఆసుపత్రుల ‘అనవసర పరీక్షలు’ తలవొగ్గి చేయించుకుంటూ, ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’ చందాన పెంచుకుంటున్న అవివేకానికి- అడ్డుకట్టలు వేయడం చేతకాకపోతే, ఇక ‘కానున్నది కాకమానదు’అన్న నిర్వేదమే గతి! సమస్యను మనం పరిష్కరించుకోలేక, మన వాళ్ళ అనుభవ సూక్తాలు మనకు పనికిరాక, ‘ఉత్తరాది డాక్టర్ల’ ఉత్తర్వులే ఔదల దాల్చుకుంటే, మనని మనం ఉద్ధరించుకోవడం కాదు.. ‘ఉత్తరించుకోవడమే’ జరిగేది! ‘‘మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి’’ అన్నట్లు, తెలుగుల భవిష్యత్తు ఇక గతకాలపు కీర్తివైభవాలకే సరిపెట్టుకోదల్చుకుంటే, భవిష్యత్తు ఒకటిగాకాక ముక్కలుగానే వెలుగుతుంది. ఏదీ ఆగదు. అనుకున్నట్టుగానే అంతా సాగదు. అయినా అనుభవించక తప్పదు.’’అని లేచాడు రాంబాబు.











0 comments: