ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 21, 2013

అంతరిస్తున్న ఒక వ్యవస్థ



‘‘ టెలిగ్రాం-"
బయటినుంచి ఆ కేక వినగానే ఆరోజుల్లో మొదట గుండెలు దడదడలాడేవి, ఏ దుర్వార్త అందుకోవలసి వస్తుందోనని.. శుభాశుభాలు రెండింటికీ ‘టెలిగ్రాం’ఇవ్వడం వున్నా, ఎందుకో ఎక్కువగా ‘టెలిగ్రాం’ కీడునే శంకించేది. ‘మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ’లాంటి వర్తమానాలు టెలిగ్రాం చేరవేసేది. అలాగే పరీక్ష పాసయినా, పిల్లలు పుట్టినా వెంటనే టెలిగ్రాం పంపేవారు. సెలవు పొడిగించాల్సి వస్తే ఉద్యోగి దూరప్రాంతం వెళ్లినప్పుడు తన ఆఫీసుకి టెలిగ్రాం ఇచ్చేవాడు. అలాగే దూరాభారంవల్ల ఆత్మీయుల పెళ్లికి వెళ్లలేకపోతే- వివాహ శుభాకాంక్షలు టెలిగ్రాం ద్వారానే పంపేవారు, వధూవరులకు శుభాకాంక్షలు తెలుపమనేవారు. అదే విధంగా సానుభూతి సందేశాలు కూడా ‘టెలిగ్రాం’చేరవేసేది. ‘టెలి గ్రాం’ జనజీవన మమేకమై ఒకనాడు కథలు, నాటికలు, సినిమాల్లోకూడా ప్రధాన భూమిక పోషించేది. అలాంటి ‘టెలిగ్రాం’వ్యవస్థ జూలై ’15నుంచి సమూలంగా ‘రద్దు’ అవుతోందిట’’అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టేబుల్‌మీద పెడుతూ. 


‘‘నిజమే! అభివృద్ధిచెందిన సాంకేతికత టెలిగ్రాఫిక్ వ్యవస్థ అస్తిత్వాన్ని పూర్తిగాదెబ్బతీసింది. ఇవాళ సెల్‌ఫోన్లు, ఈమెయిల్స్ వచ్చాక ఉత్తరాలు, టెలిగ్రాంలు కనుమరుగయ్యాయి. ఆర్డినరీ టెలిగ్రాం, ఎక్స్‌ప్రెస్ టెలిగ్రాం, స్పీడ్‌పోస్ట్ వీటన్నింటి అవసరమూ మొబైల్స్, ఇంటర్నెట్ వచ్చాక తీరిపోయింది. క్షణాల్లో వర్తమానం చేరవేయడం, వెనువెంటనే ఏ విషయాన్నయినా కావలసిన వారితో మాట్లాడగలగడం ఆధునిక సాంకేతికాభివృద్ధి అందుబాటులోకి వచ్చాక, ‘టెలిగ్రాం’ పాతబడిపోవడంలో వింతేముంది!

గత శుక్రవారం మా అత్తగారు పోయిన వార్త దూరంగా వున్న నాకు మా ఫణి ఫోన్‌చేసి చెప్పిన అయిదు నిమిషాల్లోగానే- నా మొబైల్‌కు ఇతరుల సంతాప సందేశాలు ఎస్సెమ్మెస్‌ల ద్వారానూ, నేరుగా సంభాషించడం ద్వారానూ అందాయంటే, ఒకప్పటి రోజులకీ ఇప్పటికీ ఎంత తేడాయో తెలియడం లేదూ! ‘టెలిగ్రాం’ద్వారా- చివరి చూపులకు రావలసిన వారికి వర్తమానం పంపడం, ఆ తరువాత మిగతావారికి ‘‘గం.భ.స మా అత్తగారు లక్ష్మీబాయి 14వ తేదీ స్వర్గస్తులైనారని తెలియచేస్తున్నాను’’ అంటూ దశదినకర్మ వివరాలతో లేఖలు రాయడం, ఈ కాలంలో అవసరం లేదుకదా! అందరికీ ఎస్సెమ్మెస్‌లు ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఫేస్‌బుక్‌లో అప్‌డేటింగ్ ద్వారా విషయం సెకండ్లలో పరివ్యాప్తం చేయచ్చు. ‘టెలిగ్రాం’ నిజంగానే అంతరించింది. కానీ ఆ వ్యవస్థ సమూలంగా అంతరించిపోతోందంటే ఏమిటోలానే వుంది. ఒక కోడ్ సంఖ్యద్వారా వంద రకాల వర్తమానాలు ‘టెలిగ్రాం’గా వెళ్ళే ఆరోజులు ఇక ముగిసిపోయినట్లేగా!’’ అన్నాను నేను. 


‘‘ఏటా మూడువందలనుండి నాలుగువందల కోట్ల రూపాయల నష్టంతో టెలిగ్రాఫిక్ శాఖ నడుస్తోందిట. అంచేత భారత సంచార్ నిగమ్స్ లిమిటెడ్- ‘బి.ఎస్.ఎన్. ఎల్’, టెలిగ్రాం వ్యవస్థ రద్దుచేయడానికి నిర్ణయించింది. టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆమోదం ఒక్కటే తరువాయి. అయితే టెలిగ్రాఫ్ ఉద్యోగస్తుల ఉద్యోగాలు తీసివేయమనీ, వారిని టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీచేస్తామనీ- హామీఇచ్చిందట. నిజానికి గత పదేళ్లుగా జనజీవనం నుంచి ‘టెలిగ్రాం’ పంపడం అనేది ఎప్పుడో తప్పుకుంది. 182కు పైగా టెలిగ్రాఫిక్ ఆఫీసులు పనిలేక గోళ్లుగిల్లుకుంటునే వున్నాయి. ‘టెలిగ్రాం’ పంపడం అంటే టెలిగ్రాం ఫారమ్‌లో పెన్నుతో రాయడం, ఆ పదాలనుబట్టి పదానికి ఇంత చొప్పున రుసుము లెక్కకట్టి, టెలిగ్రాం ఛార్జీలు వసూలుచేయడం వుండేది. మొదట్లో అందుకునే టెలిగ్రాంలు కూడా రాతలోనే వుండేవి. ఆ తరువాత టైప్ చేసిన స్లిప్పులతో వచ్చేవి. వెబ్ ఆధారిత టెలిగ్రాం సిస్టమ్‌గా 2010లో సాంకేతికంగా టెలిగ్రాంను అభివృద్ధిపరిచినా ప్రయోజనం కలగలేదుట. నిజానికి ఆరు దశాబ్దాల తరువాత 2011 మేలో టెలిగ్రాం ఛార్జీలు మార్పుచెందాయి. ఆదాయం పెంపుకై వారుచేసిన ప్రయత్నాలు ఏవీకూడా ఫలించలేదు. జనం ‘టెలిగ్రాం’అన్నదానిని మరిచిపోయినట్లే అయింది. మరి ఇక విధిలేని పరిస్థితుల్లో ఆ వ్యవస్థను వచ్చేనెల జూలై 15నుంచి పూర్తిగా రద్దుచేయడం జరుగుతోంది’’ అన్నాడు రాంబాబు. 


‘‘విద్యుత్ సంకేతాల ద్వారా మొట్టమొదటగా టెలిగ్రాం అనేది కలకత్తానుండి డైమండ్ హార్బర్‌కు యాభై కిలోమీటర్ల దూరానికి తొలి ప్రత్యక్ష వేగవంతమైన వర్తమానంగా మన దేశంలో 1850 నవంబర్ అయిదున బట్వాడా అయింది. టెలిగ్రాం సర్వీస్ అనేది సాధారణ ప్రజానీకానికి కూడా 1855 ఫిబ్రవరి నుండి అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ‘టెలిగ్రాం’ అన్న పిలుపు పోస్ట్‌మ్యాన్ ద్వారా వాకిలిముందు వినిపిస్తే ఎన్ని గుండెలు దగదడలాడేయో! టెలిగ్రాం చింపి చదువుకుని విషాదంతో కృంగిపోయినవారు, ఆనందంతో పొంగిపోయినవారు, పరుగులు తీసినవారు ఎందరెందరో! ఆ తరం దాటి ‘ఈ’తరంలోకి వచ్చేసాం. ఉత్తరాలు రాసుకోవడం, టెలిగ్రాంలు పంపుకోవడం ఈ తరానికి అవసరమే లేదు. అయితే ఇప్పటికీ రక్షణ దళాలు, ఇంటలిజెన్స్ కమ్యూనిటీ టెలిగ్రాం వ్యవస్థపై ప్రత్యేక ప్రయోజనాలతో ఆధారపడే వ్యవహరిస్తున్నారు. మరీ మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు ‘టెలిగ్రాం’ కొంతమేరకు అస్తిత్వంలో వుంది. కానీ ‘టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆమోదిస్తే బి.ఎస్.ఎన్.ఎల్. జూలై ’15నుంచి ‘టెలిగ్రాం’కు గుంటపెట్టి గంటవాయించేస్తుంది. ‘టెలిగ్రాం’ అన్నది ఇక గత చరిత్రగా మాత్రమే మిగిలిపోతుంది’’అంటూ చెమర్చిన కన్నులు తుడుచుకున్నాడు సుందరయ్య.





0 comments: