ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 16, 2012

రైల్వే తర‘గతి’


‘మావాడు మొదటి తరగతిలో వచ్చాడు’’ అన్నాడు రాంబాబు గొప్పగా.

‘‘మా వాడు మూడో తరగతిలో వచ్చాడు తెలుసా’’ అన్నాడు ప్రసాదు.

‘‘మీ అబ్బాయి కంటే రాంబాబు వాళ్ల అబ్బాయి చిన్నవాడు అనుకుంటానే!’’ అన్నాడు ప్రసాద్‌తో శంకరం.

సుందరయ్య నవ్వాడు. ‘‘నవ్వుతావేంటి’’అని అడిగాడు శంకరం. ‘‘రాంబాబు వాళ్లబ్బాయి ఇంజనీరింగులో వున్నాడు. వాడు ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని తను అంటూంటే, ప్రసాదు- వాళ్ళబ్బాయి మూడో క్లాసులోకి రావడం గురించి చెబుతున్నాడు’’ అన్నాడు సుందరయ్య.

‘‘అవునా! రాంబాబు వాళ్లబ్బాయి రైల్లో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణంచేసి వస్తే, ప్రసాదు వాళ్లబ్బాయి థర్డ్‌క్లాస్‌లో ప్రయాణంచేసి వచ్చి, గొప్పగా చెప్పుకుంటున్నాడేమిటి అనుకున్నాలే!’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.

ఈ క్లాసుల గోల ఎప్పుడూ వుండేదేలే! దాన్నే ‘వర్గవైరుధ్యం’ అనేది. అయినా రైళ్లల్లో ఇప్పుడు ‘స్లీపర్ క్లాస్’ అంటున్నారు గానీ- 'థర్డ్ క్లాస్’ అన్నమాటే లేదు! ఎప్పుడో గాంధీగారు దక్షిణాఫ్రికా రైలు ప్రయాణంలో ఎదుర్కొన్న వివక్షత గురించీ, మన దేశంలో రైల్లో ఆ రోజుల్లో మూడో తరగతి పెట్టెలో ప్రయాణించడం గురించి కథగా చెప్పుకుంటూంటాం! ఈ తరగతుల వైరుధ్యం ‘క్లాస్’అండ్ ‘మాస్’గా వుందివాళ ప్రధానంగా! ఫస్ట్‌క్లాస్ కంటే థర్డ్‌క్లాస్ పెద్దది అన్నమాట విద్యారంగంలో కానీ, రైల్వే రంగంలో కాదుగదా! సంపన్నుడు రైల్లో మొదటి తరగతిలో ప్రయాణం చేస్తాడు. సామాన్యుడు ఆ ఏసీ ప్రయాణాలు కాక, మామూలు స్లీపర్ కోచ్‌లోనో, జనరల్ బోగీలోనో ప్రయాణిస్తాడు. రైల్వేలు సాంకేతికంగా అభివృద్ధిచెందినా- భద్రత, పటిష్ఠతలు ఇవాళ్టికీ అరకొరగానే వున్నాయి. మొన్న రైల్వేమంత్రి దినేష్‌త్రివేదిగారు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ- యూరప్, జపాన్‌లతో పోటీపడవలసి వుందన్నారు. హైస్పీడ్ రైళ్లువున్నా ఆ దేశాలలో ప్రమాదాలు తక్కువే! మనకింకా ఆ భరోసాలేదు కదా! అంచేతే ‘రైల్వేసేఫ్టీ అథారిటీ’ ఏర్పాటుచేయడానికీ, ‘రైల్వే రీసెర్చి డెవలప్‌మెంట్ కౌన్సిల్’ ఏర్పాటుచేయడానికే యు.పి.ఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎనిమిదవ రైల్వేబడ్జెట్‌లో సంకల్పించారు’’ అన్నాడు సుందరయ్య.

‘‘ ‘ఛోటా బడా సబ్‌కో అప్నామాన్‌తే హైరైల్’ అంటూ త్రివేదిగారు కవితాత్మకంగా అన్నారు గానీ, రైలుప్రయాణాల్లోనూ వైరుధ్యం అనివార్యమర్రా! అన్నీ ‘గరీబ్ రథ్’లు కావు కదా! ‘భారతీయరైల్వే బంగారం లాంటిది’ అన్నారాయన. బంగారం ధరలు పెరుగుతూ, తరుగుతూ వుంటాయని అందులో ఉద్దేశమేమో! అఫ్‌కోర్స్! స్వచ్ఛత గురించి అనుకునేటట్లయితే మూడువేల అయిదొందల రైళ్లల్లో గ్రీన్ టాయ్‌లెట్లు ఏర్పాటుచేస్తామని చెప్పారనుకో’’ అన్నాడు నవ్వుతూ మళ్లీ సన్యాసి.

‘‘అరవై వేల వంద కోట్ల రూపాయలతో ఈసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ రైల్వేలు నిధుల కొరతతో సతమతమవుతూనే వున్నాయి. కొత్త లైన్ల ప్రతిపాదనలు గొప్పగా ఏంలేవు. పే కమిషన్ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో వున్నామని రైల్వేమంత్రిగారు పాపం బాధపడ్డారు! అయినా గిరిజన ప్రాంతాలను కలుపుతూ లైన్స్ వేస్తామన్నారు. మన రాష్ట్రంలో కాకినాడ పిఠాపురం రైలు లైను గురించీ, జంటనగరాల్లో ఎం.ఎం.టి.ఎస్ రెండవ దశ నిధుల గురించి ఆశ్వాసన ఇచ్చారు. దేశంలో డబ్భైఅయిదు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు వస్తాయన్నారు. ప్రయాణీకుల సౌకర్యాలకు పదకొండు వందల పన్నెండు కోట్లు కేటాయించారట! అరవై వేల కోట్ల బడ్జెట్‌లో అది నిజానికి తక్కువే! ఏమయినా అసలు కాయితాల లెక్కలుకాక, ‘బడ్జెట్’అనేది అమలులో ప్రజాభివృద్ధికి ఆచరణాత్మకం కావడం ముఖ్యం’’అన్నాడు రాంబాబు.

‘‘రాంబాబూ! మొదటి తరగతి, మూడో తరగతి అన్న విభజనలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఫస్ట్‌క్లాసులో పాసయినవారు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు నిజమే! సెకండ్ క్లాసులో పాసయినవారు ఏ ‘ఎం.బి.ఏ’నో చేసి- ఆ డాక్టర్లు, ఇంజనీర్లకే అడ్మినిస్ట్రేటివ్‌లుగా, యాజమాన్య అధికారులవుతున్నారుగా! థర్డ్‌క్లాస్ స్టూడెంట్లు అనుకున్నవారు ఏ రాజకీయాల్లోనే చేరి ఈ ఫస్ట్, సెకండ్ తరగతుల వారిని శాసించగలవారవుతున్నారు. ఇంకా తమాషా ఏమిటంటే- అసలు స్కూల్‌కే వెళ్లనివారు, ఏ మాఫియా గ్యాంగ్‌లుగానో తయారై మొత్తం అందరినీ ఆడించగలవారవుతున్నారు! అంచేత ‘క్లాస్’అన్నది గొప్ప అనుకోలేం ఇవాళ’’అన్నాడు ప్రసాదు.

‘‘అలాగే రైల్వే తరగతి ఏదయినా ‘త్వర’గతి కావాలి మరి’’అని కూడా అన్నాడు.

‘‘పైసల లెక్కన కిలోమీటర్‌కు ఛార్జీలు పెంచామని తెలివిగా రైల్వేమంత్రి చెప్పారుగానీ, లెక్కలు వేస్తే ‘ఛార్జీల షాక్’ ఏమిటో తెలుస్తుంది. ‘అవ్వ పేరే ముసలమ్మ’అని, అన్ని శ్రేణుల్లో ఛార్జీల రేటు పెరగనే పెరిగింది! రైల్వేఛార్జీల పెంపునకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుచేసి, పార్లమెంట్‌లో చర్చించి పెంచుతూంటామని, ‘ముందున్నది ముసళ్ల పండుగ’ అన్నట్లూ ధ్వనింపచేసారు. ప్లాట్‌ఫారం టిక్కెట్టు ‘అయిదు రూపాయలు’ చేసేసారు. అంటే ఒకేసారి రెండురూపాయలు పెంచారు. ‘రూపాయికే కిలో బియ్యం’అన్న మన రాష్ట్రంలో- అయిదు కిలోల బియ్యం వదులుకుని, సామాన్యుడు తన వారిని రైలెక్కించడానికో, రిసీవ్ చేసుకోవడానికో వెళ్లాలన్నమాటే కదా! ‘‘రైల్ గాడీకీ ఛుక్ ఛుక్ మే హీ- ఆమ్ ఆద్మీకా థడ్‌కన్ హై’’అన్న రైల్వేమంత్రిగారు- తెలివిగా ‘గుండెదడ’ను తెలియకుండానే పెంచారులే!’’అన్నాడు సుందరయ్య సీరియస్‌గా.

‘‘ఏడు మారినా ఈడు ముదిరినా ఏమి మారినది ఈ లోకంలో’’ అన్నట్లు- ‘నందన’ రాబోతున్నా, ‘ఆనంద స్యందన’కన్నా,‘ఖర’ బరువులు మోసుకుంటూనే ముందుకెళ్లాల్సి వస్తోంది! ఇంక ఇవాళ ‘సాధారణ బడ్జెట్’ పేర- ఇంకా ఏ ‘గాడిద బరువులు’ పడతాయో భరించాల్సిందేకదా! తరగతి ఏమయినా, ముందు ‘తరం’గతి ఏమిటో- ముందు ముందుగానీ తెలీదు’’ అంటూ లేచాడు శంకరం.



0 comments: