ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 2, 2012

వీచే గాలులు






‘‘వేగంగా గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయం తీవ్రంగా తయారవుతోంది. లోతట్టుల రక్షణ నిర్దేశమవుతోంది. ఎదుర్కునేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందంటున్నారు’’ అన్నాడు సన్యాసి.

‘‘ఇదంతా చర్విత చర్వణ పరిభాషే కదు నాయనా! ‘నీలం’ తుపాను గురించికదా ఇప్పుడు! తుపాను వస్తోందంటే, దాని తాలూకు ‘జార్గాన్’కూడా ఈదురుగాలిలా ముందుకొస్తుంది. అంతేకదా’’ అన్నాడు నవ్వుతూ ప్రసాదు.

‘‘నేనంటున్నది, నీవనుకుంటున్నది కాదు మిత్రమా! ఇప్పుడు వాతావరణం- అసలుకి ఎన్నికల గాలులు గురించి! 2014 తీరం దాటడానికి ఇప్పట్నుంచే, పార్టీల సమయం ‘సంయమనం’దాటి, తీవ్రంగా తయారవుతోంది. కులాల ‘లోతట్టు’ల రక్షణ నిర్దేశితమవుతూ, మా పార్టీ బి.సిలకు ఇన్ని సీట్లు ఇస్తుందంటే, మేం ఫలానా కులం వారినే గద్దెనెక్కిస్తాం అని ఇంకో పార్టీ అంటుంది. ఎప్పుడో రాబోయేది- ఇవాళో, రేపో మధ్యంతరంగా వచ్చేస్తుందన్నట్లు, ఎదుర్కునేందుకన్నట్లుగానే- అన్ని పార్టీల యంత్రాంగం సర్వసన్నద్ధంగా కదులుతోంది. ‘నీలం’ తుపాను విషయం- దానిముందు వట్టి‘పేలవం’గా తప్ప మరోలా గోచరిస్తూందనలేం’’ అన్నాడు సన్యాసి.

‘‘మరేమరే! ఇప్పుడు పాదయాత్రల గాలులు వీస్తున్నాయిలే! ‘వస్తున్నా మీకోసం’అని ఒక తుపాను, ‘ఇందిరమ్మబాట’ అని ఒక గాలి దుమారం, ‘ప్రస్థానం’ అంటూ ఒక వాయుగుండం. మేధోమథనం అంటూ తమదైన మరో గాలి. ఇది రాష్ట్రంలో! ఇలాంటి రాజకీయ పవనాలే పలు తీరుల దేశం ఇతరత్రా కూడాను! గుజరాత్‌లో మళ్లీ నరేంద్రమోడీ గాలి వీస్తోందట. హిమాచల్‌ప్రదేశ్‌లో శీతలం పోయి, ఎన్నికల వేడి గాలులను ‘సోనియా’కూడా ఊదుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉండగానే- కొత్త గాలులకోసం రాహుల్‌గాంధీ బలపడచూస్తున్నారట. ‘రాహుల్ సేన’అనే ఒక యంత్రాంగమూ సన్నద్ధమవుతోంది’ అన్నాడు శంకరం.

‘‘కేంద్ర మంత్రివర్గంలో ఇటీవల జరిగిన మార్పులూ- రాబోయే ఎన్నికల తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రీకృతం చేసినవేననీ అంటున్నారు కదా! కానీ చూసారూ! ‘వానరాకడ ప్రాణంపోకడ’ అని సామెత ఊరికే రాలేదు. ఎంత సాంకేతికత పెరిగినా, ఎన్ని ముందు హెచ్చరికలు జరిగినా, ఏ ప్రమాద సూచికలు ఎగురవేసి యంత్రాంగాన్ని ఎన్నివిధాల సంసిద్ధులును చేసినా, వచ్చే ‘ఉప్పెన’రాక మానదు. జరగవలసిన నష్టాలు జరుగక మానవు. ‘‘అనుకున్నామని జరగవుఅన్నీ- అనుకోలేదని ఆగవు కొన్నీ’’ అన్న ఫిలాసఫీ కరెక్టే మరి! ఊరించిన ‘ఆశ’ ఉల్టా అయిపోవచ్చు. ‘ఉత్తగనే కూసోలే’ అని బింకపు పరుగులు తీసినా, ఎందుకో చతికిలబడిపోనూ వచ్చు. ఇప్పుడు సన్యాసీ! అందువల్ల నువ్వన్నట్లు ఒకదాని ‘జార్గాన్’ మరోదానిలో ‘ఆర్గాన్’లా చొరబడుతోంది. ఎన్నికల తుపాను సమీపిస్తోందని- ఎవరి గుడిసెనువారు అతలాకుతలం కాకుండా నిలుపుకునే యత్నాలు చేస్తూనే వున్నారు’’ అన్నాడు ప్రసాదు.

‘‘యుద్ధానికి సన్నద్ధం’’అని అనకపోతే- వీరుడినయినా ‘్భరుడనే’ అంటారు. ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలయినా ముందు పలికి తీరాలి. అందుకే కదా! సుదీర్ఘ విరామం తరువాత.. అంటే దాదాపు ఎన్నికల కాలంలాగా అయిదేళ్ళ తరువాత క్రికెట్ సమరంలో కూడా- భారత్‌లో ఇంగ్లాండు పర్యటన పూర్తికాకముందే, డిసెంబర్ చివర్లో- ఇండో- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌కు.. మూడు వనే్డలు, రెండు టి-20లు వుండేలా, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యువతకు క్రికెట్ వేడి రగిలిస్తే- ఆ ‘సెగ’ను మెల్లగా ఎన్నికల వైపునకు మరలించుకోవచ్చని కూడా కడుపులో ఓ విషయం దాచుకున్నట్లు ఊహలు మరి!’’ అన్నాడు శంకరం.

‘‘అంతే! అంతే! ఎన్నికల లక్ష్యంగా ‘మేల్కొల్పులు’అనేకం జరగడం అంటే, అలారం మోగించుకుని- జాగృతం కావడమే! గమనించారో లేదో... కులాల సంఘటితాలూ పదునెక్కుతున్నాయి. రాజకీయంగా తమ ఓట్లకు వున్న బలాన్నీ, రాజకీయ పార్టీల వారికి తమ అగత్యాన్నీ అనివార్యంగా దృష్టిలోకి తీసుకురావాలని, ఎస్.సి, ఎస్.టిలు, బి.సి.లే కాదు, ఇప్పుడు బ్రాహ్మణాది కులాలవారూ సంఘటితమవుతున్నారు. ఏదో ఒక మిషతో ఈ చైతన్యపు ‘మిషన్’ మొదలవుతోంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘అవును మరి! ఎవరికివారు ‘అసర్ట్’ చేసుకుని, తమ బలాన్నీ, బలగాన్నీ సమీకరించుకుని, స్థిరీకరించుకుంటే తప్ప మనుగడ పట్ల విశ్వాసం ఏర్పడదు! తమ హక్కులకోసం పోరాడడం, ‘అదును’లోనే తాము ‘పదును’ ఎక్కడం ఎవరికయినా అవసరమే! లేకపోతే- మెతగ్గా వున్నా, ఉదాసీనంగా వున్నా తొక్కేసేందుకే చూస్తారు! ‘‘పూనుస్పర్థలు విద్యలందే- వైరములు వాణిజ్యమందే’’ అంటే, ‘‘్ఫఫోవోయ్! పెద్ద చెప్పొచ్చావ్ మాకు’’అని ఠలాయించేసి, తమ జులాయితనాన్ని జనం ‘్భలాయ్’కోసం అని పేట్రేగిపోతున్నారాయె! అవినీతి అందలాలెక్కి, జైళ్లు బార్లా తెరుచుకున్నా- హాయిగా హాలిడే రిసార్ట్స్‌లో ఆనందం పొందినట్లు నిష్టూచీగా, ని స్సిగ్గుగా వుండడం అలవాటైయ్యాక, తుపానులో గడ్డిపోచలా వంగిలేస్తూంటారు కానీ, పూర్తి ప్రక్షాళనంకు స్ఫూర్తి పొందరు! ఏమయినా- ‘విలయం’అంటే, ‘నిల యం’ గురించీ, దాని ‘అభయం’ గురించి ఆలోచిస్తారు. లోపల ‘్భయం’ అంటూ ఒకటుంటుంది కనుక, అలాంటప్పుడు ఎంతో నయం! ఏమయినా ‘్ధ్యయం’ గొప్పది. ఆ ధ్యే యానికి న్యాయంగా, కర్తవ్యాలకు సాయంగా, ప్రజపురోగమించడం కావాలి.’’ అంటూ లేచాడు సన్యాసి.

0 comments: